త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Foreign Reserves | భారీగా త‌గ్గిన భార‌త విదేశీ మార‌క నిల్వ‌లు.. తీవ్ర‌త‌ర‌మ‌వుతున్న ఒత్తిడి..

Indian Foreign Reserves | భారత్ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) మే 22తో ముగిసిన వారంలో 7.51 బిలియన్ డాలర్లు తగ్గి 681.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వలు, విదేశీ కరెన్సీ ఆస్తులు రెండూ తగ్గడంతో మొత్తం నిల్వలపై ప్రభావం పడిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

S

Business | Published On May 30, 2026, 12.38 pm IST

Indian Foreign Reserves | భారీగా త‌గ్గిన భార‌త విదేశీ మార‌క నిల్వ‌లు.. తీవ్ర‌త‌ర‌మ‌వుతున్న ఒత్తిడి..
Advertisement

Indian Foreign Reserves | భారత్ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) మే 22తో ముగిసిన వారంలో 7.51 బిలియన్ డాలర్లు తగ్గి 681.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వలు, విదేశీ కరెన్సీ ఆస్తులు రెండూ తగ్గడంతో మొత్తం నిల్వలపై ప్రభావం పడిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 688.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏలు) 2.87 బిలియన్ డాలర్లు తగ్గి 543.03 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో బంగారం నిల్వలు 4.53 బిలియన్ డాలర్లు క్షీణించి 114.79 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. డాలర్ విలువలో లెక్కించే ఎఫ్‌సీఏల్లో యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీల విలువ పెరుగుదల లేదా తగ్గుదల ప్రభావం కూడా ఉంటుంది. భారత్‌కు చెందిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 77 మిలియన్ డాలర్లు తగ్గి 18.75 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ఉన్న రిజర్వ్ పొజిషన్ 33 మిలియన్ డాలర్లు తగ్గి 4.82 బిలియన్ డాలర్లకు చేరింది.

గ‌తేడాదితో పోలిస్తే..

గతేడాదితో పోలిస్తే దేశ విదేశీ మారక నిల్వలు 11.34 బిలియన్ డాలర్లు తగ్గాయి. ముఖ్యంగా ఫిబ్రవరి చివర్లో నమోదైన రికార్డు స్థాయి 728.49 బిలియన్ డాలర్ల నుంచి ఇప్పటివరకు 47 బిలియన్ డాలర్లకుపైగా నిల్వలు క్షీణించాయి. ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా పశ్చిమ ఆసియాలో ఈ ఏడాది ప్రారంభమైన ఘర్షణల ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే నౌకాయానంలో అంతరాయాలు ఏర్పడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో అస్థిరత పెరిగింది. దీంతో భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై అదనపు ఒత్తిడి ఏర్పడింది. పెరిగిన చమురు, ఎరువుల దిగుమతి వ్యయాలను ఎదుర్కొనేందుకు ప్రజలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని, అవసరం లేని విదేశీ కరెన్సీ ఖర్చులను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కాగా మే 15 నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మొత్తం డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ.256.89 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. బ్యాంకు రుణాలు కూడా 16.2 శాతం వృద్ధితో రూ.211.87 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే పక్షవార ప్రాతిపదికన చూస్తే, మొత్తం డిపాజిట్లు రూ.1.8 లక్షల కోట్లు (0.7 శాతం) తగ్గాయి. అలాగే బ్యాంకు రుణాలు రూ.23,807 కోట్ల‌ మేర స్వల్పంగా క్షీణించాయి.

Advertisement
Advertisement