త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | డయల్ 112తో మరింత వేగంగా అత్య‌వ‌స‌ర సేవ‌లు

DGP CV Anand | అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఒకే వేదిక ద్వారా తక్షణ సేవలు అందించేందుకు రూపొందించిన డయల్ 112 వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్-బీలో రెండు అంతస్తులను పూర్తిగా డయల్‌-112 సేవల కోసం కేటాయించినట్లు వెల్లడించారు.

P

Telangana | Published On Aug 5, 2026, 3.45 pm IST

DGP CV Anand | డయల్ 112తో మరింత వేగంగా అత్య‌వ‌స‌ర సేవ‌లు
Advertisement
  • ఏఐ, డ్రోన్ టెక్నాలజీతో పోలీసింగ్‌లో కొత్త అధ్యాయం
  • తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌

DGP CV Anand | అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఒకే వేదిక ద్వారా తక్షణ సేవలు అందించేందుకు రూపొందించిన డయల్ 112 వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్-బీలో రెండు అంతస్తులను పూర్తిగా డయల్‌-112 సేవల కోసం కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణలో అత్యవసర స్పందన వ్యవస్థకు 2013లో కొంపల్లిలో జీవీకే సహకారంతో డయల్‌-100ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ అత్యవసర సేవలకు ఒకే నంబర్ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో సూచనలు చేసిన నేపథ్యంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత సాంకేతికంగా ఈ వ్యవస్థను నిరంతరం అభివృద్ధి చేస్తూ వచ్చామని చెప్పారు.

ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి రావడంతో అనేక ప్రక్రియలు మరింత సులభతరమయ్యాయని డీజీపీ పేర్కొన్నారు. న్యాయ సహాయం, వైద్య సహాయం, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు సహా పలు అత్యవసర సమస్యలకు డయల్‌-112 సమగ్ర పరిష్కార వేదికగా పనిచేస్తుందని వివరించారు. డయల్ 112కు వచ్చే ప్రతి కాల్‌కు తప్పనిసరిగా స్పందించాలని పోలీసు సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్‌ను తిరస్కరించే అవకాశం ఉండదన్నారు. కాల్ అందిన వెంటనే కాలర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తున్నామని చెప్పారు.

సాంకేతిక పోలీసింగ్‌కు మరింత ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ పోలీసులు త్వరలో డ్రోన్ ఆధారిత వ్యవస్థను కూడా వినియోగంలోకి తీసుకురానున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రోన్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌ను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. డయల్ 112ను 3.0 వెర్షన్‌గా మరింత సమర్థవంతంగా రూపొందిస్తున్నామని, ఇందులో యువ ఐపీఎస్ అధికారులతో పాటు ఏఐ సాంకేతికతపై నైపుణ్యం కలిగిన నిపుణులను భాగస్వామ్యం చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement