త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGMSIDC Review Telangana | ఆ రోగులకు ప్రభుత్వం అండ.. ఉచితంగా మందులు: దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారదర్శక సేవలు, హిమోఫిలియా బాధితులకు ఉచిత మందులు, కొత్తగా 4 సీఎంఎస్ కేంద్రాల ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

J

Telangana | Published On Jun 17, 2026, 7.48 pm IST

TGMSIDC Review Telangana | ఆ రోగులకు ప్రభుత్వం అండ.. ఉచితంగా మందులు: దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయాలు

సంక్షిప్త సారాంశం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీఎంఎస్ఐడీసీ (TGMSIDC) సేవలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య పరికరాలు, మందుల కొనుగోలు టెండర్లలో పారదర్శకత కోసం మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హిమోఫిలియా వ్యాధితో బాధపడేవారికి జనరల్ ఆసుపత్రుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తుందని స్పష్టం చేశారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS)కు శాశ్వత భవనాలు నిర్మించడంతో పాటు, హాస్పిటల్ స్థాయిని బట్టి 'ప్రామాణిక ఎక్విప్‌మెంట్ జాబితా' సిద్ధం చేయాలని నిర్ణయించారు.

Advertisement

TGMSIDC Review Telangana | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ భవనంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGMSIDC) అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మందుల కొనుగోళ్లలో పారదర్శకత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, హిమోఫిలియా (Hemophilia) బాధితులకు ఉచిత వైద్యం అందించడం తదితర అంశాలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

టెండర్లలో పక్కా పారదర్శకత.. 5 కమిటీల ఏర్పాటు

TGMSIDC ద్వారా కొనుగోలు చేసే మందులు, సర్జికల్స్, రీజెంట్స్, ఎక్విప్‌మెంట్ టెండర్లలో పారదర్శకత పెంచేలా కఠిన నిబంధనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 2 కమిటీలకు అదనంగా మరో 3 కమిటీలను జోడించి.. మొత్తం 5 కమిటీలతో మానిటర్ చేయనున్నారు. అలాగే, సంస్థలో ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న అధికారులను వెంటనే బదిలీ (Transfer) చేయాలని ఎండీ గౌరవ్ ఉప్పల్‌కు ఆయన తేల్చి చెప్పారు.

హిమోఫిలియా రోగులకు ఫ్రీగా మెడిసిన్స్

ప్రాణాంతక హిమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఆ బాధితులకు ప్రతీ నెలా అవసరమయ్యే ఖరీదైన మందులను జనరల్ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా హిమోఫిలియా-A రోగులకు వాడే 'Emicizumab' డ్రగ్‌ను ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌తో పాటు ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తక్షణమే అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

సరికొత్తగా 4 మెడిసిన్ స్టోర్ కేంద్రాలు

రాష్ట్రంలో మందుల సరఫరా వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేసేందుకు CURE ఏరియా పరిధిలో కొత్తగా 4 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 CMS కేంద్రాలకు పర్మినెంట్ బిల్డింగ్స్ (శాశ్వత భవనాలు) నిర్మించడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

హాస్పిటల్స్ కోసం 'స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్ జాబితా'

PHC (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), CHC (సామాజిక ఆరోగ్య కేంద్రాలు), ఏరియా,  జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి చర్యలు చేపట్టనున్నారు. అన్ని ఆసుపత్రులలో ఏకరూపత ఉండేలా.. హాస్పిటల్ స్థాయిని బట్టి అవసరమైన ఎక్విప్‌మెంట్‌పై ఒక ప్రామాణిక (Standard) జాబితాను రూపొందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సివిల్ వర్క్స్ పనులను ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను (Nodal officers) నియమించనున్నారు.

ఈ సమీక్ష సమావేశంలో TGMSIDC కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, కార్పొరేషన్ అధికారులు, ED ఇంచార్జి వెంకటేశ్వర్లు, సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement