త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal – Sonam Wangchuk | ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి, వాంగ్‌చుక్‌కు పదవివ్వండి: కేంద్రానికి కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్!

జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను కేజ్రీవాల్ కలిశారు. అన్నా హజారే ఉద్యమాన్ని గుర్తుచేస్తూ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

J

National | Published On Jul 16, 2026, 8.09 pm IST

Arvind Kejriwal – Sonam Wangchuk | ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి, వాంగ్‌చుక్‌కు పదవివ్వండి: కేంద్రానికి కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్!

సంక్షిప్త సారాంశం

జంతర్ మంతర్ వద్ద 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌కు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వైఫల్యాలకు బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి, వాంగ్‌చుక్‌ను విద్యాశాఖ మంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. 2011 నాటి అన్నా హజారే ఉద్యమాన్ని గుర్తుచేసిన ఆయన, వాంగ్‌చుక్ మాట వినకపోతే యూపీఏ ప్రభుత్వానికి పట్టిన గతే ఎన్డీయేకి పడుతుందని హెచ్చరించారు. జులై 20న సీజేపీ (CJP) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Advertisement

Arvind Kejriwal - Sonam Wangchuk | త్రినేత్ర.న్యూస్ : న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన నిరాహార దీక్షను (Hunger strike) కొనసాగిస్తున్న ప్రముఖ విద్యావేత్త, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను (Sonam Wangchuk) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం కలిశారు. ఆయన పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటించిన కేజ్రీవాల్.. నీట్ (NEET) పేపర్ లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

"వాంగ్‌చుక్‌ను చూస్తే ప్రధానికి భయం"

దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వాంగ్‌చుక్ సిద్ధమయ్యారని కేజ్రీవాల్ కొనియాడారు. "ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించండి. ఆ స్థానంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను దేశ విద్యాశాఖ మంత్రిగా (Education Minister) నియమించండి" అని ఆయన డిమాండ్ చేశారు. లద్దాఖ్ కోసం గతంలోనూ దీక్షలు చేసిన ఈ గొప్ప విద్యావేత్త.. ఇప్పుడు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారనే భయమే ప్రధానమంత్రిలో కనిపిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు.

2011 అన్నా హజారే ఉద్యమం రిపీట్ అవుతుంది

ఈ సందర్భంగా 2011 నాటి చరిత్రాత్మక లోక్‌పాల్ ఉద్యమాన్ని కేజ్రీవాల్ గుర్తుచేశారు. "సరిగ్గా ఏప్రిల్ 2011లో అన్నా హజారేతో కలిసి నేను ఇక్కడే దీక్షకు కూర్చున్నాను. ఇప్పుడు ప్రభుత్వం వాంగ్‌చుక్ మాట వినకపోతే.. మూడేళ్ల తర్వాత అప్పటి యూపీఏ (UPA) ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుంది" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పేపర్ లీకేజీలు.. విద్యార్థుల పాలిట శాపాలు

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ (Competitive exams) రాసే విద్యార్థులు తమ కష్టంతో భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్న నమ్మకంతో పరీక్షా కేంద్రాలకు వెళ్తారని.. ఇలాంటి లీకేజీలు వారి ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీస్తాయని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తానూ ఐఐటీ (IIT) ఎంట్రెన్స్ రాసి క్లియర్ చేశానని, తన ఇద్దరు పిల్లలు కూడా అదే సంస్థలో చదువుకున్నారని గుర్తుచేశారు. 2024 పేపర్ లీకేజీ కేసుల్లో ప్రధాన నిందితులకు సైతం సులభంగా బెయిల్ రావడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

జులై 20న పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు

విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలని, ప్రభుత్వం యువత గొంతు వినాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నీట్ వైఫల్యాలకు నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో జులై 20న జరగనున్న పార్లమెంట్ మార్చ్‌లో యువత భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన భరద్వాజ్.. "ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి, పొరపాటున కూడా స్మృతి ఇరానీని మళ్లీ విద్యాశాఖ మంత్రిని చేయొద్దు" అంటూ సెటైర్లు వేశారు. గత 19 రోజులుగా దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌కు రాజకీయ నాయకులు, పౌర సంఘాల నుంచి రోజురోజుకూ భారీ మద్దతు లభిస్తుండటం గమనార్హం.

Advertisement
Advertisement