త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్‌కు మ‌ళ్లీ నోటీసులివ్వండి.. న్యాయ‌వాదికి భూపాల‌ప‌ల్లి కోర్టు ఆదేశం

KCR | కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది.

S

Telangana | Published On Aug 12, 2026, 7.05 pm IST

KCR | కేసీఆర్‌కు మ‌ళ్లీ నోటీసులివ్వండి.. న్యాయ‌వాదికి భూపాల‌ప‌ల్లి కోర్టు ఆదేశం
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది. గతంలో పంపిన సమన్లు ఆయనకు అందలేదని తేలడంతో ఈసారి నోటీసులను పక్కాగా అందజేయాలని జిల్లా న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా చేప‌ట్టిన‌ విచారణ సందర్భంగా హైదరాబాద్ నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులు, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు భూపాలపల్లి కోర్టుకు హాజరయ్యారు.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ అక్రమాలు, నాణ్యతా లోపాలు జరిగాయని ఆరోపిస్తూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ విచారణను ఆపకుండా కొనసాగించాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చిన విష‌యం విదిత‌మే.

ఈ కేసులో కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, నాటి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రతివాదులుగా ఉన్నారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను భూపాలపల్లి జిల్లా కోర్టు సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
Advertisement