త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India IT Services | ఏఐ వృద్ధి.. భారత ఐటీ రంగంపై పెను ప్ర‌భావం.. జేపీమోర్గాన్ హెచ్చరిక..

India IT Services | భారత‌ సమాచార సాంకేతిక సేవల (ఐటీ సర్వీసెస్) రంగం దీర్ఘకాల స్థబ్దతను ఎదుర్కొంటోందని జేపీమోర్గాన్ తాజా పరిశోధనా నివేదిక వెల్లడించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత మార్పులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు సంస్థల టెక్నాలజీ ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.

S

Business | Published On Jul 1, 2026, 10.55 am IST

India IT Services | ఏఐ వృద్ధి.. భారత ఐటీ రంగంపై పెను ప్ర‌భావం.. జేపీమోర్గాన్ హెచ్చరిక..
Advertisement

India IT Services | భారత‌ సమాచార సాంకేతిక సేవల (ఐటీ సర్వీసెస్) రంగం దీర్ఘకాల స్థబ్దతను ఎదుర్కొంటోందని జేపీమోర్గాన్ తాజా పరిశోధనా నివేదిక వెల్లడించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత మార్పులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు సంస్థల టెక్నాలజీ ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా ఐటీ సేవల రంగంలో వృద్ధి మందగించిన పరిస్థితి కొనసాగుతోందని జేపీమోర్గాన్ తెలిపింది. ఈ కాలంలో ఆదాయ వృద్ధి కేవలం 2 నుంచి 3 శాతం మధ్యే పరిమితమైందని నివేదికలో వెల్లడించింది. ఏఐ వినియోగం వేగంగా పెరగడం, క్లయింట్లు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల వచ్చే రెండేళ్లలో కూడా ఐటీ రంగానికి మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఐటీ రంగంపై ఒత్తిడి..

ఏఐ రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీలు తమ టెక్నాలజీ బడ్జెట్‌లను తిరిగి సమీక్షిస్తున్నాయని జేపీమోర్గాన్ తెలిపింది. ప్రస్తుతం ఏఐ ప్లాట్‌ఫామ్‌లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై వ్యయం పెరుగుతుండటంతో, సంప్రదాయ టెక్నాలజీ సేవలకు కేటాయించే బడ్జెట్‌పై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది. దీంతో సాంప్రదాయ ఐటీ ఔట్‌సోర్సింగ్ సేవలకు డిమాండ్ తగ్గుతోందని వివరించింది. ప్రస్తుతం ఐటీ రంగం ఏఐ స్వీకరణలో ప్రారంభ దశలోని డిఫ్లేషన్ పరిస్థితిని ఎదుర్కొంటోందని జేపీమోర్గాన్ విశ్లేషించింది. ఆటోమేషన్, ఏఐ వల్ల పాత సేవల్లో ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ, వాటి స్థానాన్ని భర్తీ చేసే కొత్త ఏఐ ఆధారిత వ్యాపార అవకాశాలు ఇంకా పూర్తిగా ఏర్పడలేదని తెలిపింది.

దీర్ఘ‌కాలిక వృద్ధి అంచ‌నాలు త‌గ్గింపు..

ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల దీర్ఘకాల వృద్ధి అంచనాలను జేపీమోర్గాన్ తగ్గించింది. గతంలో నమోదైన 7 నుంచి 8 శాతం సగటు వృద్ధి రేట్లకు ఈ సంస్థలు తిరిగి చేరుకునే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. సమీప భవిష్యత్తులో ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి 3 నుంచి 4 శాతం మధ్యే ఉండే అవకాశం ఉందని బ్రోకరేజ్ అంచనా వేసింది. అలాగే రంగం పునరుద్ధరణ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, 2029-30 ఆర్థిక సంవత్సరం వ‌ర‌కు కూడా ప‌రిస్థితిలో పెద్ద‌గా మెరుగుద‌ల ఉండ‌క‌పోవ‌చ్చ‌ని హెచ్చరించింది. దీంతో ఐటీ రంగం వృద్ధి ఎల్-షేప్డ్ ధోరణిలో కొనసాగుతుంద‌ని పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ విలువల్లో కూడా ఐటీ రంగం దీర్ఘకాల మందగమనం, సమీప భవిష్యత్తులో స్పష్టమైన పుంజుకునే సంకేతాలు లేకపోవడంపై పెట్టుబడిదారుల ఆందోళనలు ప్రతిబింబిస్తున్నాయని జేపీమోర్గాన్ నివేదిక స్పష్టం చేసింది.

Advertisement
Advertisement