త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | బ‌లోపేతానికే ‘ఉపాధి’లో మార్పులు

Kishan Reddy | ఉపాధిహామీ ప‌థ‌కాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కీల‌క మార్పులు చేశామ‌ని, పథకం పేరు మార్పు కేవలం అభివృద్ధి లక్ష్యంతోనేన‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోని బీజేపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

P

Telangana | Published On Jan 12, 2026, 4.16 pm IST

Kishan Reddy | బ‌లోపేతానికే ‘ఉపాధి’లో మార్పులు
Advertisement
  • ప‌థ‌కంలో జ‌వాబుదారీత‌నం తీసుకొచ్చాం
  • బీజేపీపై సోష‌ల్ మీడియాలో ప్ర‌తిప‌క్షాల త‌ప్పుడు ప్ర‌చారం
  • ఎంఐఎం సూచ‌న‌లు మాకు అవ‌స‌రం లేదు
  • బీఆర్ఎస్ ప‌ని అయిపోయిందంటూ కేటీఆర్‌కు కౌంట‌ర్‌
  • కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | ఉపాధిహామీ ప‌థ‌కాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కీల‌క మార్పులు చేశామ‌ని, పథకం పేరు మార్పు కేవలం అభివృద్ధి లక్ష్యంతోనేన‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోని బీజేపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌మ ప్ర‌భుత్వం జీఎస్టీలో, బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డంలో స‌హా అనేక ప‌థ‌కాల్లో మార్పులు తీసుకువ‌చ్చామ‌న్నారు. ఉపాధి విష‌యంలో కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నీతి ఆయోగ్ సూచ‌న‌ల మేర‌కు ఉపాధిహామీ ప‌థ‌కంలో మార్పులు చేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉప‌యోగించామ‌ని, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువ‌చ్చామ‌ని కేంద్ర‌మంత్రి తెలిపారు. గ‌తంలో 100 రోజుల ప‌ని దినాలు ఉండ‌గా.. ప్ర‌స్తుతం 125కి పెంచామ‌న్నారు.

వ్య‌వ‌సాయానికి అనుసంధానిస్తున్నాం..

వ్య‌వ‌సాయానికి సైతం ప‌థ‌కాన్ని అనుసంధానిస్తున్నామ‌న్నారు. వ్య‌వ‌సాయం పీక్ సీజ‌న్‌లో కూలీల కొర‌త లేకుండా ప‌థ‌కంతో ల‌బ్ధి జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు. మిగ‌తా స‌మ‌యాల్లో 125 ప‌ని దినాలుండేలా కొత్తగా చ‌ట్టం తీసుకువ‌చ్చామ‌న్నారు. రాష్ట్రాల‌పై అద‌న‌పు భారం వేయ‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వం సైతం అద‌నంగా ఖ‌ర్చు చేస్తుంద‌ని పేర్కొన్నారు. కూలీల పేరుతో ఫేక్ జాబ్ కార్డులు త‌యారు చేసే వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించామ‌న్నారు. ప‌థ‌కాన్ని నీరుకార్చ‌కుండా ప‌టిష్టం చేశామ‌న్నారు. కాంగ్రెస్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు మానుకోవాల‌న్నారు. ఉపాధి విష‌యంలో రాష్ట్రాలు సైతం త‌మ వంతు బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. దేశంలో కేవ‌లం రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాంగ్రెస్ అధికారంలో ఉంద‌ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.

కేటీఆర్‌, ఎంఐఎంకి కౌంట‌ర్‌..

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కిష‌న్‌రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ప‌ని అయిపోయింద‌న్నారు. పార్ల‌మెంట్‌తో పాటు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గెలిచి చూపించింద‌ని.. గాలివాట‌మైతే దేశంలో మూడుసార్లు అధికారంలోకి వ‌స్తామా? అని ప్ర‌శ్నించారు. ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసున‌న్న కిష‌న్‌రెడ్డి.. దేశంలో మ‌ళ్లీ మోదీ నాయ‌క‌త్వంలో పోటీ చేసి అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. పాక్‌లో హిందువ‌ల‌ను లేకుండా చేశార‌ని, బంగ్లాదేశ్‌లోనూ దాడులు జ‌రుగుతున్నాయ‌న్నారు. దేశంలో హిందువులు లేకుంటే ప్ర‌జాస్వామ్యం ఉండ‌ద‌న్న కిష‌న్‌రెడ్డి, ముస్లిం మహిళ ప్రధాని కావాలని ఎంఐఎం నేత‌లు వ్యాఖ్యానించ‌డంలో ఉద్దేశం ఏంటీ? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. దేశ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేలా ఎంఐఎం నేత‌లు మాట్లాడుతున్నారు. అవ‌గాహ‌న లేకుండా, దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌డం అస‌దుద్దీన్‌కు అల‌వాటేన‌ని విమ‌ర్శించారు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్‌ భూభాగంలో ఉగ్రవాదులను మ‌ట్టుపెట్టామ‌ని, దేశాభివృద్ధిపై దృష్టి సారించామ‌న్నారు. ఎంఐఎం సూచనలు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని కిష‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement