త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI Payments | యూపీఐలో స‌గ‌టున ఒక్కో లావాదేవీకి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు అస‌లు ఎంత‌వుతుంది..?

UPI Payments | యూపీఐ చెల్లింపులు కొంతకాలంగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అంశంపై చర్చలు మొదలైన తర్వాత దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు భారత్‌లో చాలా మంది వినియోగదారులకు యూపీఐ ద్వారా చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతున్నాయి.

S

Business | Published On Aug 12, 2026, 3.35 pm IST

UPI Payments | యూపీఐలో స‌గ‌టున ఒక్కో లావాదేవీకి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు అస‌లు ఎంత‌వుతుంది..?
Advertisement

UPI Payments | యూపీఐ చెల్లింపులు కొంతకాలంగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అంశంపై చర్చలు మొదలైన తర్వాత దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు భారత్‌లో చాలా మంది వినియోగదారులకు యూపీఐ ద్వారా చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే యూపీఐ వ్యవస్థను నిర్వహించడానికి బ్యాంకులు, చెల్లింపు సంస్థలు, ఇతర సిస్టమ్‌కు సంబంధించిన సంస్థలకు ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ప్రతిపాదన తర్వాత యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై ఛార్జీలు విధించే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి.

యూపీఐ నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది?

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. యూపీఐ అంటే కేవలం మొబైల్ యాప్ మాత్రమే కాదు. ఇది పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. యాప్ నిర్వహణ, సాంకేతికత, కస్టమర్ సేవలు, బ్యాంకు లావాదేవీల ధ్రువీకరణ, సైబర్‌ సెక్యూరిటీ, కేవైసీ, క్లౌడ్ స్టోరేజ్, మోసాల నివారణ, వివాదాల పరిష్కారం, నిరంతర నెట్‌వర్క్ పర్యవేక్షణ వంటి అనేక అంశాలకు ఇందులో ఖర్చవుతుంది. ఒక అంచనా ప్రకారం యూపీఐ, రూపే డెబిట్ కార్డుల డిజిటల్ చెల్లింపు మౌలిక వసతులను నిర్వహించడానికి సంవత్సరానికి కనీసం రూ.10వేల కోట్ల వరకు ఖర్చ‌వుతుంద‌ని తెలిసింది. అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2021-22 నుంచి 2024-25 మధ్య సుమారు రూ.8,730 కోట్ల సబ్సిడీని అందించింది. ఇది డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ మొత్తం ఖర్చులో కేవలం 11 శాతం మాత్రమేనని నివేదిక పేర్కొంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు సంవత్సరానికి మొత్తం ఖర్చు సుమారు రూ.20వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. అంటే ప్రతి లావాదేవీపై సగటున సుమారు 83 పైసలు ఖర్చవుతున్నట్లు అంచనా.

యూపీఐపై ఎంత ఛార్జీ ఉండొచ్చు?

పెద్ద వ్యాపార సంస్థలు చేసే యూపీఐ చెల్లింపులపై 0.3 నుంచి 0.6 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఎండీఆర్ అంటే చెల్లింపును ప్రాసెస్ చేసినందుకు బ్యాంకు లేదా చెల్లింపు సంస్థ వ్యాపారి నుంచి వసూలు చేసే రుసుము. అయితే కొంతమంది నిపుణులు దీనికంటే చాలా తక్కువ ఎండీఆర్ ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంచనా వేస్తున్నారు. యూపీఐపై ఎండీఆర్ 0.05 నుంచి 0.07 శాతం వరకు ఉండే అవ‌కాశం ఉంద‌ని వారు భావిస్తున్నారు. ఈ రుసుములు ప్రధానంగా పెద్ద వ్యాపార సంస్థలకే వర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే క్రెడిట్ కార్డులపై సాధారణంగా 1 నుంచి 3 శాతం వరకు ఎండీఆర్ ఉంటుంది. డెబిట్ కార్డులపై ఈ రుసుము సుమారు 0.9 శాతంగా ఉంటుంది.

యూపీఐపై ఛార్జీలు ఎందుకు ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌లో ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్, 2026ను ప్రవేశపెట్టారు. ఇందులో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007కు కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణల ద్వారా కొన్ని రకాల యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థల ప్రొవైడర్లు రుసుములు వసూలు చేసేందుకు అవకాశం కల్పించే అంశాన్ని ప్రతిపాదించారు. అయితే దీనర్థం ప్రతి యూపీఐ చెల్లింపుపై ఛార్జీ విధిస్తారని కాదు. కొన్ని నిర్దిష్ట రకాల చెల్లింపులకు మాత్రమే రుసుము వర్తించే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement