త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | హ‌రీశ్‌రావు క్షుద్ర‌పూజ‌లు చేస్తుండు

Mahesh Kumar Goud | టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలనే ఉద్దేశంతో హరీష్‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎలాంటి దాపరికం లేదని, తాము చెబుతున్న విషయాలకు ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Aug 4, 2026, 3.30 pm IST

Mahesh Kumar Goud | హ‌రీశ్‌రావు క్షుద్ర‌పూజ‌లు చేస్తుండు
Advertisement
  • మావ‌ద్ద ఆధారాలు కూడా ఉన్న‌య్‌
  • ప్ర‌జ‌లు క‌రువుతో అల్లాడిపోవాల‌నే పూజ‌లు
  • ఆయ‌న‌లో స్వార్థం ప‌రాకాష్ట‌కు చేరింది
  • అరుంధ‌తి సినిమాలో ప‌శుప‌తిలా వ్య‌వ‌హారం 
  • టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌

Mahesh Kumar Goud | టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలనే ఉద్దేశంతో హరీష్‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎలాంటి దాపరికం లేదని, తాము చెబుతున్న విషయాలకు ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు స్వార్థం పరాకాష్టకు చేరిందని మహేష్‌కుమార్‌ గౌడ్ విమర్శించారు. తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణలో వర్షాలు పడొద్దని, పంటలు పండొద్దని, కరువు రావాలని క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నాశనం కావాలని పూజలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాధారణంగా ప్రజలంతా తమ కుటుంబాలు, రాష్ట్రం బాగుండాలని దేవుడిని మొక్కుతారని, కానీ హ‌రీశ్‌రావు మాత్రం ప్రజలు ఇబ్బందులు పడాలని పూజలు చేశారని ఆరోపించారు.

ఆధారాలు ఉన్న‌య్‌

హ‌రీశ్ క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గలో క్షుద్ర పూజలు జరిగే దేవాలయాలు ఉన్నాయని చెప్పారు. హరీశ్‌రావు మార్చి 2న తిరుచ్చికి వెళ్లారని, అలాగే మే 31, జూన్‌ 1, జులై 23 తేదీల్లో శివమొగ్గకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. తాము చెప్పిన తేదీల్లో హరీశ్ రావు ఎక్కడ ఉన్నారో మీడియా ముందు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ తేదీల్లో ఆయన ఎక్కడున్నారో వెల్లడిస్తే తాము కూడా ముఖ్యమంత్రి తరఫున సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. తిరుపతికి వెళ్లిన ప్రతిసారీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే హరీష్‌రావు, శివమొగ్గలోని అఘోరీ ఆలయానికి వెళ్లిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లిన ఫొటోలను సోషల్‌ మీడియాలో ఎందుకు పోస్టు చేయలేదని నిలదీశారు. తిరుపతిలో చేసినట్లుగా శివమొగ్గలో మీడియాను ఎందుకు ఉద్దేశించి మాట్లాడలేదని ప్రశ్నించారు.

పూజ‌ల వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలి..

క్షుద్ర పూజలు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలకు చెప్పాలని మహేశ్‌కుమార్‌ గౌడ్ డిమాండ్‌ చేశారు. వర్షాలు పడొద్దని, కరువు రావాలని పూజలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో హరీశ్‌రావే వెల్లడించాలని అన్నారు. తన స్వార్థం కోసమే ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడినందుకే సామా రామ్మోహన్‌, దయాకర్‌లకు లీగల్‌ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. నిజాలు చెప్పినందుకే అద్దంకి, సామా రామ్మోహన్‌లకు నోటీసులు పంపించారని పేర్కొన్నారు. ఆ నోటీసులు కూడా ఇదే వ్యవహారంలో భాగమేనని అన్నారు. తాము లీగల్‌ నోటీసులకు భయపడబోమని స్పష్టం చేశారు. నవతెలంగాణ వార్షికోత్సవ సభలో విమర్శలు, ప్రతి విమర్శల అంశాన్ని సభాముఖంగానే కేటీఆర్‌కు చెప్పానని మహేష్‌కుమార్‌ గౌడ్ తెలిపారు.

బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే..

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అఘోర, తాంత్రిక పూజలు చేసే సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో క్షుద్ర పూజలు జరుగుతాయనే ప్రచారాన్ని ఇంతకాలం తాను నమ్మలేదని, అయితే హరీష్‌రావు వ్యవహారం చూస్తే ఆ ప్రచారంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు హరీష్‌రావు తీరు చూస్తే కేసీఆర్‌పై వచ్చిన ప్రచారం కూడా నిజమేనేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టకు వచ్చి పొర్లు దండాలు పెట్టి ఏం చేశారో హరీష్‌రావు ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంత్రాలు, తంత్రాలతో ఇబ్బందులు పెట్టిన సంఘటనలు ఉన్నాయని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి క్షుద్ర పూజలను బలంగా నమ్మే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

ప‌శుప‌తిలా వ్య‌వ‌హారం..

హరీశ్‌రావు వ్యవహారం చూస్తే ‘అరుంధతి’ సినిమాలోని పశుపతి పాత్ర గుర్తుకు వస్తోందని మహేష్‌కుమార్‌ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యవహారం అదే తరహాలో ఉందని విమర్శించారు. అలాగే, "పెట్రోల్‌ పోసుకున్న హరీష్‌కు అగ్గిపెట్ట మాత్రమే దొరకలేదు" అంటూ ఎద్దేవా చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా హ‌రీశ్‌రావు సమాధానం చెప్పాలని మహేశ్‌కుమార్‌ గౌడ్ డిమాండ్‌ చేశారు. తాము వెల్లడించిన తేదీల్లో ఎక్కడికి వెళ్లారో, శివమొగ్గ పర్యటన ఉద్దేశం ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కోరారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు నోటీసులు పంపించడం వల్ల నిజాలు మారవని, ఈ అంశంపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement