త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shares | మ‌రో ప్ర‌భుత్వ రంగ సంస్థలో షేర్ల‌ను విక్ర‌యించ‌నున్న కేంద్రం.. వేగంగా పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణ అడుగులు..

Shares | దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్ర‌క్రియను వేగవంతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద జింక్, సీసం ఉత్పత్తిదారు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో తన మిగిలిన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

S

Business | Published On Jun 6, 2026, 3.55 pm IST

Shares | మ‌రో ప్ర‌భుత్వ రంగ సంస్థలో షేర్ల‌ను విక్ర‌యించ‌నున్న కేంద్రం.. వేగంగా పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణ అడుగులు..
Advertisement

Shares | దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్ర‌క్రియను వేగవంతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద జింక్, సీసం ఉత్పత్తిదారు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో తన మిగిలిన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రస్తుతం కంపెనీలో సుమారు 28 శాతం వాటా ఉండగా, అందులో 2 శాతం వరకు విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విక్రయం ద్వారా కేంద్ర ఖజానాకు దాదాపు రూ.5వేల కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ వార్తల ప్రభావం స్టాక్ మార్కెట్‌లో వెంటనే కనిపించింది. తాజాగా ముగిసిన‌ ట్రేడింగ్ సెషన్‌లో హిందుస్థాన్ జింక్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతకుముందు రోజు రూ.603.85 వద్ద ముగిసిన షేరు, శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత వేగంగా క్షీణించింది. ఇంట్రాడేలో 6 శాతానికి పైగా పడిపోయి రూ.564 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు దాదాపు 6 శాతం నష్టంతో రూ.567 వద్ద ముగిసింది. ఈ పతనం కారణంగా స్వల్పకాలిక పెట్టుబడిదారులకు గణనీయమైన నష్టాలు వాటిల్లాయి.

10 శాతం క్షీణించిన షేర్ ధ‌ర‌..

ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.2.40 లక్షల కోట్లు కాగా గత 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.733 గా న‌మోదైంది. అక్కడి నుంచి షేరు ధర 20 శాతానికి పైగా తగ్గింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే 10 శాతం క్షీణించింది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే ఐదేళ్లలో 70 శాతం వరకు రాబడులు అందించింది. ఇదే సమయంలో కంపెనీ మాతృసంస్థ వేదాంత లిమిటెడ్ షేర్లు కూడా 3 శాతానికి పైగా పడిపోయాయి. ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం) జూలై నెలలోనే వాటా విక్రయ ప్రక్రియను ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీ నిర్వహణ బాధ్యతలను ప్రముఖ ఆర్థిక సంస్థలకు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వేదాంతా గ్రూప్‌కు కంపెనీలో 61 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటాలు బీమా సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు, ఇతరుల చేతుల్లో ఉన్నాయి. అయితే 2002 వరకు హిందుస్థాన్ జింక్ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. అప్పటి ప్రధానమంత్రి అట‌ల్ బిహారీ వాజ‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 26 శాతం వాటాను వేదాంతా గ్రూప్‌కు విక్రయించింది. అనంతరం దశలవారీగా వేదాంతా వాటా 61 శాతానికి పెరిగింది.

దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డిదారుల‌కు భారీగా లాభాలు..

దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ స్టాక్ అసాధారణ సంపదను సృష్టించింది. 2002లో దాదాపు రూ.20 వద్ద ఉన్న షేరు, తర్వాత రూ.700 స్థాయికి చేరింది. ఆ సమయంలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు కొనసాగించిన వారికి దాదాపు 1400 రెట్ల రాబడి, అంటే రూ.14 కోట్ల వరకు సంపద సృష్టించినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కంపెనీ కార్యాలయాల్లో విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో, ఇప్పుడు కేంద్రం వాటా విక్రయానికి సిద్ధమవుతోందన్న వార్త మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు భెల్, ఐఆర్‌ఎఫ్‌సీ, కోల్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ వంటి సంస్థల్లో కూడా ఇటీవల వాటా విక్రయాలు చేపట్టిన కేంద్రం, ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని మరింత వేగంగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement