త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO | ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్ న్యూస్‌.. జూలై 15లోపు వడ్డీ జమ..

EPFO | ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (సైట్స్) ప్లాట్‌ఫామ్ అమల్లోకి వచ్చిన తర్వాత గత కొన్నేళ్లతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో వడ్డీ జమ చేయాలని ఈపీఎఫ్‌వో లక్ష్యంగా నిర్ణ‌యం తీసుకుంది.

S

Business | Published On Jul 8, 2026, 4.05 pm IST

EPFO | ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్ న్యూస్‌.. జూలై 15లోపు వడ్డీ జమ..
Advertisement

EPFO | ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (సైట్స్) ప్లాట్‌ఫామ్ అమల్లోకి వచ్చిన తర్వాత గత కొన్నేళ్లతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో వడ్డీ జమ చేయాలని ఈపీఎఫ్‌వో లక్ష్యంగా నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం మాట్లాడుతూ, దాదాపు 34 కోట్ల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీని జూలై 15లోపు జమ చేయాలని ఈపీఎఫ్‌వో లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యం నెరవేరితే, గత సంవత్సరాలతో పోలిస్తే వడ్డీ జమ ప్రక్రియ గణనీయంగా వేగవంతం అయినట్లవుతుంద‌న్నారు. గతంలో వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఖాతాల్లో వడ్డీ జమ కావడానికి అక్టోబర్ లేదా నవంబర్ వరకు సమయం పట్టేది. ఈసారి 2025-26 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్‌వై26) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) మార్చిలో ఆమోదించిన 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం వడ్డీ జమ చేయనున్నారు. అయితే ఏ ఖాతాకు తప్పుగా వడ్డీ జమ కాకుండా ఉండేందుకు ఫీల్డ్ స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ క్రెడిట్ జరుగుతుందని మంత్రి తెలిపారు. సీబీటీ సిఫారసుకు అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది.

ఏ కేంద్రం నుంచైనా ప్రాసెసింగ్‌..

ఈపీఎఫ్‌వోలో సాంకేతిక సంస్కరణల కారణంగా వడ్డీ జమ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారిందని, అందువల్ల తక్కువ సమయంలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. గతంలో ప్రతి ప్రాంతీయ కార్యాలయం విడివిడిగా డేటాబేస్ నిర్వహించే వికేంద్రీకృత విధానం ఉండేది. ఇప్పుడు సైట్స్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా ఒకే జాతీయ డేటాబేస్ ఏర్పాటు చేశారు. దీంతో సభ్యుల రికార్డులను దేశవ్యాప్తంగా ఏ అధీకృత ఈపీఎఫ్‌వో కార్యాలయం నుంచైనా ప్రాసెస్ చేయడం సాధ్యమవుతోంది. ఇకపై ఖాతా ఉన్న కార్యాలయానికే పరిమితం కాకుండా దేశంలోని ఏ కార్యాలయం నుంచైనా సేవలు అందించవచ్చు. ఈపీఎఫ్‌వో అంతర్గత అమలు ప్రణాళిక ప్రకారం, వార్షిక వడ్డీ జమ ప్రక్రియను పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో ఈ కేంద్రీకృత ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించనున్నారు.

ఒకే రోజులో బ్యాంకు ఖాతాలో నిధులు జ‌మ‌..

అలాగే పూర్తిస్థాయి కేవైసీ పూర్తి చేసిన సభ్యుల అడ్వాన్స్ క్లెయిమ్‌లకు ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. క్లెయిమ్ పరిశీలన సమయంలో అవసరమైన వివరణలను సభ్యులు ఇకపై ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. ఆమోదం పొందిన క్లెయిమ్‌లు కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థ ద్వారా అదే రోజు నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. కొత్త వ్యవస్థలో వడ్డీ లెక్కింపును గత నెలాఖరు వరకు కాకుండా, తుది చెల్లింపు అనుమతి ఇచ్చే తేదీ వరకు నిర్వహిస్తారు. దీంతో సభ్యులకు అర్హత ఉన్న మొత్తం కాలానికి పూర్తి వడ్డీ లభిస్తుంది. పాక్షిక ఉపసంహరణ నిబంధనలను కూడా ఈపీఎఫ్‌వో సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఉన్న 13 వేర్వేరు నిబంధనలను మూడు ప్రధాన విభాగాలుగా మార్చింది. అవి అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు.

ఉద్యోగం మారే వారికి ఊర‌ట‌..

ఉద్యోగం మారే ఉద్యోగులకు కూడా పెద్ద ఊరట లభించనుంది. ఆధార్‌తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు, సేవా చరిత్ర ఆటోమేటిగ్గా కొత్త ఉద్యోగానికి బదిలీ అవుతాయి. ఇందుకోసం పాత యజమాని, కొత్త యజమాని లేదా ఈపీఎఫ్‌వో కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతులు అవసరం ఉండవు. పెన్షన్ పొందుతున్న వారికి కూడా దేశంలోని ఏ ఈపీఎఫ్‌వో కార్యాలయం నుంచైనా సేవలు పొందే అవకాశం కల్పించారు. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పెన్షన్ జమ అవుతుంది.

Advertisement
Advertisement