త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IRCTC | ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. రూ.17,600కే 7 జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్‌

IRCTC | ఆధ్యాత్మిక యాత్ర‌కు వెళ్లాల‌నుకునే యాత్రికుల‌కు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. ‘సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర’ పేరుతో (SAPTA (07) Jyotirlinga Darshan Yatra) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది.

D

National | Published On May 21, 2026, 2.03 pm IST

IRCTC | ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. రూ.17,600కే 7 జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్‌
Advertisement

IRCTC | ఆధ్యాత్మిక యాత్ర‌కు వెళ్లాల‌నుకునే యాత్రికుల‌కు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. ‘సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర’ పేరుతో (SAPTA (07) Jyotirlinga Darshan Yatra) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఒకే యాత్ర‌లో ఏకంగా 7 జ్యోతిర్లింగాలను ద‌ర్శించుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. అది కూడా చాలా త‌క్కువ ఖ‌ర్చుతో ఈ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. రూ.17,600 నుంచే ప్యాకేజీ ధరలు ప్రారంభం కానున్నాయి. చిన్నారులకు ప్రత్యేక రాయితీ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ యాత్రలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జ‌యిని మహాకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌ ఆలయాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్‌, మహారాష్ట్రలోని భీమశంకర్‌, త్రయంబకేశ్వర్‌, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగా (ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్‌)లను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్‌ 16న సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలు (Bharat Gaurav Tourist Train)తో ప్రారంభమవుతుంది. ఉద‌యం 11 గంట‌ల‌క సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి జ‌ర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ రైలు కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా ఉజ్జ‌యిని చేరుకుంటుంది. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నాలు కొన‌సాగుతాయి.

ఇవీ ప్యాకేజీ ధ‌ర‌లు..

  • ఈ ప్యాకేజీలో ఎకానమీ (స్లీప‌ర్ క్లాస్‌), స్టాండర్డ్ (3ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) అనే మూడు కేటగిరీలు ఉన్నాయి. స్లీపర్‌ క్లాస్‌లో ఎకానమీ టికెట్‌ ధర రూ.17,600 నుంచి ప్రారంభమవుతుంది. అదే 5-11 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు గ‌ల చిన్నారుల‌కు మాత్రం రూ.16,300 చెల్లించాలి.
  • 3ఏసీ స్టాండర్డ్‌ ప్యాకేజీ ధర రూ.26,700 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇందులో 5-11 ఏళ్ల మ‌ధ్య చిన్నారుల‌కు రూ.25,200 చెల్లించాలి.
  • ఇక‌ 2ఏసీ కంఫర్ట్‌ ప్యాకేజీ ధర రూ.34,600గా నిర్ణయించారు. ఇందులో 5-11 ఏళ్ల చిన్నారుల‌కు రూ.32,800 చెల్లించాలి.

యాత్రికులకు హోటల్‌ బస, శాకాహార భోజనం, స్థానిక రవాణా, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, టూర్‌ మేనేజర్‌ సహాయం వంటి సదుపాయాలు ప్యాకేజీలో భాగం. అయితే, ఏ ఆల‌యం వ‌ద్దైనా ఎంట్రీ ఫీజులు ఉంటే మాత్రం ప్ర‌యాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవ‌లం యాత్రికుల భ‌ద్ర‌త‌, ప్ర‌యాణ స‌దుపారం, బ‌స‌, ఫుడ్ వంటివి మాత్ర‌మే రైల్వే సిబ్బంది చూసుకుంటారు.

ప్ర‌యాణం సాగుతుందిలా..

  • జూన్ 16వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ నుంచి భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలు ప్రారంభ‌మ‌వుతుంది. తెలంగాణ‌లోని కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా ప్ర‌యాణం సాగుతుంది.
  • జూన్ 17న ఉద‌యం 10 గంట‌ల‌కు ఉజ్జ‌యిని చేరుకుంటుంది. అక్క‌డ దిగిన వెంట‌నే హోల్ రూమ్‌కు వెళ్తారు. అక్క‌డ ఫ్రెష్ అయ్యాక మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఇక రాత్రి డిన్న‌ర్ చేసి నైట్ స్టే అక్క‌డే.
  • జూన్ 18వ తేదీన ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అక్క‌డే చేస్తారు. ఆ త‌ర్వాత హోట‌ల్ చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గంలో ఓంకారేశ్వర్ ఆల‌యానికి వెళ్తారు. అక్క‌డ ద‌ర్శ‌నం అనంత‌రం.. అంబేడ్క‌ర్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి రాత్రి 11 గంట‌ల‌కు రైలు ద్వార‌క‌కు బ‌య‌ల్దేరుతుంది.
  • జూన్ 19న సాయంత్రం 6:30 గంట‌ల‌కు ద్వార‌క రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. రైలు దిగిన వెంట‌నే హోట‌ల్‌కు చేరుకుని డిన్న‌ర్ చేస్తారు. నైట్ స్టే అక్కడే ఉంటుంది.
  • జూన్ 20వ తేదీన ఉద‌యం లేవ‌గానే రెడీ అయ్యి బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటారు. త‌ర్వాత ద్వార‌కాదీశ్ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ద‌ర్శ‌నం అనంత‌రం హోట‌ల్ చెక్ అవుట్ చేసి.. లంచ్ కంప్లీట్ చేసుకుంటారు. ఆ త‌ర్వాత బెట్ ద్వార‌క‌, నాగేశ్వ‌ర్ జ్యోతిర్లింగ ఆల‌యాన్ని ద‌ర్శిస్తారు. ఈ ఆల‌యాల ద‌ర్శ‌నానంత‌రం రైల్లో సోమ‌నాథ్ ఆల‌యానికి బ‌య‌ల్దేర‌తారు.
  • జూన్ 21వ తేదీన ఉద‌యం 6 గంట‌ల‌కంతా సోమ‌నాథ్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. అక్క‌డ హోట్‌లో చెక్ ఇన్ అయ్యి.. ఫ్రెష్ అవుతారు. బ్రేక్‌ఫాస్ట్ చేసి సోమ‌నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఆ త‌ర్వాత మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సోమ‌నాథ్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకొని పూణెలోని ఖ‌డ్కికి బ‌య‌ల్దేర‌తారు.
  • జూన్ 22వ తేదీ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఖ‌డ్కి చేరుకుంటారు. అక్క‌డ హోట‌ల్‌కు చేరుకుంటారు. డిన్న‌ర్‌, నైట్ స్టే అక్క‌డే.
  • జూన్ 23న ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసి హోట‌ల్ ఖాళీ చేస్తారు. భీమ‌శంక‌ర ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్తారు. ప్ర‌స్తుతం అక్క‌డ మ‌ర‌మ్మ‌తు ప‌నులు జ‌రుగుతున్న కార‌ణంగా.. పూణెలోని ఇత‌ర ఆల‌యాల‌ను సంద‌ర్శించే అవ‌కాశం క‌ల్పించింది ఐఆర్‌సీటీసీ. అదేరోజు రాత్రి 11 గంట‌ల‌కు ఖ‌డ్కి రైల్వే స్టేష‌న్ నుంచి నాసిక్‌కు బ‌య‌ల్దేర‌తారు.
  • జూన్ 24న ఉద‌యం 6 గంట‌ల‌కు నాసిక్ రోడ్డు రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి హోట‌ల్‌కు వెళ్లి ఫ్రెష్ అవుతారు. త్ర‌యంబ‌కేశ్వ‌ర్ జ్యోతిర్లింగ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ద‌ర్శ‌నం అనంత‌రం నాసిక్ రోడ్డు రైల్వే స్టేష‌న్‌కు చేరుకుని.. ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్‌కు ప్ర‌యాణాన్ని మొద‌లు పెడ‌తారు.
  • జూన్ 25న ఉద‌యం 5 గంట‌ల‌కు ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్ చేరుకుంటారు. హోట‌ల్‌కు వెళ్లి ఫ్రెస్ అవుతారు. ఆ త‌ర్వాత ఘృష్ణేశ్వర ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఈ ఆల‌యంతో సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర పూర్త‌వుతుంది. అదే రోజు రాత్రి 10 గంట‌ల‌కు తిరుగుప‌య‌న‌మ‌వుతారు.
  • జూన్ 26న సాయంత్రం 7 గంట‌ల‌కు రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది. రైలు దిగిన త‌ర్వాత యాత్రికులు త‌మ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్తారు. దీంతో ఈ టూర్ పూర్త‌వుతుంది.
Advertisement
Advertisement