త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | కంటి మీద కునుకు లేద‌మ్మ‌.. ప‌ల్లె క‌న్నీరు పెడుతుంది చూడ‌మ్మా..

Telangana | నీళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కృష్ణా గోదావరి బేసిన్లలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో మొత్తం కలిపి మనం వాడుకోదగ్గవి కేవలం 42.18 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. ఏదైనా అదృష్టం బావుండి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు పడితే తప్ప.. ఎగువన ఉన్న కృష్ణ, గోదావరి నుంచి దిగువకు నీళ్లొచ్చే పరిస్థితి లేదని అంగీకరించింది. ఇది చాలదన్నట్టు.. భూగర్భ జలాలు రానురానూ అడుగంటి పోతున్నాయని ఆగస్టు నాటికి ఇంకో రెండు మీటర్ల లోతుకు పడిపోతున్నట్టు తెలిపింది.

S

Telangana | Published On Jul 16, 2026, 7.32 pm IST

Telangana | కంటి మీద కునుకు లేద‌మ్మ‌.. ప‌ల్లె క‌న్నీరు పెడుతుంది చూడ‌మ్మా..
Advertisement

మిగిలిన నీళ్లు 42 టీఎంసీలే.. ఇక దేవుడే దిక్కు..
సాగునీటికైనా తాగునీటికైనా అవే దిక్కు
పరిశ్రమలకు,సింగరేణికి కూడా వాటితోనే సరి
డెడ్ స్టోరేజీకి చేరుకున్న కృష్ణా, గోదావరి రిజర్వాయర్లు
డెడ్ స్టోరేజీ మినహాయిస్తే
నాగార్జున సాగర్ లో మిగిలినవి 6 టీఎంసీలే
అక్టోబర్ వరకు వర్షాలు అంతంతే
వచ్చే 3 నెలల్లో భారీగా పడిపోనున్న భూగర్భ నీటి మట్టాలు
కఠోర వాస్తవాలను వెల్లడించిన ఎల్ నినో కంటింజెన్సీ ప్రణాళిక
ఆరుతడి పంటలతో సరిపెట్టుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు
ప్రతి చుక్క నీరు విలువైనదేనంటూ హెచ్చరికలు

Telangana | త్రినేత్ర.న్యూస్ : నీళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కృష్ణా గోదావరి బేసిన్లలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో మొత్తం కలిపి మనం వాడుకోదగ్గవి కేవలం 42.18 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. ఏదైనా అదృష్టం బావుండి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు పడితే తప్ప.. ఎగువన ఉన్న కృష్ణ, గోదావరి నుంచి దిగువకు నీళ్లొచ్చే పరిస్థితి లేదని అంగీకరించింది. ఇది చాలదన్నట్టు.. భూగర్భ జలాలు రానురానూ అడుగంటి పోతున్నాయని ఆగస్టు నాటికి ఇంకో రెండు మీటర్ల లోతుకు పడిపోతున్నట్టు తెలిపింది.

గోదావరి రిజర్వాయర్లలో ఉన్నవి కేవలం 29 టీఎంసీలే

రాష్ట్రంలో ఉన్న అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్ల పరిస్థితిపై ఎల్ నినో కంటింజెన్సీ ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నివేదిక ప్రకారం.. గోదావరి బేసిన్ లో 7 మేజర్ రిజర్వాయర్లు , 28 మీడియం రిజర్వాయర్లు ఉండగా ఉండగా..వాటన్నింటిలో ప్రస్తుతం ఉన్న నీళ్లు 66.509 టీఎంసీలు కాగా, డెడ్ స్టోరేజీ కోసం 37.219 టీఎంసీలు ఉంచాల్సి ఉంది. అవి పోను ఇక మిగిలిన 29.30 టీఎంసీలను మాత్రమే మనం వినియోగించుకోవాల్సి ఉంది. గోదావరి పై ఉన్న ప్రాజెక్టులకు ఆయువుపట్టైన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 7.85 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో.. 3.31 టీఎంసీలను డెడ్ స్టోరేజీ కోసం ఉంచాలి. అవి పోను వాడుకోదగ్గ నీళ్లు కేవలం 4.54 టీఎంసీలే ఉండడం ఆందోళన కలిగించే విషయం. నిజాంసాగర్ లో 0.63 టీఎంసీలు, శ్రీరాం సాగర్ లో 0.28 టీఎంసీలు, లోయర్ మానేరు డ్యాంలో 3.6 టీఎంసీలు, మిడ్ మానేరులో 1.17 టీఎంసీలు, కడెంలో 0.22 టీఎంసీలు, సింగూరులో 3.66 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగిన నీళ్లు ఉన్నాయి. మరోవైపు శ్రీరాం సాగర్, సింగూరు, ఎల్లంపల్లి జలాశయాల్లోకి కేవలం 200కు మించి క్యూసెక్కులు మాత్రమే ఇన్ ఫ్లో లు ఉన్నాయి.

కృష్ణాలో మిగిలినివి 12.88 టీఎంసీలే

కృష్ణా నది బేసిన్లో ఉన్న రిజర్వాయర్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్టు కంటింజెన్సీ ప్లాన్ నివేదిక వెల్లడించింది. ఆ గణాంకాల ప్రకారం కృష్ణా నదిపై తెలంగాణలో 2 మేజర్ రిజర్వాయర్లు, 8 మీడియం రిజర్వాయర్లు ఉన్నాయి. వీటన్నింటి పూర్తి సామర్థ్యం కలిపి 337.06 టీఎంసీలు. ప్రస్తుతం నిల్వ ఉన్నది 149 టీఎంసీలు కాగా, డెడ్ స్టోరేజీ కోసం నిల్వ ఉంచాల్సినవి 136.53 టీఎంసీలు నిల్వ ఉంచాలి. అవి పోనూ..ఇక మనం వాడుకోదగ్గ నీళ్లు కేవలం 12.88 టీఎంసీలే. ఈ గణాంకాలలో శ్రీశైలం రిజర్వాయర్ ను మన రాష్ట్రం చూపకపోవడం గమనార్హం. మేజర్ ప్రాజెక్టుల్లో కేవలం జూరాల, నాగార్జున సాగర్ ను మాత్రమే లెక్కించారు. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు అయినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న నిల్వ 137.86 టీఎంసీలే. కాగా ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 131.85 టీఎంసీలు. దీంతో మనకు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లు కేవలం 6 టీఎంసీలు మాత్రమే.

28 జిల్లాల్లో లోటు వర్షం

ఎల్ నినో ప్రభావంతో జూన్ నెలలోనే 9.46 మీటర్ల స్థాయికి పడిపోయిన భూగర్భ నీటి మట్టాలు జూలై నెలలో 10.35 మీటర్లకు దిగజారాయి. ఆగస్టులో 11.01 మీటర్లకు పడిపోనున్నట్టు కంటింజెన్సీ ప్రణాళిక నివేదిక స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలో 228 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 30 శాతం లోటుతో కేవలం 158 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసిందని తెలిపింది. 33 జిల్లాలకు గాను మొత్తం 28 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వానలు పడినట్టు నివేదిక వెల్లడించింది. ఆగస్టులో మరో 15 శాతం తక్కువగా, సెప్టెంబర్ లో 42 శాతం తక్కువగా, అక్టోబర్ లో 55 శాతం తక్కువగా వానలు కురిసి కరువు ఛాయలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Advertisement
Advertisement