త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమ‌వుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల‌

Etala Rajendar | చుక్క నీరు నిల్వ చేయ‌కుండా న‌దిలో వృథాగా పోయే నీటిని ఎత్తిపోయాల‌ని చెబుతున్నామ‌ని.. అర్థం అవుతుందా రేవంత్‌రెడ్డి గారూ అని మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఫైర‌య్యారు. అన‌వ‌స‌ర‌ భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయాల‌ని సూచించారు.

S

Telangana | Published On Jul 10, 2026, 1.32 pm IST

Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమ‌వుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల‌
Advertisement
  • భేష‌జాలు బంజేసి ఉత్త‌మ్ ఉత్త‌మంగా ఆలోచ‌న చేయాలి
  • నీచుల‌కు నేన్ స‌మాధానం చెప్పాల్సిన ప‌ని లేదు
  • బ‌ద్నాం చేస్తే చేస్తిరి గానీ.. మేడిగ‌డ్డ‌లో ఉన్న నీళ్లు పంప్ చేయండి
  • నాకు ప్ర‌జ‌లే ఫ‌స్ట్‌.. త‌ర్వాతే పార్టీ
  • బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌

Etala Rajendar | త్రినేత్ర‌.న్యూస్‌: చుక్క నీరు నిల్వ చేయ‌కుండా న‌దిలో వృథాగా పోయే నీటిని ఎత్తిపోయాల‌ని చెబుతున్నామ‌ని.. అర్థం అవుతుందా రేవంత్‌రెడ్డి గారూ అని మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఫైర‌య్యారు. అన‌వ‌స‌ర‌ భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయాల‌ని సూచించారు. తాను తెలంగాణ మ‌ట్టిబిడ్డ‌ను, ఉద్య‌మ‌కారున్నిన‌ని.. అదే నా గుర్తింపు అని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం చేస్తే చూస్తూ ఊరుకోన‌ని.. చీల్చి చెండాడుతాన‌ని ఘాటుగా హెచ్చ‌రించారు. మేడిగ‌డ్డ‌ను వినియోగించ‌కుంటే ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని క్ష‌మించ‌ర‌న్నారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎవ‌రి మెప్పు కోస‌మే మాట్లాడేవాళ్లం కాదు..

మేం స్వయం ప్రకాశితులం. ఎవరో మాట్లాడిస్తేనో.. స్క్రిప్ట్ రాసి ఇస్తేనో.. ఎవరి మెప్పు కోసమే మాట్లాడేవాళ్లం కాదు. అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదు. పని చేయాల్సిన వారిని అడుగుతున్నా. దేవాదులకు బ‌రాజ్ లేదు. లేకుండా నీళ్లు పంపు చేస్తున్నారు. మేడిగడ్డ లో నీళ్లు నింపమని అడగడం లేదు. ఉన్న నీళ్లను పంప్ చేయమని అడుగుతున్నా. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

మన దేశం వ్యవసాయ దేశం.. మన ఆదాయం దాని మీద ఆధారపడి ఉంది. 60 శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. నీళ్లు ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడతారు. భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయండి. చుక్క నీరు నిల్వ‌ చేయకండి. నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి అని చెప్తున్నాం. అర్థం అవుతుందా రేవంత్ రెడ్డి గారు అని ఈట‌ల‌ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

కాళ్లేశ్వ‌రం అంటే మేడిగ‌డ్డ ఒక‌టే కాదు..

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బద్నాం చేస్తే ప్రజలు హర్షించరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మాత్రమే కాదు. అన్నారం, సుందిళ్ల‌, రంగనాయ‌క్ సాగ‌ర్‌, మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ ఉన్న‌ది. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు. ఏమ‌న్నా జ్ఞానం ఉందా? వంద‌ల టీఎంసీల నీరు, వంద‌ల కిలోమీట‌ర్ల పైపులైన్లు.. కాల్వ‌లు, ప‌దుల సంఖ్య‌లో టన్నెల్స్‌, పెద్ద పెద్ద ఎల‌క్ట్రిక్ ట‌వ‌ర్లు క‌లిగి ఉన్న‌ది. బ‌ద్నాం చేస్తే చేస్తివి గాని దీన్ని వాడుకోరాదు.. అని ఈటల వ్యంగాస్త్రాలు సంధించారు.

ప్రజల విషయానికొస్తే నాకు తెలంగాణే ఫస్ట్. ఆ తర్వాతే పార్టీ. ఎవరో పలికిస్తే పలికే వ్యక్తిని కాదు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసి తెలంగాణలోని ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తున్నాయి. ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా అన్నదాతలను కష్టాల పాలు చేయడం భావ్యం కాదు. వర్షాకాలం పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల కింద.. బోర్లు, బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం తూములు ఎత్తించి నియోజకవర్గ రైతులకు హీరో అయ్యాను. ఒకవేళ అదే నీళ్లు వరంగల్‌కు చేరకపోతే తనపై చిందులు వేసేవారు.

మూలాలు మ‌రిచినోడు మ‌నిషే కాదు..

రాజకీయాలు, సిద్ధాంతాలు వేరై ఉండొచ్చు. కానీ మూలాలను మరిచిపోయినవాడు మనిషే కాదు. చాలా మంది చరిత్రను మరిచిపోయారు. కాళేశ్వరం కంటే ముందే వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నీళ్లను తీసుకురావాలని ప్లాన్ చేశారు. తాను ఎమ్మెల్యే అయ్యాకే 24 టీఎంసీల సామర్థ్యంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అప్పుడే మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కొండపోచమ్మ ప్రాజెక్టు, మల్లన్న సాగర్.. ఇలా కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలని మొదట ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు.

ఉత్తర తెలంగాణకు నీళ్ల అడ్డా మిడ్ మానేరు..

మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల, ఆ తర్వాత ఎల్లంపల్లికి నీళ్లు తరలించేలా ప్రాజెక్టులను అందుబాటులోకి వ‌చ్చింది. ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన 29 టీఎంసీల నీళ్లే నేడు మిడ్ మానేరు ప్రాజెక్టులో ఉన్నాయి. రైల్వే జంక్షన్‌కు కాజీపేట ఎలాంటిదో.. ఉత్తర తెలంగాణకు నీళ్ల అడ్డా మిడ్ మానేరు. పోచంపాడు ప్రాజెక్టులో 90 టీఎంసీలు, ఎల్ఎండీలో 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికీ, గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క పంటకు కూడా నీళ్లు అందేవి కావు అని ఈట‌ల చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ అయ్యాక.. మిడ్ మానేరులోని 25 టీఎంసీల నీటితో పాటు పోచంపాడు ప్రాజెక్టు నీటిని కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాలోని కొంత భాగానికి సంపూర్ణంగా రెండు పంటలు పండుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు, కాంట్రాక్టులు, డిజైన్ల మార్పుల గురించి తాను మాట్లాడటం లేదు. కానీ అసలు ఆ ప్రాజెక్టు కట్టడమే తప్పు అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు దుర్మార్గం. కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు. భయంకరమైన కరువు వస్తుందని తెలిసి కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement