త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cold Wave |ఎన్నడూలేని చలితో వణుకుతున్న తెలంగాణ : రికార్డు కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్‌లో రికార్డుస్థాయి తీవ్రమైన చలి నమోదైంది. పదేళ్లలో ఇవే అతి తక్కువ ఉష్ణోగ్రతలుగా వాతావరణ శాఖ  ప్రకటించింది.  కారణాలు, ప్రభావాలు, ఎప్పుడు తగ్గుతుందన్న అంచనాలు ఇలా ఉన్నాయి.

a

Telangana | Published On Dec 14, 2025, 7.07 pm IST

Telangana Cold Wave |ఎన్నడూలేని చలితో వణుకుతున్న తెలంగాణ : రికార్డు కనిష్ట ఉష్ణోగ్రతలు
Advertisement

Severe Cold Wave in Telangana: Causes, Impacts, IMD Forecast and Safety Measures Explained

  • తెలంగాణలో తీవ్రమైన శీతాకాలం
  • పదేళ్లలో ఇవే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు
  • తట్టుకోలేకపోతున్న పిల్లలు, వృద్ధులు
  • డిసెంబర్​ 20 తర్వాత సాధారణ స్థాయికి

త్రినేత్ర, హైదరాబాద్, డిసెంబర్ 14, 2025:

తెలంగాణ రాష్ట్రం ఈ వారం తీవ్ర చలికి వణికిపోతోంది. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తగ్గి, కొన్ని ప్రాంతాల్లో 6 డిగ్రీల దగ్గరికి పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం డిసెంబర్ 12న 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదు చేసి, గత పది సంవత్సరాల కనిష్ట రికార్డును తిరగరాసింది.

హైదరాబాద్​ వాతావరణ శాఖ డిసెంబర్ 13న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఈ శీతాకాల పరిస్థితులు డిసెంబర్ 15 వరకు కొనసాగే అవకాశం ఉంది. పగటిపూట 28 నుండి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నప్పటికీ, రాత్రి వేళ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రజలను, రైతులను, పశువులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. హైదరాబాదులో కూడా రాత్రి 10–12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు వెచ్చని దుస్తుల్లోనే బయటికొస్తున్నారు.

Villagers in Adilabad district, Telangana walking through heavy morning fog during the cold wave, carrying umbrellas and daily essentials.

డిసెంబర్ 12–13న నమోదైన తక్కువ ఉష్ణోగ్రతలు:

  • సంగారెడ్డి (కోహిర్): 5.8°C
  • రంగారెడ్డి: 6.0°C
  • ఆదిలాబాద్: 7.2°C
  • కామారెడ్డి: 7.5°C
  • మెదక్: 8.1°C
  • నల్గొండ: 9.3°C
  • హైదరాబాద్: 10.5°C

IMD సమాచారం ప్రకారం, ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5–6.4°C తక్కువ.

తెలంగాణలో ఈ తీవ్ర చలికి ప్రధాన కారణాలు

People warming themselves around a roadside fire in Telangana during the intense winter cold wave.

మొదటిది,  గాలిలో తేమ పరిమాణం చాలా తక్కువగా ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో హ్యూమిడిటీ స్థాయిలు 30–40 శాతానికి పడిపోయాయి. నీటి ఆవిరి గ్రీన్‌హౌస్ గ్యాస్‌లా భూమి ఉష్ణాన్ని తిరిగి కిందకి పంపే స్వభావం కలిగి ఉంటుంది. కానీ గాలిలో తేమ తగ్గిపోయినప్పుడు, భూమి నుంచి వెలువడే వేడి నేరుగా అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చోటుచేసుకోవడంతో సూర్యాస్తమయం తర్వాత వేడి నిల్వ ఉండకుండాపోతుండటంతో, రాత్రి వేళ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి.

రెండో కారణం,  ఆకాశం పూర్తిగా స్పష్టంగా ఉండటం. మేఘాలు లేకపోవడంతో భూమి నుంచి వెలువడే రేడియేషన్ ఏ నిరోధం లేకుండా బయటకు వెళ్లిపోతోంది. సాధారణ రోజుల్లో మేఘాలు ఈ వేడిలో ఒకభాగాన్ని కిందికి తిరిగి పంపిస్తాయి. ఇప్పుడు అది లేకపోవడంతో రాత్రి పూట “రేడియేటివ్ కూలింగ్” తీవ్రంగా పెరిగి చలి మరింత భీకరంగా మారింది.

మూడో కారణం,  ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు వీచుతున్న చల్లటి, పొడి ఉత్తర-ఈశాన్య గాలులు. బంగాళాఖాతం నుంచి వచ్చే తేమతో కూడిన వేడి గాలులు ప్రస్తుతం రాష్ట్రానికి చేరకపోవడంతో, ఉత్తర గాలులు అడ్డంకిలేకుండా రాష్ట్రాన్ని చల్లబరుస్తున్నాయి. ఈ మూడు పరిస్థితులు కలిసి 2025 డిసెంబర్‌ను తెలంగాణలో గత కొన్నేళ్లలోనే అత్యంత చల్లటి కాలంగా మార్చాయి.

20 జిల్లాల్లో చలి తీవ్రంగా కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్​ అలర్డ్​ జారీ చేసింది.

  • డిసెంబర్ 13: 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • డిసెంబర్ 14: 13 జిల్లాలు
  • డిసెంబర్ 15: 12 జిల్లాలు

ఈ చలి ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు తగ్గిపోయాయి. పంటలు మంచుతో దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రైతులు రాత్రిపూట పొలాల్లో కాపలా కాస్తున్నారు. పశువులు చలికి తట్టుకోలేక ఇబ్బంది పడతుండటంతో పశుసంరక్షణ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు ఏర్పడి రవాణాపై కూడా ప్రభావం చూపుతోంది. నగరాల్లో నిర్మాణ కార్మికులు, వ్యవసాయదారులు, డే లేబర్ వర్కర్లు తీవ్రమైన చలిలో పని చేయడం కష్టంగా మారింది.

డిసెంబర్​ 20 తర్వాత సాధారణ స్థాయికి

Dense fog covering a road in Hyderabad with a car driving slowly using headlights during severe winter conditions

ఈ చలి ఎప్పుడు తగ్గుతుంది? IMD తాజా అంచనాల ప్రకారం, డిసెంబర్ 15తర్వాత నుండి పరిస్థితి క్రమంగా మెరుగు పడే అవకాశం ఉంది. పశ్చిమ హిమాలయాలపై బలహీన వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో తూర్పు గాలులు ప్రారంభమవుతాయి. ఇవి ఉష్ణోగ్రతలను 2 నుండి 4 డిగ్రీల వరకు పెంచగలవని IMD చెబుతోంది. డిసెంబర్ 16నుంచి మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా. తెలంగాణలో మాత్రం రాత్రి చలి పూర్తిగా తగ్గడానికి 5–7 రోజులు పడుతుందని, డిసెంబర్ 20 తర్వాత పరిస్థితి సాధారణ శీతాకాల స్థాయికి చేరుకుంటుందని IMD తెలిపింది. అంటే డిసెంబర్ 15 తర్వాత నుంచి తీవ్రమైన శీతాకాలం తగ్గి, 12 నుండి 15 డిగ్రీల మధ్య సాధారణ శీతాకాలం తిరిగి వస్తుంది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య, వ్యవసాయ శాఖల ప్రజలను జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాయి. రాత్రి పూట బయటకు వెళ్లడం తగ్గించడం, చిన్నపిల్లలు–వృద్ధులకు వెచ్చని దుస్తులు వేయడం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయట పొగమంచు, దుమ్ము నివారించడం, పంటలను కప్పడం, పశువులకు వెచ్చదనం కల్పించడం వంటి సూచనలు జారీ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement