త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharat Gaurav Train | తూర్పు భారత పుణ్యక్షేత్రాల టూర్.. భారత్ గౌరవ్ రైలుకు బుకింగ్స్ ప్రారంభం..

Bharat Gaurav Train | ఇండియ‌న్ రైల్వేస్ క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సీటీసీ) భార‌త్ గౌర‌వ్ డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ ప్ర‌త్యేక రైలుకు బుకింగ్‌ల‌ను ప్రారంభించింది. మొత్తం 10 రోజుల పాట సాగ‌నున్న ఈ యాత్ర‌కు గాను రైలులో అందుబాటులో ఉన్న కోచ్‌లు, కూపేల వివ‌రాల‌ను, ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించింది.

S

Tourism | Published On Jun 29, 2026, 4.39 pm IST

Bharat Gaurav Train | తూర్పు భారత పుణ్యక్షేత్రాల టూర్.. భారత్ గౌరవ్ రైలుకు బుకింగ్స్ ప్రారంభం..
Advertisement

Bharat Gaurav Train | ఇండియ‌న్ రైల్వేస్ క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సీటీసీ) భార‌త్ గౌర‌వ్ డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ ప్ర‌త్యేక రైలుకు బుకింగ్‌ల‌ను ప్రారంభించింది. మొత్తం 10 రోజుల పాట సాగ‌నున్న ఈ యాత్ర‌కు గాను రైలులో అందుబాటులో ఉన్న కోచ్‌లు, కూపేల వివ‌రాల‌ను, ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించింది. అలాగే రైలు ప్ర‌యాణించే మార్గం, ఏయే పుణ్య క్షేత్రాల సంద‌ర్శ‌న క‌ల్పిస్తారు, ఎలాంటి వ‌స‌తి సౌక‌ర్యాలు ఉంటాయి త‌దిత‌ర వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించింది. యాత్ర‌లో భాగంగా రైలు వార‌ణాసి, కోల్‌క‌తా, పూరీ, ఝార్ఖండ్ వంటి ప్రాంతాల‌ను చుట్టి వ‌స్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సుప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలు, ద‌ర్శ‌నా స్థ‌లాల‌ను ఇందులో భాగంగా సందర్శించ‌వ‌చ్చు.

ప్ర‌యాణం ఇలా..

భారత్ గౌరవ్ డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ ప్రత్యేక రైలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుంచి బయలుదేర‌నుంది. అయితే ప్రయాణికులు తప్పనిసరిగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రైలు ఘాజియాబాద్, మొరాదాబాద్, బరేలీ, లక్నో స్టేషన్లలో కూడా ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే ఐదు స్టేషన్లలో దిగే అవకాశం కల్పించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మొదటి ప్రధాన గమ్యం వారణాసి. అక్కడ భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించడంతోపాటు సాయంత్రం గంగా నదిపై పడవలో జరిగే గంగా హారతిని వీక్షించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రైలు కోల్‌కతాకు చేరుకుంటుంది. అక్కడ రెండు రాత్రులు బస ఏర్పాటు చేశారు. ఈ సమయంలో విక్టోరియా మెమోరియల్, దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, బేలూర్ మఠ్, కాళీఘాట్ ఆలయాలను సందర్శిస్తారు. అలాగే గంగాసాగర్‌కు ప్రత్యేక డే ట్రిప్ ఉంటుంది. రోడ్డు మార్గం, ఫెర్రీ ప్రయాణం, అనంతరం మరో బస్సు ద్వారా కపిల్ ముని ఆలయానికి చేరుకుని సాగర్ సంగమ్ వద్ద పవిత్ర స్నానం చేసే అవకాశం కల్పిస్తారు.

చివ‌ర్లో బైద్య‌నాథ్ ధామ్ ద‌ర్శ‌నం..

తర్వాత యాత్ర పూరీకి కొనసాగుతుంది. అక్కడ రెండు రాత్రులు బస ఉంటుంది. ఈ సందర్భంగా జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయం, ఉదయగిరి-ఖండగిరి గుహలు, చిలికా సరస్సులో బోటు విహారం, కళాకారుల గ్రామం రఘురాజ్‌పూర్ సందర్శన కార్యక్రమంలో ఉంటాయి. ఈ యాత్ర చివరిలో ఝార్ఖండ్‌లోని దేవఘర్‌లో ఉన్న బైద్యనాథ్ ధామ్‌ను దర్శించిన అనంతరం రైలు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతుంది.

ఛార్జీలు ఎంతంటే..

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. సుపీరియర్ ఏసీ-1 కూపే, సుపీరియర్ ఏసీ-1 క్యాబిన్, డీలక్స్ ఏసీ-2 టియర్, కంఫర్ట్ ఏసీ-3 టియర్ అనే నాలుగు కేటగిరీల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. సుపీరియర్ ఏసీ-1 (కూపే, క్యాబిన్)లో సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.1,22,160, ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.1,06,940, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.1,04,765, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.98,920గా నిర్ణయించారు. డీలక్స్ ఏసీ-2 టియర్‌లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.1,14,145, డబుల్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ.98,925, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.96,755, పిల్లలకు రూ.90,905గా ఉంది. కంఫర్ట్ ఏసీ-3 టియర్‌లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.94,505, డబుల్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ.79,285, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.77,120, పిల్లలకు రూ.73,070గా నిర్ణయించారు. రైల్వేలు భారత్ గౌరవ్ టూరిజం రైళ్లను ప్రోత్సహించేందుకు సుమారు 33 శాతం రాయితీని ఇప్పటికే ఈ ధరల్లో కలిపినట్లు వెల్లడించాయి. అందువల్ల ప్రకటించిన ధరలే తుది చెల్లింపు మొత్తాలుగా ఉంటాయి.

వ‌స‌తి సౌకర్యాలు..

ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతోపాటు కోల్‌కతా, పూరీలోని 3 స్టార్‌ హోటళ్లలో నాలుగు రాత్రుల బస ఉంటుంది. వారణాసిలో ఒకే రోజు వాష్ అండ్ చేంజ్ సౌకర్యం, రాత్రి ప్రయాణాల్లో రైలులో ఐదు రాత్రుల బస కూడా ఇందులో భాగమే. ప్రయాణం మొత్తం శాకాహార భోజనం మాత్రమే అందిస్తారు. ఏసీ-1, ఏసీ-2 ప్రయాణికులకు డైనింగ్ కార్‌లో భోజనం వడ్డిస్తారు. ఏసీ-3 ప్రయాణికులకు వారి బెర్త్ వద్దకే భోజనం అందజేస్తారు. స్థానిక దర్శనాల కోసం ఏసీ బస్సు ప్రయాణం, స్మారక కట్టడాల ప్రవేశ టికెట్లు, గైడ్ సేవలు, ప్రమాద బీమా, రైలులో ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ సేవలు కూడా ప్యాకేజీలో చేర్చారు. ప్రయాణానికి కేవలం మూడు రోజుల ముందు మాత్రమే బెర్త్ కేటాయింపు ఖరారు చేస్తారు. ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక లోయర్ బెర్త్ మాత్రమే కేటాయిస్తామని ఐఆర్‌సీటీసీ తెలిపింది. వృద్ధులు లేదా తప్పనిసరిగా లోయర్ బెర్త్ అవసరమున్నవారు ఈ విషయాన్ని ముందుగానే గుర్తుంచుకోవాలి.

క్యాన్సిలేష‌న్ నిబంధ‌న‌లు..

రద్దు నిబంధనలూ కఠినంగానే ఉన్నాయి. ప్రయాణానికి 15 రోజుల ముందు లేదా అంతకంటే ముందు రద్దు చేస్తే ఒక్కొక్కరికి రూ.250 మాత్రమే కోత ఉంటుంది. 8 నుంచి 14 రోజుల మధ్య రద్దు చేస్తే ప్యాకేజీ ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల మధ్య రద్దు చేస్తే 50 శాతం కోత విధిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయం ఉండగా రద్దు చేస్తే మొత్తం టికెట్ జప్తు అవుతుంది. కాగా డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్‌ను వ‌చ్చే సెప్టెంబ‌ర్ 25 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Advertisement
Advertisement