త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | యుద్ధం ముగింపుతో పాజిటివ్ సంకేతాలు.. బంగారం, వెండి ఇప్పుడు కొనొచ్చా..?

Gold | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా ప్రాథమిక శాంతి ఒప్పందం ప్రకటన వెలువడటంతో వారాంతం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ పరిణామం గ్లోబల్ ఇంధన సరఫరాలపై ఉన్న ఆందోళనలను తగ్గించడంతోపాటు అమెరికన్ డాలర్ బలహీనపడటానికి దారితీసింది.

S

Business | Published On Jun 15, 2026, 3.06 pm IST

Gold | యుద్ధం ముగింపుతో పాజిటివ్ సంకేతాలు.. బంగారం, వెండి ఇప్పుడు కొనొచ్చా..?
Advertisement

Gold | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా ప్రాథమిక శాంతి ఒప్పందం ప్రకటన వెలువడటంతో వారాంతం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ పరిణామం గ్లోబల్ ఇంధన సరఫరాలపై ఉన్న ఆందోళనలను తగ్గించడంతోపాటు అమెరికన్ డాలర్ బలహీనపడటానికి దారితీసింది. లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ తెలిపిన ప్రకారం, బంగారం ఔన్స్‌కు 4,350.60 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి 70.49 డాలర్లకు చేరుకుంది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రకటన తర్వాత డాలర్ బలహీనపడటం, విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచడం వల్ల ఈ ర్యాలీ కొనసాగుతోందని ఆయన తెలిపారు. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, వెండికి మళ్లీ డిమాండ్ పెరిగిందన్నారు.

భారీగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

ఇక ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 80.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ప్రపంచ ఇంధన సరఫరాలు మెరుగుపడతాయనే అంచనాలు చమురు ధరలపై ఒత్తిడి తెచ్చాయి. ఆగ్‌మాంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా చైనాని తెలిపిన‌ ప్రకారం, గత కొన్ని వారాలుగా విలువైన లోహాల మార్కెట్ రెండు విభిన్న శక్తుల మధ్య చిక్కుకుంద‌న్నారు. ఒకవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు, మరోవైపు మెరుగుపడుతున్న భౌగోళిక పరిస్థితులు మార్కెట్ దిశను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. అమెరికా, యూరప్ ద్రవ్యోల్బణ గణాంకాలు వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చనే ఆందోళనలను పెంచినా, అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కారణంగా దీర్ఘకాలిక ఇంధన అంతరాయాలు, నిరంతర ద్రవ్యోల్బణ భయాలు కొంత మేర తగ్గాయి. ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు ఈ శుక్రవారం స్విట్జర్లాండ్‌లో జరగనున్నాయి. ఈ ప్రకటన తర్వాత అమెరికన్ డాలర్ 10 రోజుల కనిష్ట స్థాయికి చేరగా, చమురు ధరలు 4 శాతానికి పైగా క్షీణించాయి.

బంగారం ధ‌ర ఇంకా పెరుగుతుందా..?

అలాగే డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్ అంచనాలు కూడా తగ్గాయి. వారం క్రితం 69 శాతం ఉన్న అవకాశాలు ప్రస్తుతం 48 శాతానికి పడిపోయాయని చైనాని వెల్లడించారు. దీర్ఘకాలికంగా బంగారానికి మద్దతు ఇచ్చే అంశాలు ఇంకా కొనసాగుతున్నాయని చైనాని పేర్కొన్నారు. కరెన్సీ విలువ క్షీణతపై ఆందోళనలు, పెరుగుతున్న ఆర్థిక ప్రమాదాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక విభజనలు బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయని ఆమె వివరించారు. సాంకేతిక విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం బంగారం 4,330 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. 4,500 నుంచి 4,550 డాలర్ల పరిధి కీలక నిరోధక స్థాయిగా కనిపిస్తోంద‌ని, ఈ స్థాయిని దాటితే బుల్లిష్ మొమెంటమ్ మరింత బలపడే అవకాశం ఉంద‌ని, మరోవైపు 4,060 డాలర్ల వద్ద ప్రధాన మద్దతు ఉంద‌ని తెలిపారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం నుంచి కఠిన వైఖరి వెలువడితే బంగారం ధరలు మళ్లీ 4,000-4,100 డాలర్ల పరిధికి పడిపోవచ్చ‌ని అన్నారు. అయితే తటస్థ లేదా సానుకూల వైఖరి ఉంటే ధరలు 4,500 డాలర్ల దిశగా కదిలే అవకాశం ఉంద‌న్నారు.

పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా..?

విలువైన లోహాల మార్కెట్‌లో పునరుద్ధరణ ప్రభావం వెండిపైనా కనిపిస్తోంది. వెండి 70 డాలర్ల పైన నిలకడగా కొనసాగడం వల్ల 72-75 డాలర్ల పరిధి వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని చైనాని తెలిపారు. వెండికి 60-61 డాలర్ల వద్ద కీలక మద్దతు ఉంది. మరోవైపు 78-80 డాలర్ల పరిధి ప్రధాన నిరోధక స్థాయిగా ఉంది. ఈ స్థాయిని బలంగా అధిగమిస్తే కొత్త బుల్లిష్ ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పారిశ్రామిక డిమాండ్‌పై ఉన్న అనిశ్చితి, రాబోయే ఎఫ్ఓఎంసీ నిర్ణయం వంటి అంశాలు స్వల్పకాలిక ధరల కదలికలను ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువ‌ల్ల బంగారం, వెండి లోహాల‌పై పెట్టుబ‌డులు పెడుతున్న‌వారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement