త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం తెచ్చాం.. ఇక ఆటోల‌ను ఎల‌క్ట్రిక్‌గా మార్చేద్దాం.. స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌ను నిర్మిద్దాం

Ponnam Prabhakar | క్యూర్ ప‌రిధిలో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం తీసుకొస్తున్న‌ట్లు మంత్రి పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు. ఈ ప‌థకానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింద‌న్నారు. దీనికి రూ.200 కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు.

S

Telangana | Published On Aug 16, 2026, 1.45 pm IST

Ponnam Prabhakar | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం తెచ్చాం.. ఇక ఆటోల‌ను ఎల‌క్ట్రిక్‌గా మార్చేద్దాం.. స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌ను నిర్మిద్దాం
Advertisement
  • ఈ ప‌థ‌కానికి రూ.200 కోట్లు కేటాయించాం
  • క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది
  • కొత్త ఎల‌క్ట్రిక్ ఆటో కొంటే రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు సాయం అందిస్తాం
  • ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: క్యూర్ ప‌రిధిలో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం తీసుకొస్తున్న‌ట్లు మంత్రి పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు. ఈ ప‌థకానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింద‌న్నారు. దీనికి రూ.200 కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు. ఈ ప‌థ‌కంతో 18,766 ఆటోలకు ప్రయోజనం చేకూర‌నున్న‌ట్లు వివ‌రించారు. రెట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించ‌నున్న‌ట్లు వెల్లడించారు. కాలుష్య నియంత్రణతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యమ‌ని పేర్కొన్నారు. ఈమేర‌కు ఆదివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా మాట్లాడారు.

హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్-2047కు అనుగుణంగా “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం-2026” రూపకల్పనకు ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో భర్తీ చేయడం ద్వారా పట్టణ ప్రజా రవాణాను నెట్-జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులకు చివరి మైలు రవాణాలో ఆటో రిక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం కారణంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ఇంధన ధరల పెరుగుదల ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా CURE ప్రాంతంలోని అర్హత కలిగిన అన్ని ICE ఆటో రిక్షాలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర పథకాన్ని రూపొందిస్తోందని మంత్రి వెల్లడించారు.

18,766 ఆటోలు పథకం పరిధిలోకి..

రవాణా శాఖ అధికారిక డేటాబేస్ ప్రకారం CURE ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌తో క్రియాశీలంగా ఉన్న 18,766 అర్హత కలిగిన ICE ఆటో రిక్షాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. డీజిల్ ఆటోలు 11,254, పెట్రోల్ ఆటోలు 7,512 క‌లిపి మొత్తం 18,766 ఆటోలు అర్హ‌త క‌లిగి ఉన్నాయ‌న్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి తన అవసరానికి అనుగుణంగా రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.

ప్రస్తుత ఆటోకు ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్

తమ ప్రస్తుత ఆటో రిక్షా ఛాసిస్‌ను కొనసాగించాలనుకునే లబ్ధిదారులు AIS-123 ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్ ద్వారా తమ వాహనాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చుకోవచ్చు. ఈ విధానంలో కిట్ ఖర్చు, ఇన్‌స్టాలేషన్, ప్రామాణిక ఫిట్మెంట్ ఉపకరణాల ఖర్చుతో కలిపి రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ వ్యయం - ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తుంది. ఎంపానెల్ చేసిన విక్రేతల ద్వారా అమర్చే ఫిక్స్‌డ్ బ్యాటరీ కిట్ లేదా అవసరమైనప్పుడు తొలగించి తిరిగి అమర్చుకునే స్వాపబుల్ బ్యాటరీ కిట్‌లలో లబ్ధిదారులు తమకు అనుకూలమైన ఎంపిక చేసుకోవచ్చు.

కొత్త ఎలక్ట్రిక్ ఆటోతో పూర్తిస్థాయి మార్పు..

తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను పూర్తిగా అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొనుగోలు చేయాలనుకునే లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఫ్యాక్టరీలో తయారైన, టైప్ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ వీలర్ (L5M) కొనుగోలుకు రూ.1.50 లక్షల స్థిర సబ్సిడీ అందిస్తాం. ఎంపిక చేసిన మోడల్ తుది ఆన్‌రోడ్ ధర నుంచి సబ్సిడీ మొత్తాన్ని ఎంపానెల్ చేసిన డీలర్ ముందుగానే తగ్గించి లబ్ధిదారుడికి వాహనాన్ని అందించే విధంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

రూ.50 కోట్ల చొప్పున‌..

ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపును ప్రతిపాదించింది. పథకం CURE ప్రాంతంలోని వాహన యజమానులందరికీ వారి సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సమానంగా వర్తించనున్నందున, వివిధ సంక్షేమ శాఖల నుంచి నిధులను సమకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లు సమకూర్చే విధంగా ప్రతిపాదన రూపొందించారు.

మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థ..

పథకం పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు అయ్యేలా మూడు స్థాయిల్లో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ (SLSC)

రోడ్లు-భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా, రవాణా శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

పథకం అమలు కమిటీ (SIC)

రవాణా శాఖ కమిషనర్ అధ్యక్షతన, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, CURE ప్రాంతంలోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, నామినేట్ చేసిన సంక్షేమ అధికారులు సభ్యులుగా ఉంటారు. జేటీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

జిల్లా మంజూరు కమిటీ (DSC)

సంబంధిత జిల్లాల కలెక్టర్లు అధ్యక్షతన, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, జిల్లా రవాణా అధికారి తదితరులు సభ్యులుగా ఉంటారు. ఆర్టీవోలు, జిల్లా సంక్షేమ అధికారులు సభ్యులుగా, డీటీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

డ్రైవర్లకు ఆర్థిక ప్రయోజనం

CURE ప్రాంతంలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోలను పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు వీలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం ద్వారా వాయు, శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఖర్చు నుంచి ఆటో డ్రైవర్లు, యజమానులకు ఉపశమనం కల్పించవచ్చని పొన్నం తెలిపారు.

Advertisement
Advertisement