త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Subhash Chandra | సుభాష్‌ చంద్రకు బ్యాంకుల షాక్.. అప్పీలేట్‌కి వెళ్లనున్న ప్ర‌భుత్వ రంగ ఆర్థిక సంస్థ‌లు..

Subhash Chandra | ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో ఆయన సమర్పించిన రుణ చెల్లింపు ప్రణాళికను ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యతిరేకించాయి.

S

Business | Published On Aug 29, 2026, 5.16 pm IST

Subhash Chandra | సుభాష్‌ చంద్రకు బ్యాంకుల షాక్.. అప్పీలేట్‌కి వెళ్లనున్న ప్ర‌భుత్వ రంగ ఆర్థిక సంస్థ‌లు..
Advertisement

Subhash Chandra | ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో ఆయన సమర్పించిన రుణ చెల్లింపు ప్రణాళికను ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యతిరేకించాయి. ఈ ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ నిర్ణయాన్ని అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ అయిన నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో సవాల్‌ చేయనున్నట్లు ఈ మూడు సంస్థలు వెల్లడించాయి. సుభాష్‌ చంద్ర దివాలా ప్రక్రియలో తమకు మొత్తం కలిపి 8.45 శాతం ఓటింగ్‌ వాటా ఉందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపాయి. అయినప్పటికీ తమ వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా రీపేమెంట్‌ ప్లాన్‌కు ఆమోదం లభించిందని పేర్కొన్నాయి.

అప్పీల్ దాఖ‌లు చేస్తాం: బ్యాంకులు

ఇతర ఆర్థిక రుణదాతలు కలిపి 80.81 శాతం ఓట్లను రీపేమెంట్‌ ప్లాన్‌కు అనుకూలంగా వేయడంతో అది చివరకు ఆమోదం పొందిందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్ ఒక‌ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంపై ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలతో కలిసి వెంటనే ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్‌ దాఖలు చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. కెనరా బ్యాంక్‌ కూడా రీపేమెంట్‌ ప్లాన్‌ను తాము వ్యతిరేకించి ఓటు వేసినట్లు వెల్లడించింది. సుభాష్‌ చంద్ర సమర్పించిన రూ.6.25 కోట్ల రీపేమెంట్‌ ప్లాన్‌కు కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలిపింది. ఇందులో కెనరా బ్యాంక్‌కు 1.60 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 0.76 శాతం, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు 6.09 శాతం ఓటింగ్‌ వాటా ఉంది.

ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన కెన‌రా బ్యాంక్‌..

కేసులో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని కూడా తాము కోరినట్లు కెనరా బ్యాంక్‌ తెలిపింది. అయితే తమకు ఉన్న మైనారిటీ ఓటింగ్‌ వాటా కారణంగా ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించలేదని పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్‌సీఎల్‌ఏటీలో సవాల్‌ చేయనున్నట్లు వెల్లడించింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి సుభాష్‌ చంద్ర రిజల్యూషన్‌ ప్లాన్‌ను తిరస్కరించినట్లు తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ ముందు కూడా దాని ఆమోదాన్ని వ్యతిరేకించినట్లు పేర్కొంది. అయితే కొంతమంది ప్రైవేట్‌ రుణదాతలు మెజారిటీ ఓటింగ్‌తో ఈ ప్లాన్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ఎన్‌సీఎల్‌టీ దానిని ఆమోదించిందని యూనియన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఎన్‌సీఎల్‌ఏటీలో సవాల్‌ చేస్తామని వెల్లడించింది.

రూ.22వేల కోట్ల రుణానికి రూ.6.5 కోట్ల చెల్లింపుల‌కు ఆమోదం..

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ దాఖలు చేసిన వ్యక్తిగత దివాలా కేసులో సుభాష్‌ చంద్ర సమర్పించిన రీపేమెంట్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుల ప్రకారం.. రూ.22వేల కోట్లకు పైగా ఉన్న అంగీకరించిన రుణదాతల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సుభాష్‌ చంద్ర రూ.6.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా ఈ నిర్ణయంపై అప్పీల్‌ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తీర్మానాన్ని తాము వ్యతిరేకించి ఓటు వేసినప్పటికీ మెజారిటీ ఓట్లతో అది ఆమోదం పొందిందని బ్యాంక్‌ విడుదల చేసిన ఒక‌ ప్రకటనలో తెలిపింది. నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌లో అప్పీల్‌ దాఖలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుల ప్రకారం తమకు రావ‌ల్సిన మొత్తం క్లెయిమ్‌లో ఆమోదం పొందిన మొత్తం 3.2 శాతం మాత్ర‌మేన‌ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. బ్యాంకుల విలీనానికి ముందు తన మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఈ రుణ సదుపాయాన్ని తాము స్వీకరించినట్లు కూడా బ్యాంక్‌ పేర్కొంది.

Advertisement
Advertisement