త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | ఘ‌నంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’..

Minister Vivek | యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి అన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకల్లో మంత్రి పాల్గొని ఉద్యోగాలు సాధించిన యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

P

Telangana | Published On Jul 16, 2026, 8.27 pm IST

Minister Vivek | ఘ‌నంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’..
Advertisement
  • నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తెలంగాణను నిల‌బెట్ట‌డ‌మే లక్ష్యం
  • మంత్రి వివేక్ వెంకటస్వామి
  • 1,775 మందికి ఉద్యోగ నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేత‌

Minister Vivek | యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి అన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకల్లో మంత్రి పాల్గొని ఉద్యోగాలు సాధించిన యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాబ్‌మేళాల ద్వారా ఎంపికైన అభ్యర్థులతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) విద్యార్థులకు నియామక పత్రాలు అందించారు. విదేశీ ఉద్యోగాలకు ఎంపికైన 19 మంది ఫిజియోథెరపిస్టులకు కూడా ఆఫర్ లెటర్లు పంపిణీ చేశారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి స్కిల్ డెవలప్‌మెంట్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సీఎన్‌సీ, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ మార్పులతో శిక్షణ సామర్థ్యం 18,484 నుంచి 34,344 మందికి పెరిగిందని, ప్రస్తుతం 65 ఐటీఐల్లో 35 ట్రేడ్లలో 15,860 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ఎన్‌సీవీటీ సర్టిఫికేషన్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ష్నైడర్, సీమెన్స్ తదితర సంస్థల సహకారంతో సాంకేతిక శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఏఐ శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జాబ్‌మేళాల్లో 116 పరిశ్రమలు పాల్గొనగా, 2,572 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, వారిలో 1,775 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరిలో 1,216 మంది ఏటీసీ విద్యార్థులు, 559 మంది ఐటీఐ విద్యార్థులు ఉన్నారని, నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలతో ఉద్యోగాలు పొందారని తెలిపారు. విదేశీ ఉపాధి అవకాశాలను పెంచేందుకు జర్మన్, జపనీస్ తదితర భాషల్లో శిక్షణ అందించేందుకు ఈఎఫ్‌ఎల్‌యూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. భాషా నైపుణ్యాలతో తెలంగాణ యువతకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతాయని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక శిక్షణ విస్తరణకు 54 కొత్త అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో 50 వేల మంది యువతకు శిక్షణ అందించడమే లక్ష్యమని, జూలై 26 నుంచి ఆగస్టు 30 వరకు మరో విడత జాబ్‌మేళాలు నిర్వహించి 10 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. శిక్షణ నుంచి ఉద్యోగం వరకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

Advertisement
Advertisement