త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాల‌పై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు..!

Supreme Court | పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఇద్దరు మేజర్లు శారీరక సంబంధం కొనసాగించడం మాత్రమే వారి వ్యక్తిత్వాన్ని, నైతిక ప్రవర్తనను ప్రశ్నించడానికి ఆధారం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం సరైన పద్ధతి కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

P

Telangana | Published On Jun 8, 2026, 6.18 pm IST

Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాల‌పై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు..!
Advertisement

Supreme Court | పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఇద్దరు మేజర్లు శారీరక సంబంధం కొనసాగించడం మాత్రమే వారి వ్యక్తిత్వాన్ని, నైతిక ప్రవర్తనను ప్రశ్నించడానికి ఆధారం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం సరైన పద్ధతి కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి పోలీసు కానిస్టేబుల్ పోస్టుకు తాత్కాలికంగా ఎంపికయ్యాడు. అయితే, 2014లో అత‌నిపై ఒక యువతి “పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు” అంటూ ఫిర్యాదు చేయ‌గా.. క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది.

అనంతరం 2015లో ఈ వివాదం లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కేసు ముగిసిపోయింది. అయినప్పటికీ, ఆ కేసును ప్రస్తావిస్తూ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అతని నియామకాన్ని రద్దు చేసింది. దీంతో తిరుపతి న్యాయపోరాటం ప్రారంభించి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారాన్ని విచారించిన జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆధునిక సమాజంలో ప్రేమ సంబంధాలు, పరస్పర అంగీకారంతో ఏర్పడే సహజ సంబంధాలు పెరిగాయని, ప్రతి ప్రేమకథ వివాహంతోనే ముగియాలనే నియమం ఎక్కడా లేదని వ్యాఖ్యానించింది. ఒక సంబంధం విఫలమైందనే కారణంతోనే మోసం జరిగిందని తేల్చేయడం సరైంది కాదని పేర్కొంది.

అలాగే, లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిందంటే అది అభ్యర్థి నేరాన్ని అంగీకరించినట్లుగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదు చేసిన మహిళ స్వచ్ఛందంగా రాజీకి రావడం, కేసును కొనసాగించకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అతడిని “చెడు క్యారెక్టర్ ఉన్న వ్యక్తి”గా ముద్ర వేయడం చట్టబద్ధం కాదని తెలిపింది. ఉద్యోగ నియామకాలలో వ్యక్తిగత నైతిక అభిప్రాయాల కంటే చట్టపరమైన వాస్తవాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. చివరగా, తిరుపతి నియామకాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అతడిని తిరిగి స‌ర్వీస్‌లోకి తీసుకుని తదుపరి బ్యాచ్ కానిస్టేబుళ్లతో కలిసి శిక్షణకు పంపాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల‌ను స‌మ‌ర్థించింది.

Advertisement
Advertisement