త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apollo Hospitals FEMA Violation | అపోలో హాస్పిటల్స్‌పై ‘ఫెమా’ కొరడా.. రూ. 2400 కోట్ల నిబంధనల ఉల్లంఘన, డైరెక్టర్లకు భారీ జరిమానా!

నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు (FDI) సమీకరించిన కేసులో అపోలో ఆస్పత్రికి RBI భారీ షాక్ ఇచ్చింది. రూ. 17.76 కోట్ల కాంపౌండింగ్ ఫీజు విధించింది.

J

Hyderabad | Published On Jun 17, 2026, 8.55 pm IST

Apollo Hospitals FEMA Violation | అపోలో హాస్పిటల్స్‌పై ‘ఫెమా’ కొరడా.. రూ. 2400 కోట్ల నిబంధనల ఉల్లంఘన, డైరెక్టర్లకు భారీ జరిమానా!

సంక్షిప్త సారాంశం

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంది. సుమారు రూ. 2,400 కోట్ల విలువైన ఫెమా (FEMA) ఉల్లంఘనలకు గాను అపోలో యాజమాన్యం రూ. 17.76 కోట్లను కాంపౌండింగ్ ఫీజుగా (వన్-టైమ్ పేమెంట్) చెల్లించింది. కంపెనీకి చెందిన ఐదుగురు డైరెక్టర్లు, ఉన్నతాధికారులకు కూడా తలో రూ. 18 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఎఫ్డీఐలు (FDI) అనుమతించని రంగంలో పెట్టుబడులు స్వీకరించడం, పరిమితికి మించి విదేశీ నిధులు పొందడం వంటి ప్రధాన ఆరోపణలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తమ దర్యాప్తులో గుర్తించింది.

Advertisement

Apollo Hospitals FEMA Violation | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ హెల్త్‌కేర్ దిగ్గజం 'అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్'కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA-ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ఆధారంగా.. సుమారు రూ. 2,400 కోట్ల మేర ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో అపోలో యాజమాన్యం తాజాగా రూ. 17.76 కోట్ల కాంపౌండింగ్ ఫీజును (Compounding fee) చెల్లించింది. ఈ మేరకు ఆర్బీఐ జూన్ 17న అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ఐదుగురు డైరెక్టర్లకు తలో రూ. 18 లక్షల ఫైన్

ఫెమా చట్టం 1999, సెక్షన్ 15 కింద ఆర్బీఐ ఈ కాంపౌండింగ్ ఆర్డర్‌ను జారీ చేసింది. అపోలో సంస్థతో పాటు ఐదుగురు డైరెక్టర్లు/అధికారులపై కూడా ఆర్బీఐ జరిమానా విధించింది. ప్రీతారెడ్డి, సునీతారెడ్డి, ఎస్.కె. వెంకట్రామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్.ఎం. కృష్ణన్‌లకు ఒక్కొక్కరికి రూ. 18 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఈడీ (ED) ఈ కాంపౌండింగ్ ఆర్డర్‌కు 'నో అబ్జెక్షన్' (ఎలాంటి అభ్యంతరం లేదు) అని తెలిపిన తర్వాతే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగిందంటే?

కచ్చితమైన సమాచారం మేరకు ఈడీ అధికారులు అపోలో సంస్థపై ఫెమా కింద దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తు పూర్తయ్యాక అడ్జడికేటింగ్ అథారిటీ (Adjudicating Authority) ముందు సెక్షన్ 16 కింద ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో అపోలో యాజమాన్యం తమ ఉల్లంఘనలకు గాను కాంపౌండింగ్ కోసం ఆర్బీఐని ఆశ్రయించింది. చట్టం ప్రకారం కాంపౌండింగ్‌కు ఈడీ అభ్యంతరం లేదని తెలపడంతో ఆర్బీఐ ఈ జరిమానాతో కేసును ముగించింది.

ప్రధాన ఉల్లంఘనలు ఇవే:

ఆర్బీఐ ఆర్డర్ ప్రకారం అపోలో చేసిన ప్రధాన ఫెమా ఉల్లంఘనలు కింద విధంగా ఉన్నాయి.

ఎఫ్డీఐల రాక: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) అనుమతించని రిటైల్ ట్రేడింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా రూ.859.87 కోట్ల విదేశీ నిధులను సంస్థ స్వీకరించింది.

FCCBల జారీ: నిబంధనలకు విరుద్ధంగా ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లను (FCCB) జారీ చేయడం ద్వారా రూ. 70.02 కోట్లు సమీకరించింది.

పరిమితికి మించి పెట్టుబడులు: FII-PIS రూట్ ద్వారా 24 శాతం పైడ్-అప్ క్యాపిటల్ పరిమితిని మించిపోయి సుమారు రూ. 623.87 కోట్ల విదేశీ పెట్టుబడులు పొందింది.

సెక్టోరల్ క్యాప్ బ్రేక్: మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌లో 51 శాతం ఓవరాల్ సెక్టోరల్ క్యాప్ లిమిట్‌ను బ్రేక్ చేస్తూ ఏకంగా రూ. 870.66 కోట్లను స్వీకరించింది.

వివాదానికి ముగింపు

మొత్తంగా ఈ నిబంధనల ఉల్లంఘనలన్నింటినీ కలుపుకుంటే సుమారు రూ. 2,424 కోట్లకు పైగానే ఉంటుందని ఆర్బీఐ లెక్కగట్టింది. అయితే, అపోలో యాజమాన్యం ఫైన్ కింద రూ. 17,76,80,121 (సుమారు 17.76 కోట్లు) ను వన్-టైమ్ పేమెంట్‌గా చెల్లించింది. డైరెక్టర్లు సైతం తమ జరిమానాను చెల్లించారు. దీంతో అపోలో సంస్థపై ఫెమా కింద కొనసాగుతున్న అడ్జడికేషన్ విచారణలు, తదుపరి చట్టపరమైన కేసుల (Litigation) నుంచి విముక్తి లభించింది.

Advertisement
Advertisement