త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ప్రజా సమస్యలు ముఖ్యమా? కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా..? రేవంత్ స‌ర్కార్‌ను నిల‌దీసిన హ‌రీశ్‌రావు

Harish Rao | శాసనసభ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయ‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. స‌భా మ‌ర్యాద‌లు పాటించ‌కుండా నియ‌మ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్క‌రాని నిప్పులు చెరిగారు. కేర‌ళ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం 30వ తేదీ వ‌ర‌కే స‌భ న‌డ‌ప‌డం స‌రికాద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Mar 31, 2026, 3.50 pm IST

Harish Rao | ప్రజా సమస్యలు ముఖ్యమా? కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా..? రేవంత్ స‌ర్కార్‌ను నిల‌దీసిన హ‌రీశ్‌రావు
Advertisement

ఆరు గ్యారెంటీల‌పై స్ప‌ష్ట‌త లేదు..
ఒక్క నోటీసుపై కూడా చ‌ర్చ లేదు..
స‌భా సాంప్ర‌దాయాల‌కు తిలోద‌కాలు
డిఫెన్స్‌లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాలపై ఎదురుదాడి
రేవంత్ భాష‌పై కూడా ఎథిక్స్ క‌మిటీకి వెళ్లాలి
కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ నిరంత‌ర పోరాటం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : శాసనసభ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయ‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. స‌భా మ‌ర్యాద‌లు పాటించ‌కుండా నియ‌మ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్క‌రాని నిప్పులు చెరిగారు. కేర‌ళ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం 30వ తేదీ వ‌ర‌కే స‌భ న‌డ‌ప‌డం స‌రికాద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలపై స్పష్టత వస్తుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర నిరాశనే మిగిలించింది. బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికి, రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి మాత్రమే తూతూ మంత్రంగా సభను నడిపారు. నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం కనీసం ముందుకు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా, ఏ ఒక్క అంశం పైనా ప్రభుత్వం చర్చకు రాలేదు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఒక్క ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం కూడా లేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ఉంది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. నియమ నిబంధనలు, సభా మర్యాదలను తుంగలో తొక్కార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు.. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రజా సమస్యల మీద సూటిగా సమాధానం చెప్పకుండా తొండల భాష, కండల భాష వాడారు. రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు సభానాయకుడి హోదాకు తగినది కాదు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదు. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నించడమే ప్రతిపక్ష బాధ్యత. ఆ బాధ్యతను బీఆర్ఎస్ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైనా, అప్రాప్రియేషన్ రోజైనా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఎత్తివేసింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు, ఆర్థిక మంత్రి బడ్జెట్ పెట్టిన రోజు ప్రశ్నోత్తరాలు లేవు. సభ జరిగిన రోజుల్లో సగం రోజులు ప్రశ్నోత్తరాలు నడపలేదు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

శాసనసభను గాంధీభవన్‌లాగా మార్చేశారు..

ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీని సమయానికి ప్రారంభించలేదు. బీఏసీ సమావేశంలో ఉదయం 8:30కి ప్రారంభించాలని అడిగాం. 10 గంటలకు ప్రారంభిస్తామని చెప్పి ఏ రోజూ పదింటికి కూడా మొదలుపెట్టలేదు. సమయపాలన లేదు, సభ అంటే గౌరవం లేదు. శాసనసభను గాంధీభవన్‌లాగా మార్చేశారు. అసెంబ్లీలో టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట ఉంటుంది. కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నాడని ఏకంగా 4 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని 3 గంటలపాటు సభను ఆపి వెయిట్ చేయించారు. ప్రిపరేషన్ ఇంట్లో చేసుకోవాలి కానీ సభకు వచ్చాక చేస్తారా..? కావాలనే లేట్ నైట్ వరకు సభ నడిపి, సభ్యులు లేకుండా చేయాలని చూశారని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

రోజురోజుకూ తగ్గిపోతున్న అసెంబ్లీ పని దినాలు..

అసెంబ్లీ పని దినాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. వారం రోజులు సభను ఎక్స్‌టెండ్ చేయమని అడిగినా ప్రభుత్వం ముందుకు రాలేదు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా? లేక కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా..? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే.. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారు. రవీంద్రభారతిలో నాటకాలు వేశారని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

కావాల‌నే హేట్ స్పీచ్ బిల్లును చివ‌రి రోజు తెచ్చారు..

అవినీతి నుంచి మంత్రిని కాపాడటానికే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి, ప్రతిపక్షం లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నారు. హేట్ స్పీచ్ బిల్లును చివరి రోజు తెచ్చి ఎలాంటి చర్చ లేకుండానే ముగించారు. పద్దులన్నీ లాస్ట్ రోజు పెట్టి గిలెటిన్ చేసుకొని పారిపోయారు. ఇరిగేషన్ పద్దు మీద కూడా కనీస చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. హౌస్ కమిటీ పనికిరాదని చెప్పి, శాసనసభ్యులకు, శాసనసభకు గౌరవాన్ని తగ్గించార‌ని మాజీ మంత్రి నిప్పులు చెరిగారు.

చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపాం..

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇద్దరూ మా బడ్జెట్ చింపుతారా? అని మాట్లాడుతున్నారు. మీ బడ్జెట్‌లో ఏమీ లేదు.. అది పూర్తిగా డొల్ల బడ్జెట్. కాబట్టే చింపి మా నిరసనను వ్యక్తం చేశాం. ఈ విమర్శ ఆర్థిక మంత్రి భట్టిని వ్యక్తిగతంగా అన్నది కాదు, ఆ హోదాలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. మీరు ప్రవేశపెట్టింది మూడో బడ్జెట్, మిగిలింది ఇంకొక్కటే బడ్జెట్. కోటి మంది మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తానని చెప్పి మూడు బడ్జెట్లలో ఎందుకు నిధులు పెట్టలేదు. అవ్వాతాతలను, రైతన్నలను, నిరుద్యోగులను, విద్యార్థులను, మహిళలను.. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు. గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజల చెవిలో పూలు పెట్టింది మీరే. మీ మోసాలను అర్థం చేయించడానికే సభలో వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపామని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

కత్తుల కోలాటం ఆడుతార‌ట‌.. తలలు తీస్తార‌ట‌..

కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని అడిగితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలే అని వారే శాసనసభకు ఇచ్చిన సమాధానంతో స్పష్టమైంది. నిరుద్యోగుల ఆకాంక్షను సభలో గట్టిగా వినిపించాం. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని రుజువు చేశాం. బీసీల గొంతుకగా బీఆర్ఎస్ పోరాడింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై కూడా స్పష్టంగా బహిర్గతం చేశాం. రెండున్నరేళ్లలో దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వ వైనాన్ని సభా సాక్షిగా ఎండగట్టాం. దళితులపై రేవంత్ రెడ్డిది కేవలం కపట ప్రేమ మాత్రమే. కాంగ్రెస్ సభ్యులు సభలో కత్తుల కోలాటం ఆడుతాం, తలలు తీస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని పైల్వాన్ల భాష మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ప్రోత్సహించారు. ఈ వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయరు? రేవంత్ రెడ్డి రెండేళ్లుగా సభలో మాట్లాడుతున్న భాష కూడా ఎథిక్స్ కమిటీకి వెళ్లాల్సిందే అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం నిరంతరం

చిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది. మాకు శాసనసభ మాత్రమే వేదిక కాదు, ప్రజాక్షేత్రంలో అన్ని వేదికలపైనా ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతాం. కేసీఆర్ ఆదేశాల మేరకు, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement