త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | కాంగ్రెస్ నా అయ్యా జాగీరు కాదు.. నేనొక చిన్న ఉద్యోగిని: జ‌గ్గారెడ్డి

Jagga Reddy | కాక్రోచ్ ఉద్యమానికి రాహుల్ గాంధీ మ‌ద్ద‌తివ్వాల‌ని.. కాంగ్రెస్ త‌న‌ అయ్య జాగీరు కాదని.. తానొక చిన్న ఉద్యోగిన‌ని మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను సీతారాముల క‌ళ్యాణం బ్ర‌హ్మాండంగా చేస్తాన‌న్నారు. కానీ దేవుడి పేరిట ఓట్లు అడ‌గ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On May 23, 2026, 5.46 pm IST

Jagga Reddy | కాంగ్రెస్ నా అయ్యా జాగీరు కాదు.. నేనొక చిన్న ఉద్యోగిని: జ‌గ్గారెడ్డి
Advertisement
  • పార్టీ రాహుల్ గాంధీది
  • కాక్రోచ్ ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతివ్వాలి
  • కాక్రోచ్ గురించి చెప్పేది.. చెప్పాల్సింది రాహుల్ గాంధీనే
  • నేను సీతారాముల క‌ళ్యాణం బ్ర‌హ్మాండంగా చేస్తా..
  • కానీ ఆయ‌న పేరిట ఓట్ల‌డ‌గా
  • మ‌తం పేరు వాడుకొని, ఓట్లు దొంగ‌లించి బీజేపీ గెలుస్తుంది
  • మోదీకి అహంకారం పెరిగింది
  • బీజేపీ అధికారంలోకి రాకముందు రూ.54 లక్షల కోట్లు అప్పు ఉండే
  • ఇప్పుడు రూ.147 లక్షల కోట్లకు పెరిగింది
  • మీడియా స‌మావేశంలో బీజేపీపై మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌లు

త్రినేత్ర‌.న్యూస్‌: కాక్రోచ్ ఉద్యమానికి రాహుల్ గాంధీ మ‌ద్ద‌తివ్వాల‌ని.. కాక్రోచ్ గురించి చెప్పేది.. చెప్పాల్సింది ఆయ‌నేన‌ని మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ త‌న‌ అయ్య జాగీరు కాదని.. తానొక చిన్న ఉద్యోగిన‌ని వ్యాఖ్యానించారు. మ‌తం పేరు వాడుకొని, ఓట్లు చోరీ చేసి బీజేపీ ఎన్నిక‌ల్లో గెలుచుకుంటూ వ‌స్తుంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌ధాని మోదీకి అహంకారం పెరిగింద‌న్నారు. తాను సీతారాముల క‌ళ్యాణం బ్ర‌హ్మాండంగా చేస్తాన‌న్నారు. కానీ దేవుడి పేరిట ఓట్లు అడ‌గ‌న‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

రాజ్యాంగం దేశ ప్ర‌జ‌ల‌కు క‌వ‌చం లాంటిది..

రాహుల్ గాంధీ మాట్లాడిన సంవిధాన్ బచావ్ కీలకమైన అంశం. ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. దేశ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే రాహుల్ గాంధీది. రాజ్యాంగం దేశ ప్రజలకు కవచం లాంటిది. మహాభారతంలో కర్ణుడికి కవచ కుండలాల లాగా. కవచ కుండలాలు ఉన్నంత కాలం కర్ణుడికి ప్రమాదం లేదు.
ఎప్పుడైతే వాటిని దానం ఇచ్చాడో చావు ప్రయాణం మొదలైంది. ప్రజలకు కూడా రాజ్యాంగం అట్లనే రక్షణ.
రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం గురించి అదే చెప్తున్నారు అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.

అప్పుడు బీజేపీ లేదు.. మోదీ లేడు..

ఎన్నికల కమిషన్ ద్వారా తొలిసారి నెహ్రూ ప్రధాని అయ్యారు. ప్రజలకు అవసరమైన వ్యవస్థలు సిద్ధం చేశారు. బ్యాంకులను జాతీయకరణ చేసింది ఇందిరా గాంధీ. పేదల వరకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చింది ఇందిరా గాంధీ. ప్రతీ పేదకు భూమి, ఇల్లు ఇచ్చారు. రాజీవ్ గాంధీ వచ్చి ఐటీకి బీజం వేశారు. యువ‌త‌కు ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ. అప్పుడు బీజేపీ లేదు, మోదీ లేడు. అప్పటికే అభివృధి బీజం వేశారు. గాంధీ కుటుంబం పాలనలో సుపరిపాలన అందింది.

2014లో మోదీ ప్రధాని అయ్యాక.. 2019లో ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకుని గెలిచారు. ఓటు చోరీకి గురైంది. రాహుల్ గాంధీ ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. ప్రజలు తమకు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడే ప్రజలకు మేలు జ‌రుగుతుంది. బీజేపీ ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వస్తున్నారు. ప్ర‌జలు బీజేపీ మోసాన్ని గుర్తించాలి. బీజేపీ ఇప్పుడు మతం పేరుతో కొంత.. దొంగ ఓట్లతో కొంత గెలుస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కొల్లగొడుతుంది. బీజేపీ అధికారంలోకి రాకముందు రూ.54 లక్షల కోట్లు అప్పు ఉండే. ఇప్పుడు రూ.147 లక్షల కోట్లు అప్పు పెరిగింది. ఇది దేశ ప్రజలు గమనించాలి అని ఆయ‌న కోరారు.

రాజ్యాంగం ఎలా ఎత్తేయాలనేదే వాళ్ల ఆలోచ‌న‌..

రాహుల్ గాంధీ కుటుంబం ఏ రోజు కూడా ఓట్ల కోసమో, అధికారం కోసమో పని చేయదు. ఎప్పుడూ దేశ ప్రజలు బాగుండాలని ఆలోచిస్తారు. గాంధీ కుటుంబం ఆస్తులే కాదు.. ప్రాణ త్యాగం కూడా చేశారు. ఉపాధి హామీ లాంటి పథకాలు పేద కుటుంబాల‌కు మేలు చేయాలనే చేశారు. మీరు వాడే ఫోన్ లు తెచ్చింది రాజీవ్ గాంధీ. మోదీ ఏం చేశారు? యుద్ధం చేశారు అంటారు.. యుద్ధం ఎవరికి లాభం? పేదలకు భూములు ఇచ్చిన ఇందిరా గాంధీని మర్చిపోతున్నారు. దేశ ప్రజలకు మోదీ 11 ఏండ్లలో ఏం చేశారో చెప్పాలి? ఒకటి ఓటు చోరీ.. రాజ్యాంగం ఎలా ఎత్తివేయాలి అనేదే వాళ్ల‌ ఆలోచన అని జ‌గ్గారెడ్డి ఆరోపించారు.

శివాజీకి మ‌తం పులిమారు..

బీజేపీ వాళ్లు మాట్లాడితే హిందువు అంటారు. నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కరైనా చేస్తారా? నేను కళ్యాణం చేసినా రాముడి పేరుతో ఓట్లే అడగను. ప్రజలు మీ మత్తులో పడ్డారు
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఒక్క పోరడు అడగడు. పిల్లలకు శివాజీ అంటారు. శివాజీ మహారాజ్ దగ్గర మంత్రిగా చేసింది ఎవరో తెలుసా.. ఒక‌ ముస్లిం. ఇప్పుడు శివాజీకి మతం పులిమారు.

తెలంగాణ‌లో 12 ఎంపీ సీట్లు గెలిపించండి..

నెహ్రూ, ఇందిరా గాంధీ కట్టిన స్కూల్ లోనే బీజేపీ నేతలు చదువుకున్నారు. రాహుల్ గాంధీనీ వచ్చే ఎన్నికల్లో ప్రధాని చేయాలి. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలిచి పంపాలి. ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావద్దంటే కాంగ్రెస్ కి 18 సీట్లు ఇవ్వండి. ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి.
చంద్రబాబు, జగన్ వల్ల అది సాధ్యమే కాదు. ఓట్లను ఖరాబ్ చేసుకోకండి. దేవుడు కూడా ఓటును సద్వినియోగం చేసుకోండి అనే చెప్తారు.

బీజేపీ డూప్లికేట్ అని తేలిపోతుంది..

300 ఎంపీ సీట్లు కాంగ్రెస్ కి ఇవ్వండి. దేశాన్ని, రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ కాపాడతారు. కాక్రోచ్ ఉద్దేశం ఏందో తెలియదు. నెహ్రూ నుండి ఇప్పటి పాలన‌ వరకు పోల్చండి. బీజేపీ డూప్లికేట్ అని తేలిపోతుంది. కాంగ్రెస్ నా అయ్యా జాగీరు కాదు. కాక్రోచ్ ఉద్యమంకి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వాలి. నేను కాంగ్రెస్ లో చిన్న ఉద్యోగం చేస్తున్న. పార్టీ రాహుల్ గాంధీది. కాక్రోచ్ గురించి చెప్పేది.. చెప్పాల్సింది రాహుల్ గాంధీనే. మోడీకి అహంకారం పెరిగింది. పాలన మీద పట్టులేదు. ప్రజలు ఏం చెప్పినా నమ్ముతార‌ని అనుకుంటున్నారు. రాముడు కాకుంటే కృష్ణుణ్ణి ముందు పెట్టొచ్చు అని అహంకారం. అహంకార నాయకులకు కాలం నిర్ణయిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement