త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | ఇక జీతం నుంచే మ్యూచువల్ ఫండ్స్ కు నేరుగా డ‌బ్బు పంప‌వ‌చ్చు.. సెబీ భారీ మార్పు..

Mutual Funds | భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విషయంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల జీతాల నుంచే నేరుగా డబ్బు తీసుకుని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలకు అనుమతి ఇవ్వాలని సెబీ ప్రతిపాదించింది.

S

Business | Published On May 23, 2026, 1.56 pm IST

Mutual Funds | ఇక జీతం నుంచే మ్యూచువల్ ఫండ్స్ కు నేరుగా డ‌బ్బు పంప‌వ‌చ్చు.. సెబీ భారీ మార్పు..
Advertisement

Mutual Funds | భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విషయంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల జీతాల నుంచే నేరుగా డబ్బు తీసుకుని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలకు అనుమతి ఇవ్వాలని సెబీ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న థర్డ్ పార్టీ పేమెంట్స్ నిబంధనలకు పరిమిత సడలింపులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కన్సల్టేషన్ పేపర్ విడుదలైంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు సాధారణంగా ఇన్వెస్టర్ సొంత బ్యాంక్ ఖాతా నుంచే రావాల్సి ఉంటుంది. ఇతరుల ఖాతాల నుంచి డబ్బు రావడం అనుమతించరు. మనీ లాండరింగ్, మోసాలు, అక్రమ లావాదేవీలు జరగకుండా ఉండేందుకే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చినట్లు సెబీ తెలిపింది. కొత్త ప్రతిపాదన ప్రకారం ఉద్యోగులు స్వచ్ఛందంగా ఈ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. వారు కోరుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను ఎంపిక చేసుకుంటారు. అనంతరం కంపెనీలు ఉద్యోగుల జీతాల నుంచి నిర్ణయించిన మొత్తాన్ని కట్ చేసి ఆయా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో జమ చేస్తాయి. దీంతో జీతానికి అనుసంధానమైన పెట్టుబడి వ్యవస్థ ఏర్పడనుంది.

ఉద్యోగి ఖాతాకే చెల్లింపులు..

అయితే రిడంప్షన్ అమౌంట్ లేదా డివిడెండ్ చెల్లింపులు మాత్రం ఉద్యోగి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకే జమ అవుతాయని సెబీ స్పష్టం చేసింది. కంపెనీ ఖాతాకు లేదా ఇతర ఖాతాలకు ఈ డబ్బు వెళ్లదని పేర్కొంది. ఈ సౌకర్యాన్ని అందించే సంస్థలపై కూడా సెబీ పరిమితులు ప్రతిపాదించింది. లిస్టెడ్ కంపెనీలు, ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ అయిన సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకే ఈ అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే నియంత్రిత వ్యవస్థలో పనిచేస్తున్న సంస్థలు కావడంతో పర్యవేక్షణ సులభమవుతుందని సెబీ అభిప్రాయపడింది. ఉద్యోగులను బలవంతంగా ఈ స్కీమ్‌లో చేర్చరని కూడా సెబీ స్పష్టం చేసింది. ఆసక్తి ఉన్న ఉద్యోగులు మాత్రమే స్వచ్ఛందంగా ఇందులో చేరవచ్చు. భద్రతా చర్యల విషయంలో కూడా సెబీ పలు కఠిన నిబంధనలు ప్రతిపాదించింది. కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, చెల్లింపు చేస్తున్న సంస్థ-ఇన్వెస్టర్ మధ్య సంబంధాన్ని ధ్రువీకరించడం, ప్రతి లావాదేవీకి ఎలక్ట్రానిక్ ఆడిట్ ట్రైల్ నిర్వహించడం, యాంటీ మనీ లాండరింగ్ నిబంధనలు పాటించడం వంటి రక్షణ చర్యలు అమల్లోకి రానున్నాయి. ఈ ఆపరేషనల్ స్టాండర్డ్స్‌ను అసోసియేష‌న్ ఆఫ్ మ్యుచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) సెబీతో కలిసి రూపొందించనుంది.

మ‌రింత సుల‌భంగా పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం..

ఉద్యోగుల జీతాల ద్వారా పెట్టుబడులు పెట్టే వ్యవస్థ వల్ల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మరింత సులభమవుతుందని, పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సెబీ పేర్కొంది. ఇదే కన్సల్టేషన్ పేపర్‌లో మరో కీలక ప్రతిపాదన కూడా చేసింది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్‌ను నగదు బదులు మ్యూచువల్ ఫండ్ యూనిట్ల రూపంలో ఇవ్వాలని సూచించింది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలతో అనుసంధానమవుతాయని సెబీ భావిస్తోంది. అయితే ఇది మిస్ సెల్లింగ్ ప్రమాదాన్ని పెంచుతుందా? లేదా ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తుందా? అనే అంశాలపై కూడా అభిప్రాయాలు కోరింది. ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. పరిశ్రమ ప్రతినిధులు, ఇన్వెస్టర్లు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత సెబీ తుది మార్గదర్శకాలు ప్రకటించనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement