త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

Uttam Kumar Reddy | ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను వెంటనే పునరుద్ధరించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, వర్షపాతం అంచనాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు ముందస్తు, శాస్త్రీయ మార్గదర్శకాలు అందించాలని సూచించారు.

P

Telangana | Published On Aug 7, 2026, 7.45 pm IST

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
Advertisement
  • నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ
  • మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
  • వరి సాగుపై రైతులకు సూచనలు

Uttam Kumar Reddy | ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను వెంటనే పునరుద్ధరించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, వర్షపాతం అంచనాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు ముందస్తు, శాస్త్రీయ మార్గదర్శకాలు అందించాలని సూచించారు. కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ఉన్నతాధికారులతో కలిసి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత వర్గాలతో కూడిన మండళ్లను పంట కాలానికి ముందు, సీజన్‌లో సమావేశపరచాలని ఆదేశించారు.

వరి సాగుపై అప్రమత్తత అవసరం

జలాశయాల్లో నీటి నిల్వలు, నీటి ప్రవాహాలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, కమాండ్‌ ఏరియాల్లో సాగు పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి రైతులకు సరైన సూచనలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైన జిల్లాల్లో రేపటి నుంచే సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల పరిధిలో అధిక నీటి అవసరమయ్యే వరి సాగుపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్‌ సూచించారు. ఆగస్టు తొలి వారంలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం లభించినా, వాటినే ఆధారంగా చేసుకుని వరి సాగుకు వెళ్లడం సరికాదన్నారు. ఒకసారి నీరు అందిన తర్వాత రెండోసారి సరఫరా పరిస్థితి అనిశ్చితంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి కమాండ్‌ ఏరియాలో ఎంత మేరకు సాగునీరు అందించగలమో, ఎక్కడ పరిమితులు ఉన్నాయో రైతులకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

సాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నిల్వలు తక్కువే

రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ముఖ్యంగా నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇంకా ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు. నేల స్వభావం, నీటి లభ్యత, వ్యవసాయ శాఖ సూచనల ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన నీటి నిల్వలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక లేదా రాజకీయ ఒత్తిళ్లకు లోనై విచక్షణారహితంగా నీటిని విడుదల చేయవద్దని స్పష్టం చేశారు.

1.06 కోట్ల రేషన్‌ స్మార్ట్‌ కార్డులు

పౌర సరఫరాల శాఖ పనితీరుపైనా మంత్రి సమీక్షించారు. అర్హులైన కొత్త లబ్ధిదారులను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 61 లక్షల మంది కొత్త లబ్ధిదారులను చేర్చి, దాదాపు 16 లక్షల కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్‌ కార్డుల ద్వారా 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం స్థానంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు ఆరు కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. అదే రోజు రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు.

 

Advertisement
Advertisement