త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPF | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖ‌రు వ‌ర‌కు ఖాతాల్లో వ‌డ్డీ జ‌మ‌..

EPF | ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలలోనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ కానున్నాయి.

S

Business | Published On Jun 18, 2026, 1.57 pm IST

EPF | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖ‌రు వ‌ర‌కు ఖాతాల్లో వ‌డ్డీ జ‌మ‌..
Advertisement

EPF | ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలలోనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ కానున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సిఫారసు చేసిన 8.25 శాతం వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ ఆమోదంతో కార్మిక మంత్రిత్వ శాఖ త్వరలోనే ఈపీఎఫ్‌ఓకు వడ్డీ జమ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయనుంది. మార్చి 2న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సూఖ్ మాండ‌వ్యా అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో ఈ వడ్డీ రేటు నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మూడో ఏడాది కూడా ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతం వద్దనే కొనసాగించడం విశేషం. భారత ప్రభుత్వం ఈపీఎఫ్ నిధులకు హామీదారుగా ఉండటంతో, సీబీటీ సిఫారసుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు ఆమోదం లభించడంతో సభ్యుల ఖాతాల్లో వార్షిక వడ్డీ జమ ప్రక్రియను ఈపీఎఫ్‌ఓ ప్రారంభించనుంది.

వేగంగా పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం..

కొత్త డిజిటల్ వ్యవస్థను వినియోగిస్తూ వడ్డీ జమ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది. అవసరమైన అనుమతులు, ప్రాసెసింగ్ పూర్తైన వెంటనే వడ్డీ మొత్తాలు నేరుగా సభ్యుల ఖాతాల్లో ప్రతిబింబించేలా కొత్త వ్యవస్థ పనిచేయనుంది. వేతన ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకాలలో ఒకటి. ప్రతి సంవత్సరం వారి ఖాతాలో ఉన్న మొత్తానికి వడ్డీ జమ అవుతుంది. తాజా నిర్ణయంతో కోట్లాది మంది ఉద్యోగులకు స్థిరమైన రాబడి లభించనుంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో కూడా ఈపీఎఫ్‌ఓ 8.25 శాతం వడ్డీ రేటునే కొనసాగించింది. అంతకుముందు 2022-23లో ఉన్న 8.15 శాతం నుంచి 2023-24లో 8.25 శాతానికి పెంచిన సంస్థ, ఆ తర్వాత నుంచి అదే రేటును కొనసాగిస్తోంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేప‌థ్యంలోనూ సభ్యులకు స్థిరత్వం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వ‌డ్డీ రేట్లు ఎలా కొన‌సాగాయి..

గత దశాబ్దంలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 2021-22లో వడ్డీ రేటును 8.10 శాతానికి తగ్గించారు. అది నాలుగు దశాబ్దాలకుపైగా కాలంలో కనిష్ఠ స్థాయి. 1977-78లో ఈపీఎఫ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీ మాత్రమే లభించింది. ఆ తర్వాత 2020-21, 2019-20లో 8.5 శాతం, 2018-19, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం, 2015-16లో 8.8 శాతం, 2013-14, 2014-15లో 8.75 శాతం వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. 2011-12లో కూడా వడ్డీ రేటు 8.25 శాతంగానే ఉండేది. సభ్యులు వడ్డీ పొందేందుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌ఓ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత వడ్డీ మొత్తం ఆటోమేటిక్‌గా ఖాతాల్లో జమ అవుతుంది. అనంతరం సభ్యులు ఈపీఎఫ్‌ఓ పోర్టల్, ఉమంగ్ యాప్, పాస్‌బుక్ సౌకర్యం లేదా ఇతర అధికారిక ఈపీఎఫ్‌ఓ సేవల ద్వారా తమ తాజా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. కాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో దేశంలోని 7 కోట్లకుపైగా ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో ఈ నెలాఖరు వ‌ర‌కు 8.25 శాతం వడ్డీ జమ కానుంది.

Advertisement
Advertisement