త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | ఆర్‌బీఐ భారీ డివిడెండ్.. కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్లు చెల్లింపు..

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో, ఆర్‌బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్ల సర్‌ప్లస్‌ బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది.

S

Business | Published On May 22, 2026, 5.12 pm IST

RBI | ఆర్‌బీఐ భారీ డివిడెండ్.. కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్లు చెల్లింపు..
Advertisement

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో, ఆర్‌బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్ల సర్‌ప్లస్‌ బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాది రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి అందించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్ సంజ‌య్ మ‌ల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. 2025-26 అకౌంటింగ్ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.2,86,588.46 కోట్లను బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఈ మొత్తం మార్కెట్ అంచనాల కంటే కొద్దిగా తక్కువగా నిలిచింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం కేంద్ర బ్యాంక్ ఈసారి దాదాపు రూ.3 లక్షల కోట్ల రికార్డు సర్‌ప్లస్‌ను కేంద్రానికి బదిలీ చేసే అవకాశం ఉందని భావించారు.

బ‌దిలీ అంచ‌నాల క‌న్నా త‌క్కువే..

ఈ అంశంపై కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు చీఫ్ ఎకాన‌మిస్టు ఉపాస‌న భ‌ర‌ద్వాజ్ స్పందిస్తూ ఆర్‌బీఐ సర్‌ప్లస్‌ బదిలీ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా ఉంద‌న్నారు. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక లోటు ప్రమాదాలను నిర్వహించే అవకాశాలు కొంత పరిమితం కావచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం అదనపు అప్పుల అవసరం కనిపించకపోయినా, సబ్సిడీలు, పన్ను వృద్ధి మందగమనంపై నిఘా కొనసాగిస్తున్నామ‌ని పేర్కొన్నారు. శుక్ర‌వారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఆర్‌బీఐ కీలక గణాంకాలను వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఆర్‌బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరిగిందని తెలిపింది. అలాగే రిస్క్ ప్రొవిజన్లకు ముందు వ్యయాలు 27.60 శాతం పెరిగినట్లు పేర్కొంది. రిస్క్ ప్రొవిజన్, స్టాట్యుటరీ ఫండ్లకు బదిలీకి ముందు నికర ఆదాయం 2025-26లో రూ.3,95,972.10 కోట్లకు చేరిందని, 2024-25లో ఇది రూ.3,13,455.77 కోట్లుగా ఉందని తెలిపింది. అలాగే 2026 మార్చి 31 నాటికి ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61 శాతం పెరిగి రూ.91,97,121.08 కోట్లకు చేరిందని వెల్లడించింది.

పెరిగిన రిస్క్ బ‌ఫ‌ర్‌..

కాగా ఆర్‌బీఐ తన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ను కూడా గణనీయంగా పెంచింది. 2025-26 కోసం రూ.1,09,379.64 కోట్లను కంటింజెంట్ రిస్క్ బఫర్‌కు బదిలీ చేయాలని నిర్ణయించింది. గతేడాది ఈ మొత్తం రూ.44,861.70 కోట్లుగా ఉంది. రివైజ్డ్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం కంటింజెంట్ రిస్క్ బఫర్‌ను బ్యాలెన్స్ షీట్ పరిమాణంలో 4.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య కొనసాగించే సౌలభ్యం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుత మాక్రో ఎకనామిక్ పరిస్థితులు, బ్యాంక్ ఆర్థిక ప్రదర్శన, రిస్క్ బఫర్ల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సీఆర్‌బీని బ్యాలెన్స్ షీట్‌లో 6.5 శాతంగా కొనసాగించాలని సెంట్రల్ బోర్డు నిర్ణయించినట్లు పేర్కొంది. ముడి చమురు ధరల పెరుగుదలతో భారత్ దిగుమతి బిల్లు పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు విస్తరించడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం కావడం వంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆర్థిక బలంగా మారనుంది. ప్రతి ఏడాది ఆర్‌బీఐ తన పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు, కరెన్సీ ముద్రణ ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement