త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Tower | ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్‌ పనులు

Indiramma Tower | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పనులకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుట్టనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. టవర్స్‌ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అది పూర్తికాగానే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు.

P

Telangana | Published On Jul 31, 2026, 5.27 pm IST

Indiramma Tower | ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్‌ పనులు
Advertisement
  • తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇళ్లు..

Indiramma Tower | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పనులకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుట్టనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. టవర్స్‌ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అది పూర్తికాగానే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ నగర పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా తొలివిడతగా 16 నియోజకవర్గాల్లో ఒక్కోచోట 500 చొప్పున మొత్తం 8 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ 16 నియోజకవర్గాలతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ స్థలాల గుర్తింపు పూర్తయిందన్నారు. దశలవారీగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భూముల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి 20 నుంచి 22 గజాల అన్‌డివైడెడ్‌ షేర్‌ను ఉచితంగా వారి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేస్తామన్నారు. భూమి విలువను కలుపుకొని ఒక్కో ఫ్లాట్‌ మార్కెట్‌ విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌ సమీపంలోనూ ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. పేద కుటుంబాల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇళ్ల కేటాయింపు, నిర్మాణం చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఏ నియోజకవర్గానికి చెందిన వారు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నివాస ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డుతోపాటు ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పాస్‌బుక్‌ వంటి పత్రాలను సమర్పించవచ్చని మంత్రి తెలిపారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ టవర్స్‌ కోసం దరఖాస్తుల గడువును పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 10లోగా దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. ఇంటి కోసం చెల్లించే రూ.10 వేల ఈఎండీపై ఎలాంటి అపోహలకు గురికావద్దని పొంగులేటి తెలిపారు. అర్హత పొందని దరఖాస్తుదారులకు ఈ మొత్తాన్ని వంద శాతం తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. యూపీఐ లేదా నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఈఎండీ చెల్లిస్తే.. అదే బ్యాంకు ఖాతాలోకి నేరుగా రీఫండ్‌ జమ అవుతుందని చెప్పారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం పారదర్శకత, బాధ్యతతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేకూర్చడంతోపాటు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement