త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Char Dham Yatra | చార్‌ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?

Char Dham Yatra | ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర (Char Dham Yatra) కొన‌సాగుతున్న‌ది. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 19న యాత్ర ప్రారంభ‌మైంది. అక్టోబ‌ర్ చివ‌రి వారం లేదా న‌వంబ‌ర్‌లో యాత్ర ముగియ‌నుంది.

G

Tourism | Published On Sep 2, 2026, 11.17 am IST

Char Dham Yatra | చార్‌ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?
Advertisement

Char Dham Yatra | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర (Char Dham Yatra) కొన‌సాగుతున్న‌ది. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 19న యాత్ర ప్రారంభ‌మైంది. అక్టోబ‌ర్ చివ‌రి వారం లేదా న‌వంబ‌ర్‌లో యాత్ర ముగియ‌నుంది. ఇందులో భాగంగా హిమాలయ పర్వతాల్లోని య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బ‌ద్రినాథ్ ఆయాల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఉత్త‌రాఖండ్ (Uttarakhand) సివిల్ ఏవియేష‌న్ అథారిటీ హెలికాప్ట‌ర్ సేవ‌ల‌ను (Char Dham Helicopter Yatra) అందిస్తున్న‌ది. రెండో ద‌శ హెలికాప్ట‌ర్ సేవ‌లు సెప్టెంబ‌ర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో చార్ ధామ్ హెలికాప్ట‌ర్ యాత్ర‌కు ఎలా న‌మోదుచేసుకోవాలో చూద్దాం..

చార్ ధామ్ యాత్ర‌ను సుల‌భంగా, త‌క్కువ స‌మ‌యంలో పూర్తి చేయ‌డానికి ప్ర‌భుత్వం హెలికాప్ట‌ర్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. రోడ్డు మార్గంలో 10-14 రోజులు పట్టే ప్రయాణం, హెలికాప్టర్ ద్వారా అయితే కేవలం 4 నుండి 6 రోజుల్లో పూర్తవుతుంది. సాధార‌ణంగా ఈ హెలికాప్ట‌ర్ యాత్ర డెహ్రాడూన్‌లోని స‌హ‌స్ర‌ధార హెలిప్యాడ్ నుంచి ప్రారంభ‌మై, అక్క‌డే ముగుస్తుంది. దీనికోసం హెలికాప్ట‌ర్ ఆప‌రేట‌ర్లు ప్ర‌త్యేక ప్యాకేజీల‌ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌యాణీకుల సంఖ్య‌, హోట‌ల్ ర‌కం, సీజ‌న్‌ను బ‌ట్టి ప్యాకేజీలు మారుతుంటాయి.

పూర్తి చార్‌ధామ్ ప్యాకేజీ మొత్తం 4 రాత్రులు, 5 రోజులు లేదా 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ఒక వ్యక్తికి సుమారు రూ.1,80,000 నుంచి రూ.2,50,000 వరకు చెల్లించాలి. ఇందులో హెలికాప్టర్ టిక్కెట్లు, హోటల్ వసతి, మూడు పూటలా శాఖాహార భోజనం, వీఐపీ దర్శన పాస్‌లు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అన్నీ కలిపిఉంటాయి.

దో ధామ్ అంటే కేదార్‌నాథ్, బద్రీనాథ్ మాత్ర‌మే ద‌ర్శించాల‌నుకుంటే.. ఒక వ్యక్తికి సుమారు రూ.1,25,000 నుంచి రూ.1,40,000 వరకు ప్యాకేజీ ఉంటుంది.

కేదార్‌నాథ్ షటిల్ సర్వీస్ (ఒక రోజు ప్రయాణం) అయితే ఫాటా, సిర్సి లేదా గుప్తకాశీ వంటి బేస్ క్యాంపుల నుంచి కేదార్‌నాథ్‌కు రౌండ్ ట్రిప్ టికెట్ ధర ఒక వ్యక్తికి రూ.5,500 నుంచి రూ.9 వేల మధ్య ఉంటుంది.

యాత్ర ఎలా అంటే..

యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజుల‌పాటు కొన‌సాగుతుంది. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని చూపిస్తారు. యాత్ర డెహ్రాడూన్‌లో ప్రారంభ‌మై అక్క‌డే ముగుస్తుంది.

మొద‌టి రోజు (డెహ్రాడూన్ నుంచి యమునోత్రి): ఉదయం డెహ్రాడూన్ (సహస్రధార హెలిప్యాడ్) నుంచి ఖర్సాలీ (యమునోత్రి)కి వెళ్తారు. అక్కడి నుంచి డోలీ లేదా గుర్రం ద్వారా యమునోత్రి ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. రాత్రికి ఖర్సాలీలో ఉండాల్సి ఉంటుంది.

రెండో రోజు (యమునోత్రి నుంచి గంగోత్రి): ఖర్సాలీ నుంచి హర్సిల్ హెలిప్యాడ్‌కు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గంగోత్రి ఆలయానికి చేరుకుంటారు. రాత్రికి హర్సిల్ లేదా ఉత్తరకాశీలో బస ఏర్పాటు చేస్తారు.

మూడోరోజు (గంగోత్రి నుంచి కేదార్‌నాథ్): హర్సిల్ నుంచి గుప్తకాశీ లేదా సిర్సి బేస్ క్యాంపుకు చేరుకుంటారు. అక్కడి నుంచి షటిల్ హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్ వెళ్ల‌వచ్చు. వీఐపీ దర్శనం అనంతరం రాత్రికి కేదార్‌నాథ్ లేదా సిర్సిలో బస ఉంటుంది.

నాలుగో రోజు (కేదార్‌నాథ్ నుంచి బద్రీనాథ్): బేస్ క్యాంప్ నుంచి బద్రీనాథ్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. బద్రీనాథ్ ఆలయ దర్శనం, సాయంత్రం ఆరతి లేదా మరుసటి రోజు ఉదయం మహాఅభిషేక పూజలో పాల్గొంటారు. రాత్రికి బద్రీనాథ్‌లోనే గ‌డుప‌వ‌చ్చు.

ఐదో రోజు (బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్): ఉదయం బద్రీనాథ్ నుంచి తిరిగి డెహ్రాడూన్ సహస్రధార హెలిప్యాడ్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ఎలా బుక్ చేసుకోవాలంటే??

యాత్ర రకాన్ని బట్టి బుకింగ్ ప్రక్రియ ఉంటుంది. 1. కేదార్‌నాథ్ ష‌టిల్ సేవ‌ల కోసం, 2. పూర్తి చార్‌ధామ్ హెలికాప్టర్ ప్యాకేజీ కోసం. వీటిలో మ‌నం ఎంచుకునేదాని బ‌ట్టి సేవ‌లు అందుబాటులో ఉంటాయి.

కేదార్‌నాథ్ షటిల్ సేవలు..

  • దీనిని ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా బుక్‌చేసుకోవాలి. అయితే ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో చార్‌ధామ్ యాత్ర కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చే Group ID లేదా Registration Number హెలికాప్ట‌ర్ సేవ‌ల‌ బుకింగ్‌కు అవసరమ‌వుతాయి.
  • ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ heliyatra.irctc.co.in ఓపెన్ చేసి సైన్-అప్ అవ్వాలి.
  • అక్క‌డ యాత్రా రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గ్రూప్ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ప్రయాణ తేదీ, హెలిప్యాడ్ (ఫాటా/సిర్సి/గుప్తకాశీ), సమయాన్ని ఎంచుకోవాలి.
  • ప్రయాణీకుల ఆధార్ కార్డ్ వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా చెల్లింపు పూర్తి చేయాలి. టికెట్ జనరేట్ అయిన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

పూర్తి చార్‌ధామ్ హెలికాప్టర్ ప్యాకేజీ కోసం..

పూర్తి 5 రోజుల ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ నేరుగా విక్రయించదు. దీని కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన అధీకృత ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీలను సంప్రదించి, వారి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ముందస్తుగా ప్యాకేజీలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హెరిటేజ్ ఏవియేష‌న్‌, ప‌వ‌న్ హ్యాన్స్‌, హిమాల‌య‌న్ హెలీ వంటి సంస్థ‌లు హెలీయాత్ర సేవ‌ల‌ను అందిస్తున్నాయి.

Advertisement
Advertisement