త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా

JP Nadda | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆధునిక వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో ఈ సంస్థను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

P

Telangana | Published On Jul 9, 2026, 7.48 pm IST

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
Advertisement

JP Nadda | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆధునిక వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో ఈ సంస్థను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన అనంతరం నడ్డా మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నామని, నిర్మాణ పనులు 87 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.

దేశంలో ఒకప్పుడు ఢిల్లీలో మాత్రమే ఎయిమ్స్ అందుబాటులో ఉండేదని నడ్డా గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ హయాంలో ఐదు కొత్త ఎయిమ్స్‌లకు శ్రీకారం చుట్టామని, 2014 తర్వాత మరో 23 ఎయిమ్స్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. వాటిలో 14 ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన సంస్థలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రస్తుతం 24 వైద్య విభాగాలు సేవలు అందిస్తున్నాయని, రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు పూర్తయ్యాయని నడ్డా తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఔట్‌పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. అత్యవసర వైద్యం, ఆధునిక నిర్ధారణ పరీక్షలు, టెలీమెడిసిన్ సేవలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని, టెలీమెడిసిన్ ద్వారా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు.

పూర్తిస్థాయి బోధనా సిబ్బంది, అధునాతన వైద్య సదుపాయాలతో బీబీనగర్ ఎయిమ్స్ ఇప్పటికే కార్పొరేట్ స్థాయి సేవలు అందిస్తోందని నడ్డా అన్నారు. భవిష్యత్‌లో ఇది దేశానికి ఆదర్శంగా నిలిచే వైద్య సంస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎయిమ్స్ అధికారులతో నడ్డా సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement