త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PhonePe | ఫోన్ పే యూజ‌ర్లకు గుడ్ న్యూస్‌.. యూపీఐ చెల్లింపులు ఉచిత‌మే..

PhonePe | యూపీఐ చెల్లింపుల‌కు గాను త్వ‌ర‌లో చార్జీల‌ను చెల్లించాల్సి వ‌స్తుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్ పే సీఈవో స‌మీర్ నిగ‌మ్ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. యూపీఐ చెల్లింపుల‌పై లావాదేవీ చార్జీలు విధించ‌నున్నార‌నే ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఈ అంశంపై కీల‌క వివ‌రాల‌ను వెల్లడించారు.

S

Business | Published On Aug 8, 2026, 6.18 pm IST

PhonePe | ఫోన్ పే యూజ‌ర్లకు గుడ్ న్యూస్‌.. యూపీఐ చెల్లింపులు ఉచిత‌మే..
Advertisement

PhonePe | యూపీఐ చెల్లింపుల‌కు గాను త్వ‌ర‌లో చార్జీల‌ను చెల్లించాల్సి వ‌స్తుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్ పే సీఈవో స‌మీర్ నిగ‌మ్ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. యూపీఐ చెల్లింపుల‌పై లావాదేవీ చార్జీలు విధించ‌నున్నార‌నే ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఈ అంశంపై కీల‌క వివ‌రాల‌ను వెల్లడించారు. యూపీఐ సేవ‌ల‌ను వినియోగించే సాధార‌ణ యూజ‌ర్ల‌కు ఎలాంటి చార్జీలు ఉండ‌వ‌ని, భ‌విష్య‌త్తులోనూ త‌మ వినియోగ‌దారుల‌కు యూపీఐ సేవ‌ల‌ను పూర్తిగా ఉచితంగానే అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం గూగుల్ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే కలిసి దేశంలోని యూపీఐ లావాదేవీలలో 80 శాతానికి పైగా ప్రాసెస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమీర్ నిగమ్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఫోన్‌పే వినియోగ‌దారుల‌కు ఫ్రీగానే..

లోక్‌సభ ఇటీవల టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్-2026ను ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం అవసరమైతే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌)ను తిరిగి అమలు చేసే అవకాశం కల్పించింది. దీంతో భవిష్యత్తులో యూపీఐ వినియోగదారులపై కూడా ఛార్జీల‌ను విధిస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సమీర్ నిగమ్ త‌న ఎక్స్ ఖాతాలో స్పందించారు. యూపీఐ వినియోగదారులందరికీ ఉచితంగానే కొనసాగుతుంద‌ని, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు ఉండవ‌ని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఒక రోజు ముందే స్పష్టం చేసింది. యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే ఉంటాయని, చిన్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించేందుకు ఎలాంటి ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

చిరు వ్యాపారుల‌కు వ‌ర్తించ‌వు..

అలాగే వర్తించే సందర్భాల్లో మర్చంట్ సర్వీస్ ఛార్జీలు పూర్తిగా వ్యాపారులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఉండే వాణిజ్య ఒప్పందాలకు మాత్రమే సంబంధించినవని, అవి వినియోగదారులపై భారం కాదని కౌన్సిల్ వెల్లడించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులు చేసే తక్కువ విలువ క‌లిగిన‌ యూపీఐ లావాదేవీలకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన లావాదేవీల ప్రాసెసింగ్ ఖర్చులో కొంత భాగాన్ని బ్యాంకులకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి ఎలా ఉచితంగా ఉందో, ఇకముందూ అలాగే కొనసాగుతుంద‌ని, వినియోగదారులు ఎలాంటి లావాదేవీ ఛార్జీలు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేయవచ్చ‌ని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement