త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో విద్య, ఉద్యోగ రంగాలను నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హామీలు ఏమయ్యాయంటూ ఫైర్.

J

Telangana | Published On Aug 12, 2026, 8.31 pm IST

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
Advertisement
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌తో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన
  • కాంగ్రెస్ ఎన్నికల హామీలైన 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని సూటి ప్రశ్న
  • గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తూ.. కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా

Enugula Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా ఆధ్వర్యంలో 'నిరుద్యోగుల ఆర్తనాదం' పేరుతో ఈ మీటింగ్ నిర్వహించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రస్తుత సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏది?

విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నా.. బడ్జెట్‌లో ఆ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది పేదలకు ఇచ్చే ఒక సామాజిక భద్రత అని, అది ఆగిపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి ఉన్నత చదువులకు (Higher education) పంపలేని పరిస్థితి నెలకొందన్నారు. యువత చదువుకుంటే ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.

హామీలు గాలికి.. క్రెడిట్ ఖాతాలోకి

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ (Job calendar), నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ (Mega DSC) హామీలు ఏమయ్యాయని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. "మెగా సినిమాలు వస్తున్నాయి కానీ.. మెగా డీఎస్సీ మాత్రం రావడం లేదు" అంటూ సెటైర్లు వేశారు. అంతేకాకుండా, గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల (Notifications) ద్వారా జరిగిన రిక్రూట్‌మెంట్‌కు.. ప్రస్తుత ప్రభుత్వం నియామక పత్రాలు ఇస్తూ క్రెడిట్ (Credit) తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. "పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది ప్రస్తుత సర్కార్ తీరు" అని ఎద్దేవా చేశారు.

యువతను అణచివేస్తున్నారు..

పోలీస్ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. పోలీస్ శాఖలో వేలాది ఖాళీలు ఉంటే.. కేవలం కొన్ని పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. హక్కుల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టులు, నిర్బంధాలతో అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ సెక్టార్ కుదేలు

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టీ-హబ్ (T-Hub), టీ-వర్క్స్ (T-Works), వీ-హబ్ వంటి సంస్థల ఏర్పాటుతో స్టార్టప్ (Startup), ఐటీ రంగాలకు అనుకూల వాతావరణం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానాలపై ఉన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారని, దీనివల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వంలో జరుగుతున్నట్లు వస్తున్న అవినీతి ఆరోపణలపై పారదర్శకంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. యువత, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, తెలంగాణ యువత భవిష్యత్ సమస్య అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement