త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ASSOCHAM | భారత్‌లో వ్యవసాయ సాంకేతికతలు 86 శాతం రైతులకు అందడం లేదు

భారత్‌లో అగ్రి-టెక్ అభివృద్ధి ఉన్నప్పటికీ 86 శాతం రైతులు ఇంకా ఈ సాంకేతికతలకు దూరంగానే ఉన్నారని అసోచామ్ నివేదిక వెల్లడించింది. స్టేట్-లెవల్ అగ్రి-టెక్ సాండ్‌బాక్స్‌లు, అగ్రికల్చరల్ డేటా కామన్స్, ఫైనాన్సింగ్ సంస్కరణలతోనే సమగ్ర, సుస్థిర వ్యవసాయ వ్యవస్థ సాధ్యమని నివేదిక స్పష్టం చేసింది.

a

Agriculture | Published On Dec 19, 2025, 1.50 pm IST

ASSOCHAM | భారత్‌లో వ్యవసాయ సాంకేతికతలు 86 శాతం రైతులకు అందడం లేదు

సంక్షిప్త సారాంశం

భారత్‌లో అగ్రి-టెక్ అభివృద్ధి ఉన్నప్పటికీ 86 శాతం రైతులు ఇంకా ఈ సాంకేతికతలకు దూరంగా ఉన్నారని అసోచామ్ నివేదిక వెల్లడించింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ ఆవిష్కరణలను ఏకీకృత వ్యవస్థగా మార్చడం, స్టేట్-లెవల్ అగ్రి-టెక్ శాండ్‌బాక్స్‌లు, సమగ్ర డేటా ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారానే చిన్న రైతులకు టెక్నాలజీ చేరుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకు తెలంగాణ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ADeX ఆదర్శమని కొనియాడింది.

Advertisement

India Needs Unified Agri-Tech Ecosystem to Reach 86% Farmers Left Behind: ASSOCHAM Report

(త్రినేత్ర వ్యవసాయం డెస్క్​)

న్యూఢిల్లీ, డిసెంబర్ 19:
భారత్‌లో వ్యవసాయ రంగంలో సాంకేతిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, వాటి ప్రయోజనాలు ఇంకా అధికశాతం రైతులకు చేరడం లేదని అసోచామ్ (The Associated Chambers of Commerce and Industry of India) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని రైతుల్లో సుమారు 86 శాతం మంది వ్యవసాయ సాంకేతిక పరిధికి బయటే ఉన్నారని పేర్కొన్న నివేదిక, ఈ పరిస్థితిని మార్చేందుకు ఏకీకృత వ్యవస్థ (Unified Agri-Tech Ecosystem) ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

విడివిడి ఆవిష్కరణల వల్ల లాభం లేదు

Modern farming with tractor and drone showcasing mechanisation and agri-tech adoption in India

మంగళవారం విడుదలైన ఈ నివేదికలో, వ్యవసాయ ఆవిష్కరణలు విడివిడిగా అభివృద్ధి చెందడం వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఆశించిన లాభం చేకూరడం లేదని స్పష్టం చేసింది. సాంకేతికతను అందరికీ చేర్చడం, నిర్ణయాల కోసం సమాచారాన్ని సమర్థంగా వినియోగించడం, ఆవిష్కరణలను వాస్తవ ప్రభావంగా మార్చడం ద్వారానే భవిష్యత్తు వ్యవసాయ వ్యవస్థ సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా 90కి పైగా ఐసీఏఆర్ సంస్థలు, 60 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 700కు పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు) ఉన్నప్పటికీ, కొత్త వ్యవసాయ సాంకేతికతలను పరీక్షించి, ఆమోదించే ఒకే ఒక సమన్వయ వ్యవస్థ లేకపోవడం ప్రధాన లోపమని అసోచామ్ అభిప్రాయపడింది. ప్రస్తుత విధానాలు నెమ్మదిగా, వేర్వేరుగా ఉండటంతో అనేక ఆవిష్కరణలు రైతుల వరకు చేరకుండానే నిలిచిపోతున్నాయని తెలిపింది.

AI-powered agricultural robot working in greenhouse as part of smart farming ecosystem

ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరీక్షాకేంద్రాలు (అగ్రి-టెక్ శాండ్‌బాక్స్‌లు) ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. ఇవి వాస్తవ పొలాల్లో సాంకేతికతలను పరీక్షించే వేదికలుగా పనిచేస్తాయి. ప్రభుత్వ శాఖలు, అగ్రి-టెక్ స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు కలిసి ఇక్కడ ప్రయోగాలు నిర్వహించి, పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ముందు సాంకేతికతలను ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ శాండ్‌బాక్స్‌లు రాష్ట్ర వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఉండాలని, ఐసీఏఆర్ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, నాబార్డ్ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉండాలని సూచించింది. కేంద్ర స్థాయిలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ సహాధ్యక్షతతో జాతీయ స్టీరింగ్ కమిటీ పర్యవేక్షణ చేపట్టాలని తెలిపింది.

తెలంగాణ గత ప్రభుత్వ చొరవ అభినందనీయం

వ్యవసాయ సమాచారం విషయంలోనూ తీవ్ర విభజన ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పరిశోధనా సమాచారం ఐసీఏఆర్ వద్ద, మార్కెట్ సమాచారం రాష్ట్ర మార్కెటింగ్ బోర్డుల వద్ద, పొలాల స్థాయి డేటా ప్రైవేట్ కంపెనీల వద్ద విడివిడిగా ఉండటంతో ఆధునిక ఆవిష్కరణలకు అవసరమైన సమగ్ర ఏకీకృత సమాచారం అందుబాటులోకి రావడం లేదని పేర్కొంది. దీనికి పరిష్కారంగా FAO సూచించిన FAIR సూత్రాల ఆధారంగా అగ్రికల్చరల్ డేటా కామన్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. తెలంగాణలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ఇండియన్​ ఇన్స్​టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​, బెంగళూరు సహకారంతో రూపొందించిన అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ (ADeX) మోడల్‌ను ఉదాహరణగా పేర్కొంది. గత బిఆర్​ఎస్​ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్​రావు చొరవతో ఏర్పాటైన ఈ అడెక్స్​ తెలంగాణలో వ్యవసాయ సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందజేయడంలో చాలా అభివృద్ధి సాధించింది.

Telangana ADeX website extends cooperation for farmers thorugh AgriTech sandboxes

భారత అగ్రి-టెక్ విజయగాథలో తెలంగాణ ముందంజ: ఏఐ టూల్స్, మట్టి పరీక్షలు, ఈ-కామర్స్‌తో వ్యవసాయ విప్లవం: The Print

అగ్రి-స్టార్టప్‌లు కూడా ఉత్పత్తి ఆధారిత వ్యాపార నమూనాల నుంచి బయటకు వచ్చి, రైతుల ఖర్చు భరించే సామర్థ్యం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మోడళ్లను రూపొందించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. తక్కువ ఖర్చు సాంకేతికతలతో నేరుగా రైతులకు చేరే విధానాలు, అధిక ఖర్చు టెక్నాలజీలకు సమూహ యాజమాన్య విధానాలు అనుకూలమని తెలిపింది. యాక్సెస్ ఆధారిత సేవలు, ఫలితాలతో ముడిపడిన విక్రయ విధానాలు, క్రెడిట్‌తో అనుసంధానమైన రుణాలు, పంట చక్రానికి అనుగుణమైన తిరిగి చెల్లింపులు టెక్నాలజీ స్వీకరణకు దోహదపడతాయని పేర్కొంది.

ప్రభుత్వ స్థాయిలో అగ్రిసూర్ ఫండ్ వంటి కొత్త ఆర్థిక పథకాలు, అగ్రి-టెక్ పెట్టుబడులకు పన్ను ప్రోత్సాహకాలు, గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్, నిల్వ, రవాణా మౌలిక సదుపాయాల బలోపేతం అవసరమని నివేదిక సూచించింది. అలాగే రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు డిజిటల్ అవగాహన, కృత్రమమేధ ఆధారిత సలహా వ్యవస్థలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Indian farmer using tablet to monitor crops through agri-tech solutions in farmland

ఈ మార్పులు అమలులోకి వస్తే భారత వ్యవసాయం డిజిటల్‌గా మారి, మరింత తెలివైన, సుస్థిరమైన, అందరినీ చేరే వ్యవస్థగా మారుతుందని అసోచామ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆవిష్కరణలు ఏకీకృతమై, నిజమైన ప్రభావాన్ని చూపినప్పుడే చిన్న రైతులకు కూడా వ్యవసాయ సాంకేతికతల లాభాలు చేరుతాయని నివేదిక స్పష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement