త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు

Kishan Reddy | బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన తమ శాఖకు రాలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి వెల్ల‌డించారు. బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, సింగరేణి నుంచి ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

P

Telangana | Published On Aug 10, 2026, 5.37 pm IST

Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు
Advertisement
  • స్ప‌ష్టం చేసిన కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి
  • రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు ప్రశ్నకు బ‌దులిచ్చిన కేంద్ర‌మంత్రి

Kishan Reddy | బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన తమ శాఖకు రాలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి వెల్ల‌డించారు. బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, సింగరేణి నుంచి ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు గణనీయమైన మూలధన పెట్టుబడి అవసరమని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇది కొత్త రంగం కావడంతో సాధ్యాసాధ్యాల పరంగా పలు సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహాత్మక జాతీయ అవసరాల దృష్ట్యా గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు.

రూ.46 వేల కోట్ల ప్రోత్సాహక పథకాలు

బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్థిక ప్రోత్సాహక పథకాలకు ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. 2024 జనవరి 24న రూ.8,500 కోట్లతో, 2026 మే 13న రూ.37,500 కోట్లతో ఈ పథకాలకు ఆమోదం లభించిందన్నారు. గ్యాసిఫికేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ, భద్రత, చట్టబద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు.

సింగరేణికి ప్రోత్సాహకం దక్కలేదు

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుకు మద్దతు కోరుతూ సింగరేణి నుంచి ఇప్పటివరకు తమ శాఖకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బొగ్గు మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఆర్థిక ప్రోత్సాహక పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు సహా అర్హత కలిగిన దరఖాస్తుదారులందరూ ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉందన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు గ్యాసిఫికేషన్‌ కార్యక్రమాల కోసం ఎలాంటి ఆర్థిక సాయం కోరలేదని, అందువల్ల తమ శాఖ నుంచి ఎలాంటి ప్రోత్సాహకం కేటాయించలేదని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement