త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!

Gold | భారత మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోయాయి.

S

Business | Published On Jun 18, 2026, 3.44 pm IST

Gold | బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!
Advertisement

Gold | భారత మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. అయితే రానున్న నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేయడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. జేపీ మోర్గాన్ తాజా అంచనా ప్రకారం బంగారం ధరలు రాబోయే నెలల్లో దాదాపు 40 శాతం వరకు పెరగనున్నాయ‌ని వెల్ల‌డించింది. ఈ అంచనా నిజమైతే భారత మార్కెట్లో కూడా బంగారం కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థ అంచనా ప్రకారం ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు సగటున 6వేల డాలర్ల స్థాయికి చేరవచ్చ‌ని అంచ‌నా వేసింది. అలాగే 2027 చివరి నాటికి అది 6,300 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది దాదాపు 40 శాతం పెరుగుదలగా భావిస్తున్నారు.

బంగారం ధ‌ర‌ల్లో అందుక‌నే త‌గ్గుద‌ల‌..

2026లో బంగారం మార్కెట్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతలు, వాటి ప్రభావం కీలకంగా నిలిచాయి. ఫిబ్రవరి చివరి నుంచి బంగారం ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరలను పెంచాయి. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు కూడా మార్కెట్లో పెరిగాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగించే అవకాశాలపై పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. బంగారంపై వడ్డీ లభించదు. అందువల్ల వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బాండ్లు, ఇతర వడ్డీ ఇచ్చే ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఫెడరల్ రిజర్వ్ విధానాలు, బలమైన డాలర్, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ప్రస్తుతం బంగారం ధరలను పరిమిత శ్రేణిలోనే ఉంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

కొనుగోలుకు ఏర్ప‌డుతున్న అనుకూల ప‌రిస్థితులు..

జేపీ మోర్గాన్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం బంగారం ధర రెండు కీలక స్థాయిల మధ్య ఇరుక్కుపోయింది. ఒకవైపు 200 రోజుల మూవింగ్ యావరేజ్ బలమైన మద్దతు ఇస్తుండగా, మరోవైపు 50 రోజుల మూవింగ్ యావరేజ్ వద్ద ప్రతిఘటన కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. అయితే బంగారం ధరలకు మద్దతు ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయని జేపీ మోర్గాన్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. డాలర్ కొనుగోలు శక్తి బలహీనపడే అవకాశం ఉంద‌ని, అమెరికా ఆర్థిక వ్యవస్థ సవాళ్ల‌ను ఎదుర్కొంటుండటంతోపాటు విధానపరమైన అనిశ్చితులు కూడా పెరుగుతున్నాయ‌ని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విభజనలు వేగంగా పెరుగుతున్నాయ‌ని, ఇవన్నీ బంగారం ధరలకు అనుకూల పరిస్థితులను సృష్టించే అవ‌కాశం ఉంద‌ని సంస్థ అభిప్రాయపడింది.

బంగారం ధ‌ర రూ.2.13 ల‌క్ష‌ల‌కు..?

అలాగే ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు నిరంతరంగా బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. ఈ కొనుగోళ్లు కూడా బంగారం ధరలకు ప్రధాన మద్దతుగా నిలుస్తున్నాయని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఈ అంచనా నిజమైతే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.2.13 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కీలక పరిణామంగా మారనుంది.

Advertisement
Advertisement