త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. భారీగా పెరిగిన కొత్త సబ్‌స్క్రైబర్లు..

Airtel | టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అగ్ర సంస్థ‌లు భార‌తి ఎయిర్‌టెల్‌, జియోల మ‌ధ్యే పోటాపోటీగా యుద్ధం న‌డుస్తోంది. కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవ‌డంలో రెండు సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి.

S

Business | Published On Jun 29, 2026, 1.20 pm IST

Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. భారీగా పెరిగిన కొత్త సబ్‌స్క్రైబర్లు..
Advertisement

Airtel | టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అగ్ర సంస్థ‌లు భార‌తి ఎయిర్‌టెల్‌, జియోల మ‌ధ్యే పోటాపోటీగా యుద్ధం న‌డుస్తోంది. కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవ‌డంలో రెండు సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. అయితే గ‌డిచిన మే నెల‌ల‌కు గాను టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం భార‌తి ఎయిర్‌టెల్ కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవ‌డంలో జియోను మించిపోయింద‌ని వెల్ల‌డైంది. మే నెల‌లోనే ఎయిర్ టెల్ సుమారుగా 29.3 ల‌క్ష‌ల కొత్త క‌నెక్ష‌న్ల‌ను ఇవ్వ‌గా, జియో 21.5 ల‌క్ష‌ల కొత్త సబ్‌స్క్రైబర్లతో రెండో స్థానంలో నిలిచింది. టెలికాం రంగంలో జియో లాంచ్ అయిన‌ప్ప‌టి నుంచి చాలా కాలం పాటు ఆ సంస్థ‌నే ఈ విష‌యంలో అగ్ర స్థానంలో ఉండ‌గా, ఇటీవ‌లి కాలంలో ఎయిర్ టెల్ అగ్ర స్థానానికి చేరుకుని జియోకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఇత‌ర టెలికాం కంపెనీలు ఈ సంస్థ‌ల ద‌రిదాపుల్లో కూడా లేక‌పోవ‌డం విశేషం.

వైర్‌లెస్ మార్కెట్ వాటా జియోదే..

అయితే మొత్తం వైర్‌లెస్ మార్కెట్ వాటాలో జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మే నెలాఖరు నాటికి దేశంలోని మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లలో జియో వాటా 39.27 శాతంగా నమోదైంది. ఎయిర్‌టెల్ 37.89 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా (వీఐ) 15.56 శాతం మార్కెట్ వాటాను నిలుపుకోగా, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 7.28 శాతం వాటాను కలిగి ఉంది. వొడాఫోన్ ఐడియా మే నెలలో 1,21,289 మంది కొత్త వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లను చేర్చుకుని స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ నుంచి 1,04,560 మంది వినియోగదారులు నిష్క్రమించారు. మే నెలాఖరు నాటికి జియో మొత్తం 52.961 కోట్ల సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్‌టెల్ 37.611 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రెండో స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా 12.921 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉండగా, బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.752 కోట్లుగా నమోదైంది.

భారీగా పెరుగుతున్న వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు..

దేశంలోని మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ బేస్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) కనెక్షన్లతో కలిపి మే నెలలో 55 లక్షలు పెరిగి 129.4 కోట్లకు చేరుకుంది. ఇది నెలవారీగా 0.43 శాతం వృద్ధిని సూచిస్తోంది. కేవలం మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మాత్రమే 50.9 లక్షలు పెరిగి 127.7 కోట్లకు చేరుకుంది. మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ బేస్ కూడా పెరుగుదలను నమోదు చేసింది. మే నెలలో 55.6 లక్షల కొత్త కనెక్షన్లు చేరడంతో దేశంలోని మొత్తం టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్య 134.3 కోట్లకు చేరుకుంది. ఇందులో అత్యధిక వృద్ధి వైర్‌లెస్ కనెక్షన్ల ద్వారానే నమోదవగా, వైర్‌లైన్ కనెక్షన్లు సుమారు 60 వేల మేర మాత్రమే పెరిగాయి. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో కూడా జియో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసింది. 52.961 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లతో 49.03 శాతం మార్కెట్ వాటాను జియో దక్కించుకుంది. ఎయిర్‌టెల్ 37.611 కోట్ల సబ్‌స్క్రైబర్లు, 34.82 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా 12.921 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు, 11.96 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. ఈ మూడు సంస్థలే దేశంలోని మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లలో 95 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. దేశంలోని వైర్‌లెస్ టెలి-డెన్సిటీ కూడా పెరిగింది. ఏప్రిల్ చివరినాటికి 90.28 శాతంగా ఉన్న ఈ సూచీ, మే చివరినాటికి 90.61 శాతానికి చేరుకుంది.

Advertisement
Advertisement