త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | తెలంగాణ‌లో వైన్ త‌యారీ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అవ‌కాశాలున్నాయి

Jupally Krishna Rao | తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వైన్ త‌యారీకి అవ‌కాశాలున్నాయ‌ని.. వైన్ టూరిజం అభివృద్ధిని పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని శుక్ర‌వారం ఆయ‌న సందర్శించారు.

S

Telangana | Published On Jul 31, 2026, 6.01 pm IST

Jupally Krishna Rao | తెలంగాణ‌లో వైన్ త‌యారీ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అవ‌కాశాలున్నాయి
Advertisement
  • ద్రాక్ష రైతుల‌ను ప్రోత్స‌హిస్తే ఉపాధి కూడా పెరుగుతుంది
  • అమెరికాలోని వైనరీ పరిశీల‌నలో మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వైన్ త‌యారీకి అవ‌కాశాలున్నాయ‌ని.. వైన్ టూరిజం అభివృద్ధిని పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని శుక్ర‌వారం ఆయ‌న సందర్శించారు. సెల్లార్ టూర్‌లో పాల్గొని వైనరీ నిర్వహణ, వైన్ తయారీ ప్రక్రియను అధ్యయనం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో ఉన్న స్థితిగ‌తుల‌పై ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

వైనరీ ప్రతినిధులతో మాట్లాడి ద్రాక్ష సాగు, వైన్ తయారీకి అనువైన రకాలు, ప్రాసెసింగ్, ఫెర్మెంటేషన్, నిల్వ, బాట్లింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకున్నాం. ద్రాక్ష తోటలు, వైనరీలను పర్యాటకంతో అనుసంధానిస్తూ గైడెడ్ టూర్లు, హాస్పిటాలిటీ, సందర్శకులకు ప్రత్యేక అనుభూతులను కల్పిస్తున్న విధానాన్ని పరిశీలించాం. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, ద్రాక్ష సాగుకు అనుకూలత, స్థలాల ఎంపిక, పెట్టుబడి నమూనాలను అధ్యయనం చేసి ముందుకు వెళ్తాం అని మంత్రి స్ప‌ష్టం చేశారు.

వైన్ టూరిజం ద్వారా పర్యాటకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు కృషి చేస్తాం. ద్రాక్ష రైతులకు ప్రోత్సాహం, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుంది. తెలంగాణ పర్యాటక విధానం 2025-30లో భాగంగా రాష్ట్రంలో వినూత్న పర్యాటక ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

ద్రాక్షను తొక్కే అనుభూతిని పొందొచ్చు..

తెలంగాణ టూరిజం కాన్‌క్లేవ్‌లో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో పలు పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పంద ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. వాటిలో రాష్ట్రంలోనే తొలిసారిగా వైనరీ వాక్‌థ్రూ అనుభూతితో కూడిన వైన్‌యార్డ్ రిసార్ట్ కూడా ఉంది. ఇందులో ద్రాక్ష సాగు, వైన్ తయారీ, బాట్లింగ్ వరకు మొత్తం ప్రక్రియను సందర్శకులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు సంప్రదాయ పద్ధతిలో ద్రాక్షను తొక్కే ‘గ్రేప్ స్టాంపింగ్’ అనుభూతిని కూడా పొంద‌వ‌చ్చు అని మంత్రి పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా స‌క్సెస్ అయిన‌ నమూనాలు, అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేస్తాం. నిబంధనలకు అనుగుణంగా ద్రాక్ష తోటలు, వైనరీలు, హాస్పిటాలిటీ, స్థానిక వంటకాలను అనుసంధానించేలా చూస్తాం. తెలంగాణకు అనువైన వైన్ టూరిజం నమూనాను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తాం అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

మంత్రి వెంట ప్ర‌భుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement