త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి

Visakha Steel Plant | విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్–2 విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

P

National | Published On Jun 8, 2026, 7.07 pm IST

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి
Advertisement

Visakha Steel Plant | విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్–2 విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కన్వేయర్ సిస్టమ్ ద్వారా హాట్ మెటల్ (మరుగుతున్న ఉక్కు ద్రవం) ఉన్న ల్యాడిల్స్‌ను తరలిస్తున్న సమయంలో అవి ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో అత్యంత ఉష్ణోగ్రతలో ఉన్న ద్రవ ఉక్కు కింద పని చేస్తున్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. సమీపంలో ఉన్న మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్టీల్‌ప్లాంట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించిన సీఎం, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా ప్రమాదంపై స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement