త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mark Zuckerberg Apology | ‘3 రోజుల్లో క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే!’: మార్క్ జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ తీవ్ర హెచ్చరిక

ప్రధాని మోదీ రీల్ డిలీట్ చేసిన వ్యవహారంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 3 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది.

J

National | Published On Aug 5, 2026, 3.37 pm IST

Mark Zuckerberg Apology | ‘3 రోజుల్లో క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే!’: మార్క్ జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ తీవ్ర హెచ్చరిక

సంక్షిప్త సారాంశం

పీఎం మోదీ వీడియో తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ 3 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. క్షమాపణ చెప్పకపోతే ఐటీ చట్టం సెక్షన్ 79 కింద లభించే 'సేఫ్ హార్బర్' (రక్షణ కవచం) హోదాను రద్దు చేస్తామని హెచ్చరించింది. సాంకేతిక పొరపాటు (Algorithmic error) వల్ల వీడియో డిలీట్ అయిందని మెటా వివరణ ఇచ్చినప్పటికీ కమిటీ సంతృప్తి చెందలేదు. వీడియో వివాదంతో పాటు ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారులకు సంబంధించిన అభ్యంతరకర కంటెంట్‌పై కూడా ఐటీ మంత్రిత్వ శాఖ మెటాను ప్రశ్నించింది.

Advertisement

Mark Zuckerberg Apology | త్రినేత్ర.న్యూస్ : ఫేస్‌బుక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన రీల్‌ను తాత్కాలికంగా తొలగించిన వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు ముహూర్తం ఖరారు చేసింది. మూడు రోజుల్లోగా ఆయన ఈ వ్యవహారంపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో సంస్థ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ ప్రాసెస్, హోం మంత్రిత్వ శాఖలకు (MHA) లేఖ రాసినట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ నిషికాంత్ దూబే వెల్లడించారు.

క్షమాపణ చెప్పకపోతే 'సేఫ్ హార్బర్' రద్దు

ప్రధాని వీడియోను డిలీట్ చేయడం ఒక సోషల్ మీడియా వేదిక చేయాల్సిన పని కాదని, అది పబ్లిషర్ పాత్రను పోషించడమేనని దూబే స్పష్టం చేశారు. జుకర్‌బర్గ్ నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోతే ఐటీ చట్టం సెక్షన్ 79 ప్రకారం మెటాకు లభిస్తున్న 'సేఫ్ హార్బర్' (Safe Harbour) రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఏమిటీ 'సేఫ్ హార్బర్'?

ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కేవలం మధ్యవర్తులు (Intermediaries) మాత్రమే. వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు ప్లాట్‌ఫామ్‌లు చట్టపరంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రక్షణ రద్దయితే, వినియోగదారులు పెట్టే అభ్యంతరకర కంటెంట్‌పై మెటా అధికారులపై నేరుగా ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసేందుకు మార్గం సుగమమవుతుంది.

వివాదం ఏంటి?

జూలై 23న పేపర్ లీకేజీ వ్యతిరేక చట్టాలు, యువత భవిష్యత్తుపై ప్రధాని మోదీ ఒక సెల్ఫీ వీడియో రీల్‌ను పోస్ట్ చేశారు. అయితే, జూలై 28న ఫేస్‌బుక్ ఈ వీడియోను దాదాపు ఐదు గంటల పాటు బ్లాక్ చేసింది.

తీవ్ర విమర్శలు రావడంతో మెటా యాజమాన్యం వీడియోను పునరుద్ధరించింది. అల్గారిథమ్ పొరపాటు (Algorithmic Error) వల్లే సాంకేతిక సమస్య తలెత్తిందని, దానికి క్షమాపణలు చెబుతున్నామని మెటా ప్రతినిధులు పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. అయితే, ఈ వివరణపై ప్రభుత్వం కానీ, ప్యానెల్ కానీ సంతృప్తి చెందలేదు. కొద్దిసేపు రీల్ తీసేయడం అనేది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కమిటీ అభివర్ణించింది.

ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష

ఈ వివాదం వేళ మెటా గ్లోబల్ టీమ్.. ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో భేటీ అయింది. కేవలం ప్రధాని వీడియో అంశమే కాకుండా.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో చిన్నారులపై అభ్యంతరకర కంటెంట్ (CSAM), ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్న ఫేక్ కంటెంట్‌పై ప్రభుత్వం మెటాను తీవ్రంగా ప్రశ్నించింది.

భారత చట్టాలను ప్రతి సోషల్ మీడియా సంస్థ ఖచ్చితంగా గౌరవించి తీరాలని కేంద్రం గట్టి సందేశాన్ని ఇచ్చింది. గడువు ముగుస్తుండటంతో జుకర్‌బర్గ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు టెక్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement