త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | నితిన్ న‌బీన్‌కు ఇన్‌పుట్ ఎవ‌రిచ్చిర్రో తెల్వ‌దు.. తెలంగాణ అంటే ఆయ‌న‌కేం తెలుస్త‌లే

Chamala Kirankumar Reddy | బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌కు తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి విమ‌ర్శించారు. బీహార్ మైండ్‌సెట్‌తోనే ఆయ‌న మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Jun 29, 2026, 4.11 pm IST

Chamala Kirankumar Reddy | నితిన్ న‌బీన్‌కు ఇన్‌పుట్ ఎవ‌రిచ్చిర్రో తెల్వ‌దు.. తెలంగాణ అంటే ఆయ‌న‌కేం తెలుస్త‌లే
Advertisement
  • ప‌క్క‌న కూసున్న కిష‌న్‌రెడ్డి అయినా చెప్పుండాల్సింది
  • ఏదేదో బెంగాల్ మోడ‌ల్, ఉత్త‌ర‌ప్రదేశ్ మోడ‌ల్ అంటుండు
  • కాళేశ్వ‌రం కేసు కూడా మీకే అప్ప‌జెప్పినం క‌దా
  • మ‌రి ఏం చేసిర్రో చెప్పండి
  • ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి విమ‌ర్శ‌లు

Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌కు తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి విమ‌ర్శించారు. బీహార్ మైండ్‌సెట్‌తోనే ఆయ‌న మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. దేశ రాజ‌కీయాల‌పై కూడా ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేన‌ట్టు క‌నిపిస్తోంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెంగాల్ మోడ‌ల్‌, ఉత్త‌ర‌ప్రదేశ్ మోడ‌ల్ అని ఏదేదో మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. సోమ‌వారం గాంధీభ‌వ‌న్‌లో చామ‌ల మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయ‌కుల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శలు గుప్పించారు.

నితిన్ న‌బీన్ బీజేపీ అధ్య‌క్షుడు అయినంక మొద‌టిసారి తెలంగాణ‌కు వ‌చ్చినట్టుండు. వ‌చ్చే ముందు బీహార్ రాజ‌కీయాల్లో అవగాహ‌న ఉండి బీహార్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్న‌రు. ఆయ‌న‌కు దేశ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేన‌ట్లు క‌నిపిస్తోంది. ఇన్‌పుట్ ఇచ్చేవారు స‌రిగా లేన‌ట్టున్న‌రు. రాంచంద‌ర్‌రావు ఇన్‌పుట్ ఇచ్చిర్రా లేదంటే సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ కిష‌న్‌రెడ్డి ఇచ్చిర్రా తెల్వ‌దు. ఎందుకంటే ఆయ‌న‌కు తెలంగాణ రాజ‌కీయాల మీద అవ‌గాహ‌న లేదు. ఏదో రాష్ట్రానికి రావాల‌న్న‌ట్లు వ‌చ్చిన‌ట్టుండు. బెంగాల్ మోడ‌ల్ అంటుండు, ఇంకేదో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మోడ‌ల్ అంటుండు. ఇక్క‌డి పాల‌కులు రాష్ట్రాన్ని ఏటీఎం లెక్క వాడిండ్రు అంటున్న‌డు. మ‌ళ్లా ఇప్పుడు అవినీతి జ‌ర‌గ‌కుండా చూస్తం అంటుండు.

మీ పార్టీ 2014 నుంచి దేశంలో అధికారంలో ఉంది. మరి కాళేశ్వ‌రంలో అవినీతి చేసిర్రు అని అంటున్న‌వ్‌. మ‌రి బీజేపీ ఏం చేసింది? అప్పుడు ఉన్న న‌డ్డాగారు ఏం చేయ‌లేద‌ని చెబుతున్న‌రా మీరు? మీ ప‌క్క‌న కూర్చున్న‌ కిష‌న్‌రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీ, రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌ని చేసిండు. ఆయ‌న మీకు చెప్ప‌లేదా? ఈ రాష్ట్రాన్ని దోచుకోకుండా చూసే బాధ్య‌త మ‌న‌దే అని చెప్పేదుండే క‌దా? కాళేశ్వ‌రంపై సీబీఐ విచార‌ణకిచ్చిన విష‌యం నితిన్ న‌బీన్‌కు చెప్ప‌లేదా మీరు. ఆయ‌న‌కు ఏం చెప్ప‌కుండా కాయిదం మీద రాసిచ్చిందే స‌దివి పోయిన‌ట్లుండు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాళేశ్వ‌రంపై అన్ని విచార‌ణ‌లు చేసింది. నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వాళ్లు వ‌చ్చిర్రు.. అది కూడా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్‌ బాడీయే. మేం ఏం జేస్త‌లేరు అని అంటే కేంద్రానికి కూడా అప్ప‌జెప్పినం. మ‌రి ఇంకెప్పుడు చేస్త‌రు.

వాళ్లిద్ద‌రూ బిల్లా, రంగాలే..

గ‌త ఎంపీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. కేటీఆర్‌, హ‌రీశ్‌రావు ఇద్ద‌రూ బిల్లా, రంగాలు. సిరిసిల్ల‌, సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి వ‌చ్చిన ఓట్లు చూస్తే వాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. కేసీఆర్ హ‌యాంలో బీజేపీ నాయ‌కులు ప్రేక్ష‌క పాత్ర పోషించారు. మోదీ ఇస్తాన‌న్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అని ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement