త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax Notice | ఐటీ శాఖ నోటీసు వ‌చ్చిందా ? భయపడొద్దు, ఇలా స్పందిస్తే సరిపోతుంది..

Income Tax Notice | ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) నోటీసు అందుకున్నప్పుడు చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందుతారు. అయితే ఎక్కువ సందర్భాల్లో ఇవి కేవలం విధానపరమైన కమ్యూనికేషన్లే. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌లో సమర్పించిన వివరాలపై అదనపు సమాచారం లేదా నిర్ధారణ కోరుతుంది.

S

Business | Published On May 30, 2026, 4.14 pm IST

Income Tax Notice | ఐటీ శాఖ నోటీసు వ‌చ్చిందా ? భయపడొద్దు, ఇలా స్పందిస్తే సరిపోతుంది..
Advertisement

Income Tax Notice | ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) నోటీసు అందుకున్నప్పుడు చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందుతారు. అయితే ఎక్కువ సందర్భాల్లో ఇవి కేవలం విధానపరమైన కమ్యూనికేషన్లే. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌లో సమర్పించిన వివరాలపై అదనపు సమాచారం లేదా నిర్ధారణ కోరుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా, సమయానికి స్పందిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఈ నోటీసులను నిర్దిష్ట ఆర్థిక వివరాలపై స్పష్టత కోరే అధికారిక సమాచారంగా చూడాలి. సరైన పత్రాలతో పాటు సమయానికి సమాధానం ఇవ్వడం ద్వారా చాలా సందర్భాల్లో వ్యవహారం అక్కడితో ముగుస్తుంది. అయితే నిర్లక్ష్యం చేయడం లేదా అసంపూర్తి సమాధానం ఇవ్వడం వల్ల జరిమానాలు, అదనపు పరిశీలన లేదా పూర్తి స్థాయి ఆడిట్‌కు దారితీసే అవ‌కాశాలు ఉంటాయి.

ధ్రువీక‌ర‌ణ అవ‌స‌రం..

ఏదైనా ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసుకు స్పందించే ముందు అది నిజమైనదేనా అనే విషయాన్ని తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ వెరిఫికేషన్ సదుపాయాన్ని అందిస్తోంది. పాన్ కార్డు, పన్ను సంబంధిత పత్రాలు, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డీఐఎన్), మొబైల్ ఫోన్ వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకుంటే ధ్రువీకరణ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. నోటీసు నిజమైనదని నిర్ధారించుకున్న తర్వాత, అందులో పేర్కొన్న ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్‌ను పరిశీలించాలి. ఆ సెక్షన్ ద్వారా శాఖ ఏ అంశంపై వివరణ కోరుతుందో అర్థమవుతుంది.

ఏయే సెక్ష‌న్ల కింద నోటీసులు ఇస్తారు..?

సాధారణంగా జారీ అయ్యే కొన్ని నోటీసులు ఇలా ఉంటాయి. సెక్షన్ 142(1) కింద అసెస్‌మెంట్‌కు ముందు అదనపు సమాచారం కోరే నోటీసు ఇస్తారు. సెక్షన్ 143(1) కింద రిటర్న్ ప్రాసెసింగ్ సమాచారం (ఇంటిమేషన్) కోసం నోటీసు ఇస్తారు. సెక్షన్ 143(2) ద్వారా సవివర పరిశీలన (స్క్రూటినీ) కోసం నోటీసు జారీ చేస్తారు. సెక్షన్ 148 కింద రీఅసెస్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన నోటీసు ఇస్తారు. అలాగే సెక్షన్ 245 ప్ర‌కారం బకాయిల వసూలు లేదా అడ్జస్ట్‌మెంట్ నోటీసు ఇస్తారు. నోటీసు అందుకున్న వెంటనే దానిని పూర్తిగా చదివి, ఆదాయపు పన్ను శాఖ ఏ వివరాలు కోరుతుందో గుర్తించాలి. అవసరాలు స్పష్టమైన తర్వాత, సంబంధిత అన్ని రికార్డులు, పత్రాలను సేకరించాలి. సాధారణంగా కోరే పత్రాల్లో బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఫామ్‌-16, పెట్టుబడుల ఆధారాలు, గుర్తింపు పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి.

ఏం చేయాలి..?

నోటీసుకు సమాధానం ఇవ్వడానికి పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. అనంతరం పెండింగ్ యాక్షన్స్ ట్యాబ్‌లోకి వెళ్లి ఈ-ప్రొసీడింగ్స్ ను ఎంచుకోవాలి. అక్కడ నోటీసు వివరాలు కనిపిస్తాయి. అవసరమైన సమాధానం, అనుబంధ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. సమాధానం విజయవంతంగా సమర్పించిన తర్వాత, అంగీకార పత్రం (అక్నాలెడ్జ్‌మెంట్) కాపీని సేవ్ చేసుకోవడం మంచిది. ఇది నిబంధనలు పాటించినట్లు ఆధారంగా ఉపయోగపడుతుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసుల విషయంలో సమయానికి స్పందించడం అత్యంత కీలకం. అలాగే ఈ-మెయిల్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా వచ్చే తదుపరి సందేశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఆర్థిక సలహాదారుల‌ని నియమించుకున్న వారు ఈ వ్యవహారాన్ని వారి ద్వారా కూడా నిర్వహించవచ్చు.

Advertisement
Advertisement