త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon | రుతుపవనాల జాడేది?

Monsoon | నైరుతి రుతుపవనాలు దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. అయినా ఆశించిన స్థాయిలో వర్షాలు మాత్రం కురవడం లేదు. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలోని పలు ప్రాంతాల్లో సాధారణంగా జూన్ చివరలో కనిపించే దట్టమైన వర్ష మేఘాలు కనిపించకపోవడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం.. జూన్ 4 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 45 శాతం లోటు నమోదైంది.

P

National | Published On Jun 26, 2026, 5.48 pm IST

Monsoon | రుతుపవనాల జాడేది?
Advertisement
  • భారత్‌పై కనిపించని మేఘాలు
  • మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలో కురవని వర్షాలు
  • జూన్ 4 నుంచి 26 వరకు 45 శాతం లోటు వర్షాపాతం
  • జులైలో రుతుపవనాలు పుంజుకునే ఛాన్స్‌

Monsoon | నైరుతి రుతుపవనాలు దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. అయినా ఆశించిన స్థాయిలో వర్షాలు మాత్రం కురవడం లేదు. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలోని పలు ప్రాంతాల్లో సాధారణంగా జూన్ చివరలో కనిపించే దట్టమైన వర్ష మేఘాలు కనిపించకపోవడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం.. జూన్ 4 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 45 శాతం లోటు నమోదైంది. తాజా ఉపగ్రహ చిత్రాలు కూడా రుతుపవనాల బలహీనంగా ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహ చిత్రాల్లో ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కనిపించాయి. అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భారీ వర్షాలను కురిపించే తీసుకొచ్చే దట్టమైన మేఘాలు పెద్దగా కనిపించలేదు. ఐఎండీ ఫోర్‌కాస్ట్‌ మ్యాప్ ప్రకారం.. మధ్య, ఉత్తర భారత రాష్ట్రాల్లో అనేక చోట్ల లోటు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో సాధారణ వర్షపాతంలో సగానికి కూడా వర్షం పడలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గుజరాత్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ సాధారణం కంటే దాదాపు 84 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

బంగాళాఖాతం, అరేబియా సముద్రంపై రుతుపవనాలకు అనుకూలనమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అల్పపీడన వ్యవస్థలు భూభాగం వైపు కదలకపోవడంతో తేమ ప్రవాహం తగ్గి, అంతర్గత ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురవడం లేదని పేర్కొంటున్నారు. అయితే, ఈ ప్రతికూల పరిస్థితులకు త్వరలో ముగింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు హిందూ మహాసముద్రంలో భూమధ్యరేఖకు ఉత్తరంగా ఓ భారీ ఉష్ణమండల వాతావరణ వ్యవస్థ ఏర్పడుతున్నట్లు వాతావరణ మోడల్‌ సూచిస్తోంది. ఇది వచ్చే నాలుగు నుంచి ఏడు రోజుల్లో ఉత్తరం వైపు కదులుతూ బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ వ్యవస్థ బలపడితే రుతుపవనాలకు అవసరమైన తేమ పెద్ద మొత్తంలో అందే అవకాశం ఉంది. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వర్షాలు మళ్లీ ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పశ్చిమ భారతంలో మధ్యస్థ వాతావరణ పొరలో ఒక సుడిగుండం (మిడిల్ ట్రోపోస్ఫెరిక్ వోర్టెక్స్) ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు కల్పించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు అనుకున్నట్లుగా కొనసాగితే నిలిచిపోయిన రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారి.. జూలై తొలి వారంలో వాయవ్య భారతంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement