త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?

Ather Energy | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 9 శాతం వరకు ఎగిశాయి. గత నెల రోజులుగా కొనసాగుతున్న బలమైన ర్యాలీకి ఇది మరింత ఊతమిచ్చింది.

S

Business | Published On Jul 15, 2026, 2.11 pm IST

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?
Advertisement

Ather Energy | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 9 శాతం వరకు ఎగిశాయి. గత నెల రోజులుగా కొనసాగుతున్న బలమైన ర్యాలీకి ఇది మరింత ఊతమిచ్చింది. కంపెనీ అతిపెద్ద వాటాదారు హీరో మోటోకార్ప్ నుంచి కొత్త మూలధన మద్దతు లభించడం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దీర్ఘకాల వృద్ధిపై పెట్టుబడిదారులు ఆశావహంగా ఉండటంతో షేర్‌కు భారీ కొనుగోళ్లు వచ్చాయి. ఏథర్ ఎనర్జీ షేర్ గత ఒక నెలలో సుమారు 25 శాతం, గత మూడు నెలల్లో 40 శాతానికి పైగా పెరిగింది. గతేడాది కాలంలో ఈ షేర్ పెట్టుబడిదారులకు ఏకంగా 276 శాతం రాబడిని అందించింది. బుధవారం షేర్ భారీగా పెరగడానికి ప్రధాన కారణం హీరో మోటోకార్ప్ తీసుకున్న తాజా పెట్టుబడి నిర్ణయం. జూన్ 30 నాటికి ఏథర్ ఎనర్జీలో 29.48 శాతం వాటా కలిగిన హీరో మోటోకార్ప్, కంపెనీలో అదనంగా రూ.1వేయి కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ఆమోదం తెలిపింది.

హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబ‌డి..

ఈ పెట్టుబడిని ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టిబుల్ సెక్యూరిటీల ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా పెట్టనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అవసరమైన అనుమతులు లభించిన తర్వాత 15 రోజుల్లో ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ తాజా నిధుల సమీకరణతో ఏథర్ బ్యాలెన్స్ షీట్ మరింత బలపడడంతోపాటు సంస్థ తదుపరి విస్తరణకు వేగం లభిస్తుందని మార్కెట్ భావిస్తోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, కొత్త ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం, పెరుగుతున్న పోటీ మధ్య మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడం వంటి లక్ష్యాలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా ఏథర్‌లో అతిపెద్ద వ్యూహాత్మక పెట్టుబడిదారైన హీరో మోటోకార్ప్ మరోసారి భారీ పెట్టుబడి పెట్టడం కంపెనీ భవిష్యత్తుపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు.

అమ్మాలా, కొనాలా..

చోలా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ధర్మేష్ కాంత్ అభిప్రాయం ప్రకారం ఇప్పటికే ఏథర్ ఎనర్జీ షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులు వాటిని కొనసాగించవచ్చు. అయితే కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రస్తుతం వేచి చూడటం మంచిదని సూచించారు. కంపెనీ వాహనాల విక్రయాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని, మార్కెట్ వాటా కూడా క్రమంగా పెరుగుతోంద‌ని, ప్రస్తుతం వాహనాల విక్రయాల పరంగా ఏథర్ దేశంలో మూడో అతిపెద్ద సంస్థగా ఎదిగిందని తెలిపారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడికి హీరో మోటోకార్ప్ మరింత ఆకర్షణీయమైన అవకాశంగా కనిపిస్తోందని ధర్మేష్ కాంత్ అభిప్రాయపడ్డారు. హీరోకు ఇప్పటికే సొంత ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ఉండటంతోపాటు, ఇటీవలి ధరల సవరణ తర్వాత షేర్ విలువలు కూడా అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement