త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AYUSH Students Stipend Hike | స్టైపెండ్ డబుల్.. ఆయుష్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ గిఫ్ట్

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అల్లోపతి మెడికోలతో సమానంగా వీరి స్టైపెండ్‌ను ఏకంగా డబుల్ చేస్తూ మంత్రి దామోదర రాజనర్సింహ జీవో జారీ చేశారు.

J

Telangana | Published On Sep 9, 2026, 6.03 pm IST

AYUSH Students Stipend Hike | స్టైపెండ్ డబుల్.. ఆయుష్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ గిఫ్ట్

సంక్షిప్త సారాంశం

ఆయుష్‌ (ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి) హౌస్‌ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్ రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా జీవో ప్రకారం హౌస్‌ సర్జన్ల స్టైపెండ్ రూ.13,754 నుంచి రూ.29,792కు.. పీజీ స్టూడెంట్స్ స్టైఫండ్‌ రూ.34,385 నుంచి రూ.74,482కు పెరిగింది. స్టైఫండ్ పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఆయుష్ విధానాలపై సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలని మంత్రి యువ వైద్యులకు సూచించారు.

Advertisement
  • అల్లోపతి మెడికోలతో సమానంగా పెంపు

AYUSH Students Stipend Hike | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని ఆయుష్ (AYUSH) విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లో ప్రాక్టీస్ చేస్తున్న హౌస్‌ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌ను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అల్లోపతి (Allopathy) మెడికోలతో సమానంగా వీరికి కూడా స్టైపెండ్ పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం అధికారిక జీవో (GO) జారీ చేశారు.

కొత్త స్టైపెండ్ వివరాలు.. విద్యార్థుల హర్షం

తాజా జీవో ప్రకారం.. ఇప్పటివరకు హౌస్‌ సర్జన్లకు నెలకు అందుతున్న రూ.13,754 స్టైపెండ్‌ను రూ.29,792 కు పెంచారు. అలాగే, పీజీ విద్యార్థుల గౌరవ వేతనం రూ.34,385 నుంచి ఏకంగా రూ.74,482 కు చేరింది. స్టైపెండ్‌ను డబుల్ చేయడం పట్ల ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారికి స్వయంగా జీవో కాపీని అందజేశారు. పదేళ్ల గత ప్రభుత్వ పాలనలో తమ స్టైపెండ్ ఒక్క రూపాయి కూడా పెరగలేదని, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అల్లోపతి డాక్టర్లతో సమానంగా తమను గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు.

చదువుతో ఆగిపోవద్దు.. రీసెర్చ్ చేయండి: మంత్రి దామోదర్

ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. మంచి వైద్యులుగా ఎదిగి పేదలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. "మీరు కేవలం చదువుతో ఆగిపోవద్దు.. పరిశోధన వైపు కూడా అడుగులు వేయాలి. మన సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక సైంటిఫిక్ రీసెర్చ్‌తో (Scientific research) అనుసంధానం చేసి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది" అని మంత్రి స్పష్టం చేశారు. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం కాదని, సమాజంలో గుణాత్మక మార్పునకు పునాది అని ఆయన పేర్కొన్నారు.

ఆయుష్‌ బలోపేతానికి భారీగా నిధులు, నియామకాలు

ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఆయుష్ వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కీలక అడుగులు వేసిందని మంత్రి వెల్లడించారు. ప్రజలకు యోగా, ఆరోగ్య అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించినట్లు తెలిపారు. అలాగే ఆయుర్వేదం, హోమియోపతి, యునాని విభాగాల్లో 138 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను రిక్రూట్ చేసి వైద్య విద్యను బలోపేతం చేశామన్నారు.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా.. సిద్ధిపేట్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్‌లో రూ.15 కోట్ల వ్యయంతో మరో 50 పడకల ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలోని ఆయుష్ ఆసుపత్రులు, క్లినిక్‌లను దశలవారీగా అప్‌గ్రేడ్ చేస్తూ.. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement