త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi Rejuvenation Project | మూసి ప్రాజెక్ట్‌తో తెలంగాణ భ‌విష్య‌త్‌కు పునాది : మంత్రి పొంగులేటి

Musi Rejuvenation Project | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేయడంతో పాటు హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

P

Telangana | Published On Jun 29, 2026, 4.08 pm IST

Musi Rejuvenation Project | మూసి ప్రాజెక్ట్‌తో తెలంగాణ భ‌విష్య‌త్‌కు పునాది : మంత్రి పొంగులేటి
Advertisement

Musi Rejuvenation Project | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేయడంతో పాటు హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మూసి నదికి పునర్జీవం పోస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈ.వి. నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసి నదిని పునరుజ్జీవింపజేసి, దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి అని తెలిపారు. "ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించే సంకల్పం" అని పేర్కొన్నారు. మూసి నది కాలుష్యంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వరదల సమయంలో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించామని మంత్రి తెలిపారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాల ఏర్పాటు ద్వారా మూసి పరివాహక ప్రాంతాలను సరికొత్త జీవన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.

ముఖ్యమంత్రి గతంలోనే స్పష్టం చేసినట్లుగా మూసి ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గుర్తుచేశారు. "అభివృద్ధి–మానవీయత రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతాం. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. భూ సేకరణ ప్రక్రియలో ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించేందుకు అవసరమైన కార్యాచరణను వెంటనే రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారంతో పాటు అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement