త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Bhavan | ప్ర‌భుత్వం విఫ‌ల‌మైతే.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ప్ర‌తిప‌క్షం..

Telangana Bhavan | ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని పండితులు పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 19, 2026, 3.42 pm IST

Telangana Bhavan | ప్ర‌భుత్వం విఫ‌ల‌మైతే.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ప్ర‌తిప‌క్షం..
Advertisement

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌తో ప్ర‌తిప‌క్షానికి బ‌లం
విద్యావిధానంలో మార్పుల‌తో విద్యార్థుల‌కు తీవ్ర న‌ష్టం
నిరుద్యోగం మ‌రింత పెరిగే అవ‌కాశం
ఈ ఏడాది స‌మృద్ధిగా వ‌ర్షాలు
తెలంగాణ భ‌వ‌న్‌లో ఉగాది వేడుక‌లు

Telangana Bhavan | త్రినేత్ర‌.న్యూస్ : ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని పండితులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం పంచాంగ శ్రవణం ప్రారంభమైంది. ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగ శ్రవణం చేసి, ఈ ఏడాది పరిస్థితులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం

విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, అయితే ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు.

నిండు కుండ‌లా చెరువులు, జలాశయాలు

వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని తెలిపారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పారు. అయితే బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని తెలిపారు. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశముందని కూడా హెచ్చరించారు. పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు.

కొంత‌మంది ప్ర‌ముఖులు క‌నుమ‌రుగు

ఉన్నత పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలు ఉండే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశముందని కూడా తెలిపారు. ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండదని పండితులు వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement