త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPO | ఈ వారం 5 ఐపీఓల సందడి.. పెట్టుబ‌డిదారుల‌కు చ‌క్క‌ని అవ‌కాశం..

IPO | ఐపీఓల‌లో పెట్టుబడి పెట్టాలని ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు ఈ వారం మంచి అవకాశాలు లభించనున్నాయి. జూలై 20తో ప్రారంభమయ్యే వారంలో ప్రైమరీ మార్కెట్‌లో ఏకంగా ఏడు కంపెనీలు నిధులు సమీకరించేందుకు ఐపీఓలను తీసుకురానుండగా, మరో ఐదు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు సిద్ధమయ్యాయి.

S

Business | Published On Jul 20, 2026, 1.17 pm IST

IPO | ఈ వారం 5 ఐపీఓల సందడి.. పెట్టుబ‌డిదారుల‌కు చ‌క్క‌ని అవ‌కాశం..
Advertisement

IPO | ఐపీఓల‌లో పెట్టుబడి పెట్టాలని ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు ఈ వారం మంచి అవకాశాలు లభించనున్నాయి. జూలై 20తో ప్రారంభమయ్యే వారంలో ప్రైమరీ మార్కెట్‌లో ఏకంగా ఏడు కంపెనీలు నిధులు సమీకరించేందుకు ఐపీఓలను తీసుకురానుండగా, మరో ఐదు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు సిద్ధమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లకు పలు కొత్త పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు తమ ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించిన కంపెనీలు కలిపి సుమారు రూ.5,254 కోట్లను సమీకరించనున్నాయి. అయితే ఇండో ఎంఐఎం, లోహియా కార్ప్ సంస్థలు ఇంకా తమ ప్రైస్ బ్యాండ్‌ను వెల్లడించలేదు. దీంతో మొత్తం ఫండ్‌రైజింగ్ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.

క్యూబ్ హైవేస్ ట్రస్ట్, ఇండో ఎంఐఎం..

మెయిన్‌బోర్డ్ విభాగంలో తొలి ఐపీఓగా క్యూబ్ హైవేస్ ట్రస్ట్ జూలై 22న ప్రారంభమై జూలై 24న ముగియనుంది. ఈ ఐపీఓ ధరను ఒక్కో షేర్‌కు రూ.151 నుంచి రూ.152గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5వేల కోట్లను సమీకరించనుంది. అయితే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కావడం విశేషం. అంటే ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి కొత్తగా నిధులు రావు. మొత్తం సొమ్ము ఇప్పటికే షేర్లు కలిగిన యూనిట్ హోల్డర్లకే వెళ్తుంది. జూలై 23న మరో మూడు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. ఇండో ఎంఐఎం, లోహియా కార్ప్, ఎక్స్‌ట్రానెట్ టెక్నాలజీస్ సంస్థల ఐపీఓలు జూలై 27 వరకు అందుబాటులో ఉంటాయి. ఐటీ సొల్యూషన్స్ సంస్థ ఎక్స్‌ట్రానెట్ టెక్నాలజీస్ రూ.170 కోట్ల ఫ్రెష్ ఇష్యూను తీసుకువస్తోంది. ఒక్కో షేర్ ధరను రూ.120 నుంచి రూ.127గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, సిస్టమ్స్, హార్డ్‌వేర్ కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది.

లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్‌టైల్ మెషినరీ..

బెంగళూరుకు చెందిన ఇండో ఎంఐఎం ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపోనెంట్ల తయారీలో ఉంది. ఈ సంస్థ ఐపీఓలో రూ.500 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఉండగా, 68.2 మిలియన్ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో ఎక్కువ భాగాన్ని రుణాల చెల్లింపుకు వినియోగించనుంది. కాన్పూర్‌కు చెందిన లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్‌టైల్ మెషినరీ తయారీ సంస్థ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలోనే ఉండనుంది. దీంతో కంపెనీకి కొత్తగా నిధులు రాకుండా, షేర్లు విక్రయించే ప్రమోటర్లకే మొత్తం సొమ్ము వెళ్తుంది. ఇక ఈ వారం ఎస్‌ఎంఈ విభాగంలో కూడా మూడు ఐపీఓలు రానున్నాయి. గల్ఫ్ లాయిడ్స్ ఇండియా రూ.18.19 కోట్ల ఫిక్స్‌డ్ ప్రైస్ ఐపీఓను జూలై 20న ప్రారంభించనుంది. మెటాలిక్ టెక్నోఫోర్జ్ రూ.50 కోట్ల ఐపీఓను జూలై 21న తీసుకురానుంది. ఈ నిధులను కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు, ప్రస్తుత ప్లాంట్ విస్తరణ, రుణాల చెల్లింపుకు వినియోగించనుంది. శ్రీ బాలాజీ మాలా టెక్స్‌టైల్స్ రూ.18.9 కోట్ల ఐపీఓ జూలై 22న ప్రారంభమవుతుంది. ఈ సంస్థ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం నిధులను ఉపయోగించనుంది.

లిస్టింగ్ కానున్న 5 స్టాక్స్‌..

ఇప్పటికే ప్రారంభమైన కొన్ని ఐపీఓలు కూడా ఈ వారం ఇన్వెస్టర్ల దృష్టిలో ఉండనున్నాయి. కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ రూ.450 కోట్ల ఐపీఓ జూలై 21న ముగియనుండగా, ఇప్పటివరకు 1.21 రెట్ల‌ సబ్‌స్క్రిప్షన్‌ను నమోదు చేసింది. మరోవైపు సోటెఫిన్ ఇండియా ఎస్‌ఎంఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టేందుకు జూలై 20 వరకు అవకాశం ఉంది. ఈ వారం ఐదు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి. జూలై 21న దేశంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. అదే రోజున ఆల్పైన్ టెక్స్‌వర‌ల్డ్‌, మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ కూడా లిస్టింగ్ కానున్నాయి. జూలై 23న సోటెఫిన్ భారత్, జూలై 24న కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల‌లో ట్రేడింగ్ ప్రారంభించనున్నాయి. గ్రే మార్కెట్‌లో మిల్‌వర్క్స్ టెక్నాలజీస్‌కు అత్యధికంగా సుమారు 117 శాతం ప్రీమియం కనిపిస్తోంది. కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ సుమారు 27 శాతం ప్రీమియంతో ట్రేడవుతుండగా, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్‌కు సుమారు 16 శాతం గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. అయితే ఆల్పైన్ టెక్స్‌వర‌ల్డ్‌కు గ్రే మార్కెట్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు.

Advertisement
Advertisement