త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా

ఎల్-నినో వల్ల రాష్ట్రంలో వర్షాలు లేక రిజర్వాయర్లు ఎండిపోతున్న వేళ.. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టుల వాడకంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రభుత్వానికి కీలక సలహా ఇచ్చింది.

J

Telangana | Published On Jul 9, 2026, 8.31 pm IST

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో ఎల్-నినో (El Nino) ప్రభావంతో వర్షాలు తగ్గడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు 16-46 శాతం పడిపోయాయి. కానీ ప్రాణహిత నదిలో వరద ప్రవాహం ఉన్నందున మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టులను వినియోగించుకోవాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం (TREA) సూచించింది. బ్యారేజీలను కనిష్ఠ డ్రా-డౌన్ (MDDL) స్థాయిల వద్ద నిల్వ చేస్తే ఎలాంటి ముంపు, ప్రాణ నష్టం ఉండదని స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ మూడు పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్‌లోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Advertisement

Medigadda Barrage | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రైతులు తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎల్-నినో (El-Nino) ప్రభావంతో మాన్‌సూన్ వర్షాలు జాడలేవు. రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) లెక్కల ప్రకారం.. జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణ స్థాయికంటే 16-46 శాతం తక్కువగా ఉంది. ఇలాంటి సంక్షోభ సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టులను (Lifts) ఎలా సురక్షితంగా వినియోగించుకోవచ్చో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ (TREA) ఓ ప్రెస్ నోట్ ద్వారా ప్రభుత్వానికి వివరించింది.

ప్రాణహిత.. ఆశాకిరణం

రాష్ట్రంలో నీటి కటకట ఉన్నప్పటికీ.. ఒక్క ప్రాణహిత నది (Pranahita river) లో మాత్రం వినియోగించుకునేంత వరద ప్రవాహం అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా వాడుకోవడం ఒక్కటే బెస్ట్ ఆప్షన్ అని TREA అంటోంది. ప్రాణహిత వరద ప్రవాహం తగినంతగా ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశం మెండుగా ఉందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం గేట్లు పూర్తిగా తెరిచి ఉన్న పరిస్థితిలో ప్రాణహిత వరద నీటి మట్టం సుమారు +97.500 మీటర్లుగా ఉంది. ఈ లెవెల్స్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్ (Kannepalli pump house) రోజుకు సుమారు 3 టీఎంసీల (TMC) వరకు నీటిని లిఫ్ట్ చేయగలదు.

ముప్పు లేకుండా వాడుకోవచ్చు

నీరు సాఫీగా పైకి వెళ్లాలంటే అన్నారం, సుందిల్ల జలాశయాలను వాటి కనిష్ఠ డ్రా-డౌన్ (MDDL) స్థాయిల వద్దే నిల్వ చేయాలని TREA సూచించింది. అన్నారం వద్ద సుమారు +116.500 మీటర్లు, సుందిల్ల వద్ద +126.500 మీటర్ల లెవెల్ ఉంటే బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. అప్పుడు మూడు పంపింగ్ స్టేషన్లు ఒకేసారి కరెక్ట్ కో-ఆర్డినేషన్‌తో (Coordination) పనిచేయగలుగుతాయి. అన్నారంలో 5.1 టీఎంసీలు, సుందిల్లలో 3.78 టీఎంసీలు కలిపి మొత్తం 8.8 టీఎంసీల (TMC) నిల్వ సామర్థ్యం ఉంది.

ఒకవేళ పొరపాటున ఆ రెండు బ్యారేజీలు ఒకేసారి ప్రమాదానికి గురైనా, ఆ 8.8 టీఎంసీల నీరు సుమారు 1.02 లక్షల క్యూసెక్కుల (Cusecs) ప్రవాహ వేగంతో 24 గంటలు మాత్రమే నదిలో ఉంటుందని లెక్కగట్టి చెప్పారు. గతంలో మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిన సందర్భాలు ఉన్నాయని, కాబట్టి ఈ 8.8 టీఎంసీల నీటి వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం, ఊర్ల ముంపు (Submergence) ఉండదని గత అనుభవాలను గుర్తు చేశారు.

ఎల్లంపల్లికి తరలించండి

ప్రాణహితలో నీటి మట్టం మేడిగడ్డ MDDL కంటే ఎత్తుగా ఉన్నంతకాలం.. కన్నెపల్లి పంప్ స్టేషన్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి (Yellampalli) వరకు తరలించడం అన్ని విధాలా లాభదాయకమని ఇంజనీర్లు సూచించారు. సాంకేతిక నియమాలను పాటిస్తూ లిఫ్టులను నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు. ఎల్-నినో వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్లోకి తేవాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తమ సేవలను స్వచ్ఛందంగా అందించేందుకు సిద్ధమని TREA ప్రకటించింది.

Advertisement
Advertisement