త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alleti Maheshwar Reddy vs Ministers | ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి వ‌ర్సెస్ మంత్రులు.. శాస‌నస‌భ‌లో గాంధీ – గాడ్సే వివాదం

Alleti Maheshwar Reddy vs Ministers | శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ ఊహించ‌ని విధంగా గాంధీ - గాడ్సే వివాదంపై దుమారం రేగింది. బీజేపీఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి బ‌డ్జెట్‌పై మాట్లాడుతుండ‌గా.. మంత్రి సీతక్క అడ్డు త‌గిలి గాంధీని చంపింది గాడ్సేనే అని వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Mar 24, 2026, 3.30 pm IST

Alleti Maheshwar Reddy vs Ministers | ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి వ‌ర్సెస్ మంత్రులు.. శాస‌నస‌భ‌లో గాంధీ – గాడ్సే వివాదం
Advertisement

Alleti Maheshwar Reddy vs Ministers | త్రినేత్ర‌.న్యూస్ : శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ ఊహించ‌ని విధంగా గాంధీ - గాడ్సే వివాదంపై దుమారం రేగింది. బీజేపీఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి బ‌డ్జెట్‌పై మాట్లాడుతుండ‌గా.. మంత్రి సీతక్క అడ్డు త‌గిలి గాంధీని చంపింది గాడ్సేనే అని వ్యాఖ్యానించారు. దీంతో స‌భ‌లో బీజేపీ, మంత్రుల మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం జ‌రిగింది. మంత్రి సీతక్క‌తో పాటు పొన్నం ప్ర‌భాక‌ర్, వాకిటి శ్రీహ‌రి కూడా క‌ల్పించుకొని బీజేపీ ఎమ్మెల్యేల‌పై భ‌గ్గుమ‌న్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై బీజేపీఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. భ‌ట్టి బ‌డ్జెట్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం నుంచి అనేక నిధులు రాష్ట్రానికి వ‌చ్చాయ‌ని ఆయ‌న తెలుపుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరును త‌ప్పుబ‌ట్టారు.

గాడ్సే ఎవ‌రు చెప్పండి : మంత్రి సీత‌క్క 

మంత్రి సీత‌క్క క‌ల‌గ‌జేసుకుని.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంలో గాంధీ పేరును తొల‌గించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం. గాంధీ స్వాతంత్య్రం కోసం ఒంటి మీద బ‌ట్ట లేకుండా స‌ర్వ‌స్వం త్యాగం చేశారు. గాడ్సే చేతిలో చంప‌బ‌డ్డ గాంధీ పేరు తొల‌గించారు. గాంధీని కూడా తిడుతారా..?. గాంధీ ఏం అన్యాయం చేశారు. దేశం కోసం పోరాటం చేశారు. ఇదే ఆర్ఎస్ఎస్‌ను నిషేధించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హాన్ని గుజ‌రాత్‌లో పెడుతారు. ప‌టేల్ ఏమో గొప్ప అయిండు.. ఆయ‌న కూడా మా పార్టీ సిద్ధాంతాల‌తో ప‌ని చేసిండు. ఎందుకు డివియేష‌న్ తీసుకువ‌స్తున్నారు. మీకు చ‌రిత్ర‌లో చ‌రిత్ర లేదు. మా చ‌రిత్ర‌ను నాశ‌నం చేస్తున్నారు. గాడ్సే ఎవ‌రు చెప్పండి.. గాడ్సేకు నివాళుల‌ర్పిస్తూ.. పోరాట యోధుడు అంటున్న‌రు. గాండ్సేను పొగ‌డ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని సీత‌క్క నిల‌దీశారు.

ఆర్ఎస్ఎస్‌తో గాడ్సేకు ఎలాంటి సంబంధం లేదు : ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

అనంత‌రం ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్‌తో గాడ్సేకు ఎలాంటి సంబంధం లేదు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ మెంబ‌ర్ కానే కాదు. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్ప‌ష్ట‌త ఇచ్చింది. మంత్రి సీత‌క్క ఆమె వ్యాఖ్య‌ల‌ను విత్ డ్రా చేసుకోవాలి. రికార్డుల నుంచి తొల‌గించాల‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.

గాంధీని ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్ట‌లేదు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. 12 ఏండ్లుగా తెలంగాణ‌కు బీజేపీ ఏం ఇచ్చిందో చ‌ర్చ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు ద‌క్క‌లేదు. మ‌రి మాకు నిధులు కావాల‌ని మీ ప్ర‌ధానిని క‌నీసం అడిగారా..? కేంద్రీయ విద్యాల‌యాలు, న‌వోద‌య విద్యాల‌యాలు కేటాయించ‌లేదు. ప్ర‌త్యేక నిధులు రాలేదు. ప‌క్క రాష్ట్రానికి నిధులు త‌ర‌లిస్తుంటే.. ప్రేక్ష‌కుల్లా ముద్ద‌ప‌ప్పు తిని కూర్చున్న‌ట్టు కూర్చొని మాట్లాడుతున్న‌రు. కుండువాలు వేసుకొని రామ‌భ‌క్తి అంటే స‌రిపోదు. 30 ఏండ్ల దేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీని ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్ట‌లేదు. మీరు అధికారంలోకి రాగానే గాంధీని తుపాకీ పెట్టి కాల్చారు. మేం కూడా రామ‌భ‌క్తుల‌మే. మేం చ‌దివిన మంత్రాలు చ‌ద‌వండి. మేం బొట్టు పెట్టుకోమా..? బీజేపీలో ఉంటేనే హిందువుల‌మా..? మేమే దేశం అన్న‌ట్టు మీరు మాట్లాడ‌డం స‌రికాదు. తెలంగాణ‌కు నిధులు తీసుకురండి.. లేదా దుకాణానికి తాళం వేసుకోండి. అసెంబ్లీ ముంగిట అల్ల‌రి చేయ‌డ‌మే కాకుండా.. నియంతృత్వ ప్ర‌భుత్వ‌మ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకోం. బీజేపీ రాష్ట్రానికి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడాల‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ కౌంట‌ర్ ఇచ్చారు.

గాంధీని చంపిన గాడ్సేను పొడిగితే ఎట్ల‌..? : వాకిటి శ్రీహ‌రి

త‌ద‌నంత‌రం వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ.. నేను గుడికి పోయి బొట్టు పెట్టి దేవుడికి మొక్క‌నిది నీళ్లు తాగ‌ను. నాకూ దేవుడు ఉన్నాడు. ప్ర‌పంచ దేశాలు గాంధీకి దండం పెడుతున్నాయి. మ‌రి గాంధీని చంపిన గాడ్సేను పొడిగితే ఎట్ల‌..? ఎవ‌రి మ‌తం వాళ్ల‌కు ఉంది. ఉత్తి మాట‌లొద్దు ఆచ‌ర‌ణ‌లో పెట్టండి.. ఆచ‌ర‌ణ‌లేని మాట‌లు వ‌ద్దు. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయించిండు.. అయినా కూడా బొమ్మ పెట్టారు. మ‌న ధ‌ర్మాన్ని కాపాడుకుంటూ ఇత‌రుల ధ‌ర్మాన్ని కూడా గౌర‌వించండి. గాంధీని గాడ్సే చంపారు.. దీన్ని స‌మ‌ర్థిస్తారా..? లేదా..? అని వాకిటి శ్రీహ‌రి నిల‌దీశారు.

గాంధీని గాడ్సే చంపిన మాట వాస్త‌వం : ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

ముగ్గురు మంత్రులు మాట్లాడిన అనంత‌రం ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ స‌బ్జెక్టు ఎందుకు వ‌చ్చింది. గాంధీని గాడ్సే చంపిన మాట వాస్త‌వం.. అది ప్ర‌పంచానికి తెలుసు. గాడ్సేకు ఆర్ఎస్ఎస్‌తో సంబంధం లేదు. స‌బ్జెక్టును డివియేట్ చేయ‌డం సరికాదు. పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతుంటే.. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల‌కు బ‌డ్జెట్ ఎందుకు త‌గ్గించారో చెప్తా అనుకున్నా.. కానీ గాంధీ - గాడ్సే వివాదాన్ని లాగారు. కానీ రూ. 13 ల‌క్ష‌ల కోట్లు కేంద్రం ఇచ్చింది.. మంత్రులు స‌బ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి అని మ‌హేశ్వ‌ర్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement